koodali

Monday, June 13, 2022

పవిత్రంగా ఉండవలసిన ఈశాన్యంలో మురికిదుస్తులు, ఎంగిలి పాత్రలు వేసి కడగవచ్చా?

 

 ఇప్పుడు మీడియాలో ఎన్నో విషయాలను రకరకాలుగా  చెబుతున్నారు. అవన్నీ వింటే  ఏం చేస్తే ఏం తప్పో? అన్నట్లు అయోమయం కలుగుతోంది.

అయితే, ప్రతిదానికి మీరు ఇలా చేయకూడదు. అలా చేస్తే ఇక బతుకు అంతే..అన్నట్లు చెబుతుంటే భయంగా ఉంటుంది.

జీవితంలో  నియమనిబంధనలు, ఆచారవ్యవహారాలు  అవసరమే. అయితే, విపరీతధోరణి  పెరిగితే జీవితమే కష్టం.

 దైవపూజకు కూడా రకరకాల ఆచారాలు ఉంటే పూజకంటే ఈ ఆచారాలను పాటించామా లేదా అనే మనస్సు ఉంటుంది.

ఉదా..పండుగల రోజుల్లో ఎన్నో ఆచారవ్యవహారాలు  ఉంటాయి. ఆ కంగారులో అంతా హడావిడిగా ఉంటుంది. పండుగరోజుల్లో కన్నా  మామూలు రోజుల్లోనే చక్కగా పూజ చేసుకోవటానికి  వీలు కుదురుతుంది అనిపిస్తుంది.

పోనీ ఇన్ని విషయాలను పాటిస్తున్నవాళ్ళు అందరూ ధర్మబద్ధంగా జీవిస్తున్నారా? అంటే సరిగ్గా చెప్పలేం. అలా అందరూ ధర్మబద్ధంగా జీవిస్తే సమాజంలో ఇన్ని నేరాలు ఎందుకు జరుగుతున్నాయి.

.................
ప్రాచీనులు ఎన్నో చక్కటి ఆచారవ్యవహారాలను తెలియజేశారు. ప్రాచీనులు తెలియజేసిన విషయాలలోని అంతరార్ధాలను సరిగ్గా గ్రహించటం అవసరం.

కాలక్రమేణా కొన్ని ఆచారవ్యవహారాలు మార్పులు, చేర్పులకు  లోనయ్యాయి. ఈశాన్యం అంటే దైవస్థానం..పవిత్రంగా ఉండాలని అంటారు. ఈశాన్యాన నీరు ప్రవహిస్తే  కూదా మంచిదంటారు. నాకు తెలిసినంతలో ఈశాన్యాన బావి వంటివి ఉంటాయి.

చాలా ఇళ్ళలో ఈశాన్యాన నీరు పారాలని చెప్పి కొందరు అక్కడ పంపు ఏర్పాటుచేసి, అక్కడే మురికిదుస్తులను, తిన్న వంటపాత్రలను పడేసి కడుగుతుంటారు.

 పవిత్రంగా ఉండవలసిన ఈశాన్యంలో మురికిదుస్తులు, ఎంగిలి పాత్రలు వేసి కడగవచ్చా?

వేరే దిక్కుల వద్ద  పాత్రలు, దుస్తులు శుభ్రం చేసుకుని ఆ నీటిని తూర్పు లేక ఉత్తరం నుంచి వెళ్ళేలా ఏర్పాటు చేసుకోవచ్చు.

కొందరయితే ఈశాన్యాన నీరు పారాలని టాయ్లెట్ కూడా కట్టేస్తారు. ఏమిటో చిత్రవిచిత్రమైన వ్యవహారాలు.
.........
 గుమ్మాలకు పసుపు  వ్రాస్తే .. పసుపులోని యాంటిబయాటిక్  గుణం వల్ల, బయట నుంచి వచ్చి గడపకు తగిలిన దుమ్ము, ధూళిలోని విషపదార్ధాలను పసుపు కొంతయినా నిర్మూలిస్తుందని  అలా చెప్పి ఉంటారు.

అయితే,  ఈ రోజుల్లో పసుపు బదులు పసుపు రంగులను వేస్తున్నారు.ఇలా ఎన్నో ఆచార వ్యవహారాలు రూపు మార్చుకుని అమలు జరుగుతున్నాయి.
......

ఉత్తరదిక్కున  తలపెట్టి  పడుకోకూడదని పెద్దవాళ్ళు  తెలియజేసారు. అలా పడుకుంటే అయస్కాంత ప్రభావం  వల్ల  కొన్ని అనారోగ్యాలు వచ్చే  అవకాశముందని  తెలుస్తోంది. ఇలాంటి విషయాలను  పాటించటం  మంచిదే.
............
మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే బంధువులు, ఇరుగుపొరుగువారు వారికి తోచిన ఆచారవ్యవహారాలను రకరకాలుగా చెప్పి విసిగించేసారు, ఫంక్షన్ అయ్యేటప్పటికి బోలెడు డబ్బు ఖర్చు, నీరసం వచ్చి, ఎవరిని పిలవకుండా సింపుల్ గా చేసుకున్నా బాగుండేదని అనిపించింది.

అయితే, ప్రతి విషయానికి  అనేక  నియమాలు చెప్పి, ప్రతి పనికి ముందుకాళ్ళకు బంధం అన్నట్లు  పరిస్థితి ఉంటే జీవితంలో  చాలా కష్టం.

నేను ఎవరినీ విమర్శించటానికి ఇవన్నీ వ్రాయటం లేదు..ఇవన్నీ వినేవారిలో చాలామంది భయస్తులుంటారు. అమ్మో..ఇవన్నీ పాటించకపోతే ఏమవుతుందో..అని భయపడతారు.

పట్టించుకోనివారు ఎలాగూ పట్టించుకోరు. పట్టించుకునే కొందరు సున్నిత మనస్కులకు ఇవన్నీ ఆచరించలేక, ఆచరించకపోతే ఏమవుతుందో అనే భయంతో బ్రతుకుతుంటారు. ఈ ఆచారవ్యవహారాల అమలు గురించి కొన్నిసార్లు  ఇంట్లో గొడవలు కూడా జరుగుతాయి. ఒక ఇంట్లోని వారందరూ ఒకే మనస్తత్వం ఉన్నవారు ఉండరు కదా.
.....

 మూఢనమ్మకాల నుంచి దైవమే కాపాడాలి.
 
 

2 comments:

  1. ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవికి ఇష్టం అని ..పెద్దలు తెలియజేసారు. ఆ విధంగా చెబితే అయినా భక్తితో ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటారు.

    ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకూ ఆరోగ్యం, దైవానికి కూడా ఇష్టం. ఇలాంటివిషయాలను ఆచరించటం మంచిది.
    ......
    కొందరు ఏమంటారంటే, సాయంకాలం ఇంటి సింహద్వారం తెరిచి ఉండాలని, అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటూ తలుపులు తెరిచి ఉంచుతారు.

    పాతకాలంలో దోమలు లేని రోజుల్లో సాయంకాలంపూట తలుపులు తెరిచి ఉంచితే చల్లనిగాలి ఇంట్లోకి వస్తుందని అలా చెప్పిఉంటారు.

    అయితే, ఈ రోజుల్లో దోమలు బాగా ఉంటున్నాయి.అవి సాయంత్రం ఎక్కువగా ఇంట్లోకి వస్తుంటాయి. చాలామంది దోమలు రాకుండా మెష్ ఉన్న తలుపులు కూడా అమర్చుకుంటున్నారు. తలుపులన్నీ తెరిచిఉంచితే బోలెడుదోమలు ఇంట్లోకి వస్తాయి. ఇక దోమలను చంపే బ్యాటుతో వాటిని చంపుతూ ఉంటారు.

    అయినా, లక్ష్మీదేవి మన ఇంట్లో, మన పూజాగదిలో ఎప్పుడూ ఉంటుందని నమ్మి పూజలు చేస్తాము.

    అంతేకాని, సాయంకాలం ఇంట్లోకి వచ్చి మరల వెళ్ళి, మళ్లీ వస్తుందని జనం ఎందుకు నమ్ముతున్నారో..నాకు అర్ధం కావటం లేదు.


    ReplyDelete
  2. మరికొన్ని విషయాలు..

    పూజలలో వాడే గంటలు రకరకాలుగా ఉంటాయి.

    కొన్ని గంటలకు పైన ఆంజనేయస్వామి వారి బొమ్మ నమస్కారముద్రతో చెక్కి ఉంటుంది.
    ఇలాంటి గంటను పూజామందిరంలో ఉంచినప్పుడు .. మనం పూజామందిరం ముందు నిల్చుంటే స్వామివారు మనవైపు నమస్కారముద్రతో ఉండటం బాగుండదు.

    అందువల్ల, గంటల పైన దేవుళ్ల బొమ్మలు చెక్కకుండా సాదాగా ఉంటే బాగుంటుంది.

    ReplyDelete