koodali

Wednesday, October 20, 2010

" ఒక యోగి ఆత్మ కధ " గ్రంధము లోని కొన్ని సంగతులు.....................

 
ఈ విషయములు "ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములో చదివినవండి.

మహామహులు బాబాజీ వారు తమ శిష్యులయిన లాహిరీ మహాశయులతో " ''దిగ్భ్రమ చెందిన అనేకమంది లౌకిక స్త్రీ పురుషుల ఆక్రందనలు మహామహుల చెవుల్లో పడకుండా పోలేదు ' అంటూ ఎన్నో విషయములను తెలియజేసారు.

వాటిని గురించి లాహిరీ మహాశయులు తెలియజేస్తూ ఇలా చెప్పటం జరిగింది. ( అందులో కొన్ని సంగతులు )

.... యోగవిద్యను గురువునుంచి శిష్యుడికి ప్రసారణ చేసేటప్పుడు పాటించవలసిన సనాతన కఠిన నియమాల్ని బాబాజీ నాకు బోధించారు.

"యోగ్యులైన శిష్యులకు మాత్రమే క్రియాకీలకం ప్రసాదించు ,"అన్నారు బాబాజీ. 'దైవాన్వేషణలో అన్నిటినీ త్యజించటానికి ప్రతిజ్ఞ పూనినవాడే , ధ్యానయోగం ద్వారా పరమరహస్యాల చిక్కుముళ్ళు విడదియ్యడానికి అర్హుడు.'


"'గురుదేవా, మరుగు పడిన క్రియాప్రక్రియని పునరుధ్ధరించి మీరు, మానవజాతికి మహోపకారం చేసినట్టే, శిష్యరికానికి కావలసిన కఠిననియమాల్ని సడలించి, ఆ లాభాన్ని పెంచరూ ?' అని విన్నవించుకుంటూ బాబాజీ కేసి చూశాను. 'చిత్తశుధ్ధి గల అన్వేషకులందరూ మొదట్లోనే సంపూర్ణ అంతస్సన్యాసానికి ప్రతిజ్ఞ పూనలేకపోయినప్పటికీ, వారందరికీ కూడా క్రియాయోగం అందించడానికి నన్ను అనుమతించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను. ప్రపంచములో, మూడు విధాలైన క్లేశాలకీ గురి అయ్యే పీడిత స్త్రీ పురుషులకు ప్రత్యేకమయిన ప్రోత్సాహం అవసరం. వాళ్ళకి క్రియాయోగదీక్ష అందకుండా చేసినట్లయితే వాళ్ళెన్నటికీ ముక్తిమార్గమే తొక్కకపోవచ్చు.'


" 'అలాగే కానియ్యి, ఈశ్వరేచ్చ నీ ద్వారా వ్యక్తమయింది. వినయంగా నిన్ను సహాయమడిగే వాళ్ళందరికీ క్రియాయోగదీక్ష ఇయ్యి. " అని జవాబిచ్చారు దయామయులైన గురుదేవులు.


" కొద్దిసేపు మౌనం దాల్చిన అనంతరం, బాబాజీ ఇంకా చెప్పారు. 'స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ' అని భగవద్గీతలో ఇచ్చిన గొప్ప హామీని నీ శిష్యుల్లో ప్రతి ఒక్కరికీ వినిపించు,' [" ఈ ధర్మం ( ఈ ధార్మిక ప్రక్రియ ) ఏ కొద్దిపాటి అయినా ఆచరణలో పెడితే , అది నిన్ను పెద్ద భయం నుంచి ( మహతో భయాత్ ) కాపాడుతుంది"- అంటే, జననమరణ చక్రపరిక్రమణలో సహజంగా ఉండే మహాక్లేశాల నుంచి కాపాడుతుంది ]. అంటూ వివరించారు లాహిరీ మహాశయులు..

(మొదట్లో మహావతార బాబాజీ, ఇతరులకు క్రియాయోగదీక్ష ఇవ్వడానికి లాహిరీ మహాశయుల కొక్కరికే అనుమతి ఇచ్చారు.

తరవాత, యోగావతార మూర్తులైన లాహిరీమహాశయులు, క్రియాయోగం ఉపదేశించడానికి తమ శిష్యుల్లో కొందరికి కూడా అధికారం ఇమ్మని కోరారు.


బాబాజీ అంగీకరించారు; అంతే కాకుండా, భవిష్యత్తులో క్రియాయోగదీక్షా ప్రదానం, క్రియాయోగపధంలో ప్రగతి సాధించి, లాహిరీ మహాశయులనుంచీ కాని ఆ యోగావతారుల అధికృత శిష్యులు ఏర్పరిచిన మార్గాలనుంచి కాని అధికారం పొందిన వాళ్ళకి మాత్రమే పరిమితమై ఉండాలని ఆదేశించారు.

యధావిధిగా అధికారం పొందిన క్రియాయోగ ఉపదేశకుల దగ్గర దీక్ష తీసుకున్న , భక్తివిశ్వాసాలు గల క్రియాయోగులందరి ఆధ్యాత్మిక సంక్షేమానికి జన్మజన్మాంతర బాధ్యత తాము స్వీకరిస్తామని బాబాజీ కనికరంతో అన్నారు.


సామాన్య ప్రజలు క్రియాయోగంవల్ల లాభం పొందడానికని బాబాజీ, పురాతనమైన వానప్రస్థ, సన్యాసాశ్రమ సంబంధమైన నిర్బంధాలు తొలగించినప్పటికీ ........ దీక్ష కోరేవారికి ఎవరికయినా సరే క్రియాయోగ సాధనకు తయారుగా ప్రాధమిక ఆధ్యాత్మిక శిక్షణ కాలం ఒకటి లాహిరీ మహాశయులూ వారి ఆధ్యాత్మిక పరంపర (వై .ఎస్. ఎస్. - ఎస్. ఆర్. ఎఫ్. గురు పరంపర ) లోని శిష్యులందరూ విధించాలని ఆయన ఆదేశించారు.


క్రియాయోగం వంటి అత్యున్నత యోగ ప్రక్రియా సాధన అస్థిరమైన ఆధ్యాత్మిక జీవితానికి సరిపడేది కాదు. క్రియాయోగం ధ్యాన ప్రక్రియను మించినది; అదొక జీవిత మార్గం; అంచేత దీక్ష పొందేవాడు కొన్నికొన్ని ఆధ్యాత్మిక విధుల్నీ నిషేధాల్నీ మన్నించడం అవసరమవుతుంది.

మహావతార బాబాజీ, లాహిరీ మహాశయ, స్వామీ యుక్తేశ్వర్, పరమహంస యోగానందగార్ల ద్వారా పారంపర్యంగా వచ్చిన ఈ బోధలను యోగదా సత్సంగ సొసైటీ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ నిష్ఠగా పాటిస్తున్నాయి.




4 comments:

  1. మంచి విషయం తెలియజేసారు. నేను ఆ పుస్తకం చదివాను. ఎప్పుడూ చదవాలనిపించే పుస్తకం అది. వివిధ యోగులు, వారి ధ్యానపద్ధతులు భలే ఉంటాయి. మంచి పుస్తకం.

    ReplyDelete
  2. మీ అభిప్రాయములు తెలిపినందుకు కృతజ్ఞతలండి. నేను కొన్ని కారణములవల్ల కొద్ది రోజులనుంచీ బ్లాగ్ చూడలేదండి. అందువల్ల మీకు జవాబు ఇవ్వటము ఆలస్యం అయినందుకు దయచేసి క్షమించండి. " ఒక యోగి ఆత్మ కధ " గ్రంధం నిజంగా చాలా గొప్ప గ్రంధమండి.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. మంచి విషయం తెలియజేసారు. ధన్యవిదాలు....

    ReplyDelete