koodali

Sunday, February 8, 2026

కొన్ని విషయములు..


దైవమా మీరు శాశ్వత పరమానంద స్వరూపులు. అత్యంత శక్తిమంతులు. 

దైవము, సృష్టిలో జీవులకు అవసరమైనటువంటివెన్నో సృష్టించి ఇచ్చారు. చక్కటి వాతావరణం, ఆహారానికి అవసరమైన ఎన్నో మొక్కలు, ఎన్నో పువ్వులతో కూడిన మొక్కలు, ఎన్నో సుందరదృశ్యాలను..  ఇచ్చారు. అంతా మీ దయ. 

దైవానికి అనేక కృతజ్ఞతలు. 
....................

జీవులు ధర్మబద్ధంగా జీవిస్తూ హాపీగా ఉండాలి. అందరూ మంచి బుద్ధితో మంచిగా ఉండాలి. మంచి బుద్ధి ఉంటే అంతా మంచిగా ఉంటుంది.

....................

ప్రపంచంలో  ఎన్నో సమస్యలున్నాయి. ఎవరికి ఏం చెప్పినా వినే వాళ్ళెంతమంది? పాటించేవాళ్లెంతమంది?

చిన్నపిల్లలు కష్టాలు పడినట్లు, మంచివాళ్ళు కష్టాలు పడినట్లు, మూగజీవులు కష్టాలు పడినట్లు.. విన్నప్పుడు చాలాచాలా బాధ కలుగుతుంది.

..............................

దైవపూజలు చేసినప్పుడు ప్రజలు , ప్రపంచంలో అందరికి తమతో సహా బుద్ధి సరిగ్గా ఉండాలని కూడా దైవాన్ని ప్రార్ధించుకుంటే మంచిది. బుద్ధి సరిగ్గా ఉంటే అంతా మంచిగా ఉంటుంది. 
 ******************

లోకంలో కొందరు దుర్మార్గులు దారుణాలు చేసినప్పుడు  మనకు ఏమనిపిస్తుందంటే,   దైవం లోకంలోని చెడ్డవారిని అందర్నీ చంపేయవచ్చు కదా.. అనిపిస్తుంది. 

అన్నీ దైవమే చేస్తే మనుషులు ఏం చేస్తారు? టెక్నాలజీ పేరుతో ప్రకృతిని ధ్వంసం  చేయటం, పశుపక్ష్యాదులను చంపి తింటూ, మద్యం, మత్తుపదార్ధాల మత్తులో నేరాలు..ఘోరాలు చేయటం , పాపాలు చేసి అయినా ఆస్తులు పెంచుకుంటూ విలాసాలలో మునిగి ఉంటారా? 
 

 దైవం జీవులకొరకు మంచి వాతావరణం, ఆహారం కొరకు ఎన్నో మొక్కలను, ఆహ్లాదకరంగా ఎన్నో సుందర ప్రకృతిదృశ్యాలను..ఇంకా ఎన్నింటినో ప్రసాదించినా కూడా,   సంతోషంగా ఉండటం చేతకాక... అంతులేని కోరికలతో, అసూయాద్వేషాలతో కొట్టుకు పోతున్నారు.
 

మనం ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ మన ప్రయత్నాలు మనం చేస్తూ.. కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తే కలికాలంలోనైనా కూడా , అమాయకులు, మంచివారైన వారికి బాధలు గణనీయంగా తగ్గే అవకాశముంది. అంతా దైవము దయ.

................................ 

ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో శుభాలు జరిగాయి. అశుభాలు కూడా జరిగాయి.

 ప్రపంచంలో మతాల పేరిట, అధికారం గురించి, సంపదల గురించి ఎన్నో పోరాటాలు, రక్తపాతాలు జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఎంతో బాధాకరమైన విషయం.

 ప్రపంచంలో జరుగుతున్న హింస చాలా బాధగా ఉంది.

ఆధునికకాలంలో చాలామందిలో అత్యాశ,  పాపాలు చేసి  అయినా డబ్బు సంపాదించాలనే తత్వం పెరిగాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. 

డబ్బు, అధికారం..కొరకు ఎన్నో పాపాలు చేస్తున్నారు. సామాన్యజనం కూడా తమ వంతు పాపాలు చేస్తున్నారు. వీటి ఫలితాలే ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తోంది.

మద్యపానం, మత్తుపదార్ధాల వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతోంది. 

సోషల్మీడియాలో హింసాత్మక దృశ్యాలు, చెడ్ద విషయాలు వల్లకూడా చాలామంది ప్రభావితులవుతున్నారు. 

    ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా,  నీతినియమాలను పాటించనివారిని మనం ఏం చేయగలం?  వారి సంగతి దైవం చూసుకుంటారు.

 కొందరైనా నీతినియమాలతో దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ ..దైవాన్ని ప్రార్ధిస్తే.. ఆ ఫలితం వల్ల దైవకృప కలిగి.. సమాజంలో శాంతి నెలకొనే అవకాశముంది.

ఆ మధ్య ఒక పేరుపొందిన 
వారు  చెప్పినదాన్ని బట్టి.... ఆధునిక కాలంలో జీవ హింస చేయటం బాగా పెరిగింది. పశుపక్ష్యాదులను చంపి తినటం విపరీతంగా పెరిగింది... 

అలా చనిపోయిన జీవుల ఉసురు తగిలి కూడా ప్రపంచంలో కష్టాలు వస్తున్నాయని వారు తెలియజేసారు. 

మనుషులకు జరుగుతున్న హింస పట్ల మనకు ఇంత బాధ ఉన్నప్పుడు, జంతువుల పట్ల మనం చేస్తున్న హింస గురించి కూడా మనము ఆలోచించాలి.

కారణాలేమైనా కూడా, ప్రపంచంలో జరుగుతున్న  ఘోరాలు వింటుంటే చాలా బాధగా ఉంది. రాక్షసప్రవృత్తి కలవారి పట్ల సౌమ్యత, సహనం పనికిరాదు. ఎలాగైనా ఈ ఘోరాలు ఆగాలి. 

అయితే, అంతా దైవం మీదే భారం వేసి కూర్చోవటం కాకుండా, దారుణాలు ఆగడానికి అందరూ తమవంతు ప్రయత్నం చేయాలి. 

************** 

మనుషులు చేస్తున్న పాపాల వల్ల ఎవరి కర్మ వారిదని దైవము ఊరుకుంటున్నారేమో? 

   అయితే, యుద్ధాలు, హృదయవిదారకమైన ఘటనలు, యాక్సిడెంట్లు, రక్తపాతాలు జరిగినప్పుడు అమాయకులైన పిల్లలు, మంచివారైన పెద్దవాళ్లు, అమాయక
మూగజీవులు .. కష్టాలు పడినప్పుడు ఎంతో బాధనిపిస్తుంది. 

దైవం చెడ్డవారిని శిక్షించి, ఆ దారుణాలను ఆపితే బాగుంటుంది కదా ..అనిపిస్తుంది. 
..........................................

గ్రంధాల ద్వారా దైవం.. రాక్షసులను చంపివేసి లోకాన్ని రక్షించిన సంఘటనలు గురించి మనం తెలుసుకోవచ్చు.

 అయితే, ఏది ఎందుకు జరుగుతుందో చాలాసార్లు అర్ధం కాదు. మహాభారతంలో శ్రీకృష్ణులవారు..తమ గురువుయొక్క మరణించిన పుత్రులను తీసుకువచ్చి ఇచ్చారు. 

కానీ, యుద్ధంలో అభిమన్యుని రక్షించలేదు. అలా జరగడానికి గల కారణాలు మనకు తెలియకపోవచ్చు. లోకంలో కూడా చాలా విషయాలు మనకు అర్ధం కావు. దైవానికి అన్నీ తెలుస్తాయి.

  మనలో చాలామంది జీవితంలో...దైవం ఉన్నారని చక్కగా అనుభవంలోకి వచ్చిన సంఘటనలు ఉంటాయి.  దైవాన్ని నమ్మి.. ధర్మబద్ధంగా జీవించాలి.
...............

 ప్రపంచంలో శాంతి నెలకొనాలని , అంతా బాగుండాలని అందరూ మనస్పూర్తిగా దృఢంగా దైవాన్ని ప్రార్ధించాలి.  దైవాన్ని, దైవనామాన్ని అందరూ స్మరించుకోవాలి.

అంతా దైవము దయ...

..................

 నైతికవిలువలను పాటించే మనుషులున్న సమాజం ప్రశాంతంగా ఉంటుంది.నేరాలు..ఘోరాలు ఉండవు. అందరికి  దైవభక్తి.. ధర్మబుద్ధి ఉండాలని గట్టిగా కోరుకుందాము.
 ..................

దైవమే దిక్కు.

 

ఈ రోజుల్లో ..వచ్చాక ...

 

ఈ రోజుల్లో టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు..వచ్చాక ఎన్నో ప్రోగ్రాంలు ప్రపంచమంతటా ప్రసారమవుతున్నాయి. మంచి ప్రోగ్రాంస్ తో పాటు హారర్ ప్రోగ్రాంస్ కూడా ఉంటాయి.   

సీరియల్స్ చూస్తే, ఇళ్లలో ఒకరితో ఒకరు కొట్లాడుకోవటమే ఎక్కువవుంటుంది. 

అస్తమానం హింసతో కూడిన ప్రోగ్రాంస్, గొడవలు కాకుండా,కామెడీ ఎక్కువ ఉండే ప్రోగ్రాంస్ ఎక్కువ రావాలి. 

కొన్ని వీడియోగేంస్ కూడా ఒకరితోఒకరు కొట్టుకోవటం వంటివి ఉంటాయి. అవి ఆడినవారికి ఇరిటేషన్ పెరిగే పరిస్థితి రావచ్చు.

చాలాసమయం సెల్ఫోన్లు చూస్తే ఇరిటేషన్ వస్తుంది. చేతులు, మెడ నొప్పులు వస్తాయి. ఇంకా కొన్ని శారీరిక, మానసిక సమస్యలు వచ్చే అవకాశముంది.

 ఆరుబయట ఆడుకోవటం, నడవటం, ఇరుగుపొరుగు వారు కబుర్లు చెప్పుకోవటం, తోటపని, బాల్కనీలో కూర్చుని మంచిపాటలు వినటం.. చేయవచ్చు. 

సెల్ఫోన్లు పట్టుకుని చూడటం తగ్గించి, ఫోన్ పక్కన పెట్టి రేడియోలా వినవచ్చు.

....................
ఇక చాలామంది పిల్లలు, పెద్దవాళ్లు హారర్ ప్రోగ్రాంస్ భయపడుతూ కూడా చూస్తారు. 
 
ఈ తరంగాలు వాతావరణంలో ఉండి, వాటి ప్రభావం మనుషుల మీద ఉంటుందనిపిస్తుంది.

మంత్రాలను పఠిస్తే, ఆ తరంగాల వల్ల వాతావరణం శుద్ధి అవుతుందంటారు. 
 
మరి అలాగే, చెడుప్రసారాల వల్ల మనుషుల్లో చెడ్డతనం పెరుగుతుందనిపిస్తుంది. అయితే, చెడుప్రసారాలను మనం ఎంతకని ఆపగలం?

అందువల్ల, దేవాలయాల్లో రోజూ ఒక అరగంట.. తక్కువ సౌండుతో తప్పుల్లేకుండా మంత్రాలను పెడితే మంచిది. 
 
చిన్న శబ్దంతో పెట్టినా కూడా, అందరికీ గట్టిగా వినిపించకపోయినా ఫరవాలేదు. ఆ మంత్రశక్తి వాతావరణంలో వ్యాపించి, మనుషుల్లో మంచిమార్పు వచ్చే అవకాశముంది.

ఇంకా, మనుషుల్లో, దైవభక్తి..మంచితనం ఉన్నాయి కాబట్టి, ప్రపంచం ఈ మాత్రం అయినా బాగుంది.

 ఇళ్ళలో కూడా వీలున్నప్పుడు కొద్దిసేపయినా మంత్రాలు, భక్తిగీతాలు..పెట్టుకుంటే మంచిది. వాటిని వింటూ పనులు మాని అక్కడే కూర్చోవాలని ఏమీ లేదు.
 
 మన పనులు మనం చేసుకుంటూనే అవి వాతావరణంలో ప్రసారమవుతాయి.ఇళ్ళలో నెలసరి సమయంలో మంత్రాలు పెట్టకూడదు కావచ్చు.

 చాలామందికి వినిపించాలని పెద్దశబ్దంతో పెట్టనవసరం లేదు..
 
మంత్రాలను  మనస్సులో కూడా అనుకోవచ్చు.

 పెద్ద సౌండ్ వల్ల చుట్టుపక్కల వారికి చాలా సమస్యలు ఉంటాయి. 
 
భక్తిగీతాలయినా కూడా మైకులో పెద్దశబ్దం పెడితే, కొన్ని విషయాలు ఆలోచించాలి....  
 
ఒకరిమాట ఒకరికి వినిపించదు. ఫోన్లో మాట్లాడలేము. ఇంట్లో సరిగ్గా పూజ చేయలేము. కొందరికి తలతిరిగే పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల చిన్నశబ్దంతో ఉంటే హాయిగా ఉంటుంది.