koodali

Monday, October 31, 2011

ఇక నేను నీతులు చెప్పటానికి కుదరదేమో ? అని తెగ కంగారుపడ్డాను.

దీపావళికి ముందు రోజున నేను బయటకు వెళ్ళినప్పుడు, రోడ్డుపైన చాలామంది ఒకరితోఒకరు దీపావళి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు,.


వారి మధ్యన ఒక బిచ్చమెత్తుకునే వ్యక్తి తిరుగుతూ , అందరినీ భిక్షం అడుగుతున్నాడు.

మాకు తెలిసినవారు కూడా నాకు శుభాకాంక్షలు చెబుతుంటే , ఆ వ్యక్తి నా వద్దకు వచ్చి , ఆకలిగా ఉంది ఏమైనా డబ్బు ఇవ్వమని అడగటం జరిగింది.

నాకు తోచింది కొద్దిగా ఇచ్చాను కానీ, మనసంతా బాధగా, చిరాగ్గా అయిపోయింది.


ఒకోసారి మనం బయటకు వెళ్ళినప్పుడు కొందరు చిన్నపిల్లలు మన వెనకాలే పడి డబ్బులు అడుగుతుంటారు.

పెద్దవాళ్ళు వెనకాల ఉండి ఈ పిల్లలను పంపిస్తుంటారు. ఇలాంటివి చూసినప్పుడు పిల్లలమీద జాలి , పెద్దవాళ్ళమీద కోపం వస్తాయి.


వాళ్ళకు డబ్బు ఇచ్చి ప్రోత్సహించకూడదు అనిపిస్తుంది.

కానీ, ఈ రోజుల్లో బ్రతకటానికి వాళ్ళకి వేరే దారి లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ? అనిపిస్తుంది.


కోట్లాది రూపాయలు ఉన్న వాళ్ళు కూడా ఇంకాఇంకా సంపాదన కోసం ప్రజలను తినేస్తుంటే ఇలాంటి పేదవాళ్ళను ఏం అనగలం ?


వాళ్లకు బ్రతకటానికి మంచి ఉపాధి చూపాలి. అప్పుడు వాళ్ళు మాత్రం అలా భిక్షమెత్తి ఎందుకు బ్రతుకుతారు. ?


ఒక వైపు శుభాకాంక్షలు...మరొక వైపు ఆకలికేకలు ఏమిటో ఇదంతా ? అనిపించింది .

కొందరికి కోట్ల రూపాయలు ఖరీదు చేసే కార్లు ఉంటాయి. కొందరికి కూటికి కూడా కరువే.
 

ఇలా సంపద కొందరి దగ్గర అతి ఎక్కువగా ,కొందరి దగ్గర అతి తక్కువగా ఉండటం అన్యాయం కదా !


భూమి మీద అభివృద్ధి
జరిగి(పోయింది ) .ఇక అంగారకుడి పైకి వెళ్ళిపోతున్నాము అంటున్నారు కానీ, అంగట్లో సరుకుల రేట్లే అందరానంతగా పెరిగిపోతున్నాయి.

ఎంతోమంది మేధావులు ఉన్నారు.


అయినా దేశంలో ఆకలికేకలు, విపరీతమైన మురికి, చెత్తకుప్పలు , గబ్బుకొట్టే గవర్నమెంట్ ఆస్పత్రులు, తుపుక్కున ఊసే వీధులు ....... సిగ్గుగా అనిపిస్తున్నది కదూ !


టివి సీరియల్స్లో చూపించే ఇళ్ళను చూస్తే , ఇండియా ఇంత గొప్పగా ఉంటుంది కాబోలు అని భ్రమపడి విదేశీయులు ఎవరైనా ఇక్కడికి వస్తే .....అంతే సంగతులు.


దేశాన్ని కొద్దిగానైనా బాగుచేసుకోలేనంత చేతకానివాళ్ళంగా మనం ఎందుకు తయారయ్యామో ?

ఆ మధ్యన హజారే సాబ్ అవినీతి గురించి దీక్ష చేసినప్పుడు జనంలో కొద్దిగా కదలిక వచ్చింది.

క్రికెట్ ఆటలు, చీర్ లీడర్ల చిందులు, అర్ధనగ్నసినిమాల నుంచి కొద్దిగాపక్కకు వచ్చి హజారే సాబ్కు మద్దతు ఇచ్చినప్పుడు,

దేశానికి మంచి రోజులు వచ్చేస్తున్నాయేమో ? ఇక నేను నీతులు చెప్పటానికి కుదరదేమో ? అని తెగ కంగారుపడ్డాను.

ఇప్పుడు పాపం పెద్దాయన కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు.

ఆయన ( హజారే ) ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ దీక్ష చేసేవరకూ జనం ఇలా రెస్ట్
తీసుకుంటూ కాలక్షేపం చేస్తారు కాబోలు.

అయినా, ఎవరికీ వారు నిజాయితీగా,
సక్రమంగా జీవిస్తే అవినీతి...వంటివి ఎందుకు ఉంటాయి ?.

ఈ మధ్యన ఒక వార్త చూశాను. అవినీతి సొమ్ము విదేశాల నుంచి తెచ్చేసి జనాలపేరిట ఉచితంగా వేస్తున్నారని ప్రచారం జరిగిందట,


ఇక చూడండి. జనం వేలం వెర్రిగా పోస్ట్ ఆఫీసులముందు క్యూలు కట్టి మరీ నించున్నారట,( ఇది మన రాష్ట్రంలోనే జరిగింది. )

ఇది చూశాక నాకు అనిపించింది.

ఈ ప్రజలను ఎవరు మాత్రం బాగుచెయ్యగలరు ? వాళ్ళ ఖర్మకు వాళ్ళను వదిలెయ్యటం తప్ప ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు ? అని.


హజారేగారి దీక్షకు ప్రజలు ఇచ్చిన మద్దతు చూస్తే చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది.

ఇంతమంది అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు .

మరి లంచాలు ఇస్తున్నదెవరు ? పుచ్చుకుంటున్నదెవరు ? అని అయోమయంగా అనిపించింది.

దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి వేలాదిమంది జనాన్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ,

ఈ భక్తులు అందరూ నిజజీవితంలో సత్ప్రవర్తనతో ఉంటే లోకంలో ఇన్ని అన్యాయాలు జరగవు కదా ! అని.

నైతికవిలువలు పాటించకుండా చేసే పూజలు ఎటువంటివంటే , పూర్వం రాక్షసులు చేసిన తపస్సులు, పూజల వంటివి.


అటువంటి పూజలను దైవం మెచ్చుకోవటం జరగదు..


మళ్ళీ , ఇలా కూడా అనిపిస్తుంది ...ఇలా దైవభక్తి, పాపపుణ్యాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఇంకా ఉండటం వల్లే లోకంలో ధర్మం ఇంకా ఉంది అని .



4 comments:

  1. మీ కడుపు సల్లగుండ ..... అద్భుతం గ చెప్పారు..... :) :) :)

    రాజేష్
    8008585080

    ReplyDelete
  2. మీకు ఈ టపా నచ్చినందుకు కృతజ్ఞతలు.
    మీతో సహా అందరూ బాగుండాలని నేనూ కోరుకుంటున్నాను. అండీ అని ఎందుకు అనలేదంటే మీరు స్టూడెంట్ అని చదివాను , మీరు నాకన్నా వయసులో చిన్న కాబట్టి . భావిభారత పౌరులైన మీలాంటివారైనా ఈ దేశాన్ని బాగుచెయ్యాలని ఆశిస్తూ....

    ReplyDelete
  3. తమ్ముడూ , మీకు ఈ టపా నచ్చినందుకు కృతజ్ఞతలు. మీరు అందరూ కూడా మరింతగా ఈ దేశాభివృద్ధికి కృషిచెయ్యాలని ఆశిస్తూ.....

    ReplyDelete