koodali

Monday, December 4, 2017

తరచూ తలస్నానాలు చేయటం..వంటి..


కొంతకాలం క్రిందట మా బంధువుల అమ్మాయి వివాహానికి వెళ్లాను. వాళ్ళను చూసి చాలాకాలమయ్యింది. 

పెండ్లికూతురు జడ సన్నగా ఉంది. 

ఇంతకుముందు నేను చూసినప్పుడు జడ ఒత్తుగా ఉన్నట్లు గుర్తు. ఇదేమిటి ఇలాగయింది. ..అనడగితే   ఒకామె  ఏమన్నదంటే , 

పూజలు  చేయటం కోసం  తరచూ  తలస్నానాలు చేయటం వల్ల జడ సన్నగా అయిందని చెప్పింది.  

జడ సన్నగా ఎందుకు అయిందో కానీ...  పూజలకోసం తలస్నానం చేయటం వల్ల అనేసారు. 

ఉదయాన్నే తలస్నానం చేసి పూజకు ఆలస్యం అవుతోందని హడావిడిగా తడితల సరిగ్గా తుడుచుకోకుంటే  జలుబు వంటివి వచ్చే అవకాశముంది.

చుండ్రు వచ్చే అవకాశం కూడా  ఉంది.  అలాంటప్పుడు  జుత్తు  ఊడిపోయే అవకాశముంది. 

అయితే, వారానికి రెండుసార్లు తప్పనిసరిగా తలస్నానం చేయటం వల్ల చుండ్రు వంటివి రావంటున్నారు.  తలస్నానం చేసినా కూడా, జుత్తు ఆరిన తరువాత,   అదే రోజు తలకు నూనె రాస్తే జుట్టు ఎండిపోదు.

*************
తల ఎక్కువగా తడితో  నానితే , తలకు  నీరు వెళ్లి  అనారోగ్యం వచ్చే అవకాశముందని కూడా కొందరు పెద్దవాళ్లు అంటారు.

పాతకాలంలో స్వచ్చమైన నీరు, వాతావరణం వల్ల ఎన్నిసార్లు తలస్నానం చేసినా ఆరోగ్యం బాగుండేది కావచ్చు.

 ఈ రోజుల్లో నీరు, గాలి,  వాతావరణం లో ..పొల్యూషన్ ఎక్కువయ్యింది.  నీటిలో పొల్యూషన్ తగ్గడానికి కూడా రసాయనాలు కలుపుతున్నారు. 

ఇలాంటి పరిస్థితిలో  రసాయనాలు కలిసిన నీటితో, షాంపూలతో .. తరచూ తలస్నానం చేస్తే  సరిపడకపోవచ్చు.  

మనుషుల అంతులేని కోరికల వల్ల ..  స్వయంకృతాపరాధాల వల్ల ..  వాతావరణం కలుషితమయ్యింది. 

*******************

 పాతకాలంలో పుష్టికరమైన తిండి తినేవారు.

ఈ రోజుల్లో  లభించే ఆహారంలో ... సత్తువ ఉండటం లేదు... చాలామంది విషయంలో .. తినే తిండి వల్ల   లావు అవుతున్నారే కానీ ,  సరైన శక్తి లభించటం లేదు.

మా ఇంటి పొరుగున ఒకామెకు ( సుమారు 35 సంవత్సరాల వయస్సుంటుదేమో ?) ఆ మధ్య కడుపులో నొప్పి అంటూ హాస్పిటల్కు వెళ్ళి మందులు వాడింది.  

ఆమె ఏమన్నదంటే,  పని అయి ..  పూజ అయేసరికి మధ్యాహ్నం 12 అయేదట. అప్పటివరకూ   ఏమీ  తినేదికాదట.

 అందుకే  కడుపులో నొప్పి వచ్చిందేమోనంటూ సందేహం వ్యక్తం చేసింది. ఇప్పుడు అలా  చేయకుండా ఉదయాన ఏదో ఒకటి తింటోందట. 

**************
  ఇలా సంశయం ఉన్నవాళ్ళు .. ఉదయం   కొంత పూజ చేసుకుని , ఏమైనా ఆహారం తీసుకుని ,  ఇంటి పని   తరువాత ..  మరల పూజ చేసుకోవచ్చు.

లేదంటే  సూర్యోదయానికి ముందే   లేచి పూజ చేసుకోవాలి.

 ************

  తరచూ తలస్నానం, ఉపవాసం ..చేయటం వంటివి ఎవరి పరిస్థితిని బట్టి  వారు చేసుకోవటం మంచిది.

 తరచూ తలస్నానాలు, కఠిక ఉపవాసాలు ఆచరించకపోయినా  పూజ చేసుకోవచ్చు.  దైవాన్ని ఆరాధించుకోవచ్చు.

భక్తి, సత్ప్రవర్తన కలిగి  ఉంటే  దైవకృపను పొందవచ్చు ...  అని నాకు అనిపిస్తున్నది. 



1 comment:

  1. మీరు మంచి విషయాలు సరళమైన మాటల్లో క్లుప్తంగా చెబుతున్నారు. బాగుంది.

    ReplyDelete