koodali

Friday, September 20, 2013

ఎలా జీవించాలి ? ఎలా జీవించకూడదు ? కొన్ని విషయాలు ...

 
 
లోకంలో  ఎలా  జీవించాలి  ? ఎలా జీవించకూడదు  ?  ఏది  ధర్మం ? ఏది  అధర్మం ?   సృష్టిలోని  విజ్ఞానం ....వంటి  విషయాలను  ప్రజలకు   ఎవరు  తెలియజేస్తారు  ? 
మన  పెద్దలు  మనకు  తెలియజేస్తే ,  మన  తరువాతి  తరాలకు  మనము   తెలియజేస్తాము.

ఈ  విషయాలన్నింటినీ   ఎన్నో  మార్గాల  ద్వారా  ప్రాచీనులు  మనకు  తెలియజేశారు.  పురాణేతిహాసాల  ద్వారా  కూడా  ఈ  విషయాలను  తెలియజేశారు.

.................................

 చిన్నపిల్లలకు  ధర్మాధర్మాలను  బోధించటానికి  జంతువులు  పాత్రలుగా  ఉన్న   పంచతంత్రం  వంటి  నీతికధలను  అందించారు......పెద్దవాళ్ళకు  ధర్మాధర్మాలను  బోధించటానికి  పురాణేతిహాసాలను  అందించారు.

చిన్నపిల్లలకు  పక్షులు, జంతువులంటే  ఇష్టంగా  ఉంటుంది.

(నేటి  కార్టూన్  నెట్  వర్క్  అంటే  పిల్లలకు  ఇష్టం  ఉన్నట్లు.)

  పంచతంత్రం  వంటి  కధలలో  జంతువులు    మనుషులలా  మాట్లాడతాయి,  ప్రవర్తిస్తాయి.   జంతువులు  పాత్రలుగా  ఉన్న  కధలను  చెబితే  పిల్లలు  ఉత్సాహంగా  నేర్చుకుంటారు.

అయితే,  కొందరు   ఏమంటారంటే , జంతువులు    ఎక్కడైనా  మాట్లాడతాయా  ?   మనుషులలా  ప్రవర్తిస్తాయా  ? పెద్దలు   ఇలాంటి  కధలను  అందించటమేమిటి  ? అని  వాదిస్తారు.

ఇక్కడ  మనం  ఏం  తెలుసుకోవాలంటే,


పంచతంత్రం  నీతి  కధలలోని  జంతువుల  పాత్రల  ద్వారా   లోకంలో  ఎలా  ప్రవర్తించాలి ? ఎలా  ప్రవర్తించకూడదు  ?  వంటి  ఎన్నో  విషయాలను  పిల్లలు  నేర్చుకోవాలి .. .అని  అర్ధం.

  అంతేకాని    పశుపక్ష్యాదులు  ఎక్కడైనా   మనుషుల్లా  మాట్లాడతాయా ?  ప్రవర్తిస్తాయా ?  అని  ఆలోచించటం,  వాదించటం    సరైనది  కాదు.

అలాగే  పురాణేతిహాసాలలోని  పాత్రల  ద్వారా    లోకంలో  ఎలా  ప్రవర్తించాలి ? ఎలా  ప్రవర్తించకూడదు  ?  వంటి  ఎన్నో  విషయాలను  పెద్దవాళ్ళు   నేర్చుకోవాలి .. .అని    అర్ధం. 


 అంతేకానీ,  ఆ  దేవతలు  అలా  ప్రవర్తించారేమిటి  ?  అని   ఆలోచించటం  సరైనది  కాదు.

 దేవతలు  మనకోసం    మానవులుగా  జన్మించి,   తమ  జీవిత  పాత్రల  ద్వారా  మనకు  ఎన్నో  విషయాలను  తెలియజేశారు.  ఇక్కడ  మనం  చూడవలసింది  వారి  పాత్రలనే  గానీ,  పాత్రధారులను  కాదు. 

...........................................


ఆదిపరాశక్తి  అయిన  పరమాత్మ  జగన్నాటకాన్ని  నడిపిస్తున్నారు. వీరు   తలచుకుంటే  రాక్షసులను   చిటికెలో సంహరించగలరు.   మరి,   రామాయణం  వంటివి  జరగటం  ఎందుకు  ?   అని  మనకు  ఎన్నో  సందేహాలు  వస్తాయి.


 నిజమే ,  వీరు   తలుచుకుంటే   పాపాత్ములను  చంపటం  పెద్ద పనేమీ  కాదు.  అయితే  రామాయణాది  కధలను  నడిపించి ,  ఆ  కధలలో  దేవతలను  సహితం  పాత్రధారులుగా  చేసి  కధలను  నడిపించి  ఆ  కధలను  లోకానికి  అందించటానికి  ఎన్నో  కారణాలుంటాయి. 

 ఉదా.   పెద్దవాళ్ళు   పిల్లలకు   ధర్మాధర్మాల  గురించి    తెలియజేయాలంటే,  కధల  ద్వారా  కూడా తెలియజేస్తారు.  కొందరు   పెద్దవాళ్ళు  పిల్లలకు  నీతికధలను  చెప్పేటప్పుడు  తామే  ఆ  కధల  లోని  పాత్రధారులుగా   అభినయిస్తారు. 

 

   లోకానికి  ధర్మాధర్మాలను  బోధించటం  కోసం   పురాణేతిహాసాలలోని   పాత్రలను  ధరించిన  దేవతలను   తప్పుపట్టటం   సరైనది  కాదు. ఇక్కడ  మనం  చూడవలసింది  పాత్రలనే  కానీ  పాత్రధారులను  కాదు......దేవతలు  ఎప్పుడూ  ధర్మాత్ములే.

.....................


నిజజీవితంలో   మంచి  వ్యక్తిత్వం  ఉన్న  నటుడు/ నటి   విలన్  గా  నటించవచ్చు.  అంతమాత్రం  చేత  ఆ నటుడు
/ నటి  నిజజీవితంలో చెడ్దవారు  అయిపోరు కదా  ?
........................................


పురాణేతిహాసాలలో  గొప్పపాత్రలు  కూడా  కొన్నిసార్లు   పొరపాట్లు  చేసి  దానికి  తగ్గ  కష్టాలను  అనుభవించినట్లు  ఉంది.  అయితే   వారు  చేసిన  పొరపాట్లను  దాచలేదు.  ఈ  విషయాలను  గ్రంధాల  ద్వారా  మనకు  అందించి,   చదవమన్నారు. 

అలా  చదవటం  ద్వారా  ...ఎంత  గొప్పవాళ్ళైనా  సరే ,  పొరపాట్లు  చేస్తే  దానికి  తగ్గ  ఫలితాన్ని  అనుభవించే  అవకాశం  ఉంది.  కాబట్టి  జాగ్రత్త  ....వంటి  ఎన్నో  విషయాలను   మనకు  బోధించారు.



No comments:

Post a Comment