koodali

Saturday, April 14, 2018

దైవం.. మరి కొన్ని విషయాలు...

 ఈ మధ్య  నెట్  లో  కొన్ని విషయాలను  చూసి.. నాకు తోచిన అభిప్రాయాలను  వ్రాయాలనిపించి వ్రాసాను.

  **********

సృష్టి ఎలా ఏర్పడింది? అనే  ప్రశ్నకు,   దైవం  వల్ల   సృష్టించబడింది.. అని  ఆస్తికులు ఖచ్చితమైన   సమాధానం  చెప్పగలరు.

సృష్టి ఎలా ఏర్పడింది?  అనే  ప్రశ్నకు, నాస్తికులు ఏమంటారంటే.. సృష్టి దానికదే ఏర్పడిందని అంటారు.

కొందరు నాస్తికులు  ఏమంటారంటే, దైవం  ఎలా ఏర్పడ్డారని  ప్రశ్నిస్తారు.

సృష్టి దానికదే ఏర్పడటం సంభవమని  వారు నమ్ముతున్నప్పుడు..  మరి, దైవం తమకు తామే ఏర్పడలేరా
ఏమిటి ..దైవానికి ఆది అంతములు లేవు. 
........

గాలిలో  ఎగిరే  పక్షులకు  తేలికైన  రెక్కలు  ఉండటం,  నీటిలో  చేపలకు  ఈదటానికి  తగ్గట్లు  శరీరం  ఉండటం,  అతి  చిన్న  చీమకు  ఉండే  శ్రమశక్తి, గతితప్పకుండా  వచ్చే  సూర్యచంద్రులు,  వాటివల్ల జీవించే  మొక్కలు,  భూమికి  గల  గురుత్వాకర్షణ  శక్తి, శరీరంలో గుండె కొట్టుకోవటం, జీర్ణప్రక్రియ ఇవన్నీ.. ఇంత పద్ధతిగా సృష్టి నిర్మాణం  జరగాలంటే గొప్ప ఆలోచనాశక్తి ఉంటేనే సాధ్యం.


******************
కర్మ ప్రకారం ఫలితం ఉండటమూ నిజమే, బ్రహ్మవ్రాత అనేదీ నిజమే , శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు.... అనేదీ నిజమే. 

జన్మను ఎత్తిన తరువాత ఎలాంటి కర్మలు చేయాలనే స్వేచ్చ వ్యక్తులకు ఉంటుంది. వారు చేసే కర్మల ప్రకారం ఫలితం ఉంటుంది. వ్యక్తి చేసిన కర్మ ప్రకారం కలిగే ఫలితాన్ని ...బ్రహ్మ వ్రాత , శివుని ఆజ్ఞ ..లేక ఇంకా ఎలాగైనా అనుకోవచ్చు. 

చాలామంది విషయంలో తాము చేసిన పనులు సరైనవిగా అనిపిస్తాయి. తప్పు చేసిన వాళ్లు కూడా తాము చేసింది కరెక్టే అనుకోవచ్చు. 

అయితే,  ఎవరు చేసిన  కర్మల ప్రకారం  వారికి తగిన  ఫలితాన్ని దైవం నిర్ణయిస్తారు. 


****
దైవకృపను పొంది భవిష్యత్తును మార్చుకోవచ్చని  సతీ సావిత్రి, మార్కండేయుడు..వంటి ఉదాహరణల  ద్వారా  పెద్దలు తెలియజేసారు.
***
 
 వ్యక్తులు చేసిన కర్మల ఫలితం ప్రకారం  చెడు జరగాలని  ఉందనే సూచనను  జ్యోతిష్యం ద్వారా తెలుసుకుంటే , వర్తమానంలో సత్ప్రవర్తన, ఇతరులకు సాయం చేయడం, పూజలద్వారా పరిహారాలను ఆచరించడం వంటి... వాటి ద్వారా చెడు ఫలితాలను గణనీయంగా తగ్గించుకునే అవకాశముంది.


( అయితే , జ్యోతిష్యం తెలుసుకోవడానికి ఉపాసనాబలం చక్కగా ఉన్న వ్యక్తుల ద్వారా తెలుసుకోవటం మంచిది. చెడు ఫలితాలను తగ్గించుకోవాలంటే పరిహారం ఆచరించడంతోపాటు సత్ప్రవర్తన కూడా అవసరం. ) 

***********
భవిష్యత్తులో శాస్త్రవేత్తలు  కొన్ని మూలకాలను కలిపి జీవాన్ని సృష్టించినా కూడా అందులో ఆశ్చర్యం ఏముంది ? 

ఈ ప్రయోగాలకు వాడే మూలకాలను శాస్త్రవేత్తలు ఎక్కడినుంచి తెస్తారు? అవి దైవసృష్టిలోని మూలకాలే . 


దైవసృష్టిలోని వాతావరణాన్ని ఉపయోగించుకుంటూ, ఆ గాలి పీల్చుతూ, ఆహారాన్ని తింటూ వీటన్నింటికీ కారణమైన  దైవాన్ని  గుర్తించడానికి  మాత్రం కొందరు   ఒప్పుకోకపోవటం ఎంతో అన్యాయం.  

సృష్టిలోని వాతావరణం, ఆకాశం, సూర్యరశ్మి, జలం, అగ్ని, భూమి, నీరు, మూలకాలు.. ఇవన్నీ శాస్త్రవేత్తలు సృష్టించినవి కాదు. ఇవన్నీ దైవం సృష్టించినవి.

 దైవసృష్టిలోని మూలకాలను, ముడిసరుకును ఉపయోగించి...మనుషులు వస్తువులను తయారుచేసి, అవన్నీ మేమే తయారుచేసాం, ఎంతో ఆలోచించి ఈ వస్తువులను తయారుచేసాం..అని చెప్పుకుంటారు. 

మా ఆలోచనలతో వస్తువులను తయారుచేసాం.. అని చెప్పుకుంటున్నప్పుడు..ఇంత వైవిధ్యభరితమైన సృష్టి వెనుక అత్యద్భుమైన ఆలోచనాశక్తి తప్పకుండా ఉంటుంది.. అని కూడా తెలుసుకోవాలి.

  మరి, ఇంత వైవిధ్యభరితమైన సృష్టి వెనుక ఎంతో అత్యద్భుతమైన ఆలోచనాశక్తి కలిగిన శక్తి తప్పకుండా ఉంటారు. ఈ శక్తినే ఆస్తికులు దైవం అని అంటారు.  

విజ్ఞానమంతా దైవసృష్టిలోనే ఉంది. ఇప్పటికి మనుషులు తెలుసుకున్న విజ్ఞానం చాలా తక్కువ. దైవమే అత్యద్భుతమైన సైంటిస్ట్.

************
  రోగకారణమైన బాక్టీరియా గురించి తెలియకపోతే చికిత్సను, మందులను అందించలేరు కదా! 

 బాక్టీరియా గురించి అప్పటివారికి తెలియబట్టే ఆయుర్వేదవైద్యం ద్వారా ఎన్నో చికిత్సలను అందించారు.

***************
 మంత్రాల గురించి హేళనగా మాట్లాడటం సరికాదు.. మంత్రాలను ఒక పద్దతిలో సరిగ్గా ప్రయోగిస్తే గొప్ప శబ్దశక్తి వెలువడుతుందని అంటారు. మంత్రాల ద్వారా ఎన్నో శక్తులను పొందినవారి గురించి గ్రంధాల ద్వారా తెలుస్తుంది.

 ఆధునిక శాస్త్రాల ద్వారా కూడా శబ్దశక్తి  గురించి తెలుసుకున్నారు. ఉదా.. అల్ట్రాసౌండ్.

**************
ఇంత విభిన్నమైన సృష్టి ఎంతో అద్భుతమైన ఆలోచనాశక్తి ఉన్న శక్తికే సాధ్యం.  సృష్టిలో  మనకు  తెలిసిన  విజ్ఞానం  సముద్రంలో  నీటిబొట్టంత  అయితే,  మనకు  తెలియని  విజ్ఞానం  సముద్రమంత,  ఇంకా  ఎక్కువ  కూడా.

 ప్రతి చిన్న విషయాన్ని గురించీ  అతిగా ఆలోచిస్తూ, అతిగా వాదించుకుంటూ సమయాన్ని వృధాచేయడం కన్నా,  విచక్షణతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం,  మనల్ని సరైన దారిలో నడిపించమని దైవాన్ని శరణువేడుకోటం మంచిది.
 
 
 

No comments:

Post a Comment