koodali

Monday, June 13, 2022

అవసరమైన వాటిని అవలంబిస్తూ ..

 

 సంవత్సరానికి కొన్ని దుస్తులు కొనుక్కుంటే చాలు.ఉదా స్త్రీలైతే ఫంక్షన్స్కు వేసుకోవటానికి 5వేలు చొప్పున రెండు చీరలు..బయటకు వెళ్ళటానికి, తెలిసినవారింటికి వెళ్ళటానికి 2వేల చొప్పున నాలుగు చీరలు..రోజువారి ధరించటానికి 500 లేక 1వేయి రూపాయలలో అయిదు చీరలు కొనుక్కుంటే సంవత్సరానికి సుమారు 25 వేలలో అయిపోతుంది. ఎవరి స్తొమతను బట్టి వారు డబ్బు  కొంచెం ఎక్కువ తక్కువ  చేసుకోవచ్చు.


అంతేకానీ , అదేపనిగా దుస్తులు కొననవసరం లేదు.ఇంకా క్రితం సంవత్సరం కొన్నవి ఎలానూ ఉంటాయి కదా..సామాన్లు కూడా చూసినవన్నీ కొనకుండా బాగా అవసరమైనవి మాత్రమే కొనుక్కుంటే ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది. ఇల్లు సర్దే పనీ తగ్గుతుంది.



కోరికలు , ఆలోచనలు..తగ్గించుకుంటే జీవితంలో కష్టాలు తక్కువగా ఉంటాయి. జనాభా పెరుగుతూ ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ప్రకృతి వనరులు వాడకం ఎక్కువచేయవలసి వస్తుంది. పెరిగే జనాభా ఆహార అవసరాలకోసం వనరులు ఎన్నో అవసరమవుతాయి. కుటుంబానికి ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకోవాలి.



ఏదైనా అతి ఎక్కువయితే కష్టమే. ఆచారవ్యవహారాలు కూడా ఎక్కువగా పెరిగిపోకూడదు తగ్గించుకోవాలి.అవసరమైన వాటిని అవలంబిస్తూ  మూఢాచారాలను వదిలేయాలి. 


 కొన్ని  ప్రా చీనులు చెప్పినవి కావు. మధ్య కాలంలో గ్రంధాలలో చేర్చబడిఉంటాయని నా అభిప్రాయం. జాతి అభివృద్ధికి అడ్డంకిగా మారిన ఇలాంటి వాటిని వదిలేయాలి.

ప్రాచీనులు ఎన్నో చక్కటి విషయాలను  విజ్ఞానాన్ని ఆచారవ్యవహారాలను మనకు గ్రంధాల ద్వారా తెలియజేసారు. వాటిని పాటించాలి.

ప్రపంచంలో ఏదైనా అతి ఎక్కువయితే మంచిది కాదు.  దైవభక్తి ఒక్కటి మాత్రం ఎంత  పెరిగినా లాభమే తప్ప నష్టం లేదు.  పూజలలో కూడా కొన్ని మూఢాచారాలను కొందరు చెబుతారు. 
 
అలాంటి మూఢాచారాలను వదిలి, సదాచారాలను పాటించాలి. దైవభక్తి, ధర్మాచరణతో దైవకృపను పొందాలి.
 
 
 

2 comments:

  1. కొందరు ఏమంటారంటే, ఇంట్లో పప్పుదినుసులు డబ్బానుంచి తీసి వంటలో వాడి, మిగిలినవి దైవానికి నైవేద్యంగా వాడితే ఎంగిలి అవుతుంది కాబట్టి, దైవానికి నివేదించే పదార్ధాలు విడిగా తీసిపెట్టుకోవాలంటున్నారు.

    పండ్లు కూడా గెలలో కొన్నింటిని మనం తిని, ఆ గెలలో మిగిలినవి దైవానికి నివేదిస్తే ఎంగిలి అవుతుంది కాబట్టి, దైవానికి నివేదన చెయ్యకూడదంటున్నారు. అవన్నీ ఎంగిలి ఎలా అవుతాయి? కోతులు, పశుపక్ష్యాదులు చెట్లపైన పండ్లను తింటాయి. మరి పక్షులు ఎంగిలి చేసిన గెలలు కోసి తెచ్చుకుంటాము కదా..పప్పుధాన్యాలకు కొన్నిసార్లు పురుగులు వస్తాయి. తిరగమోత దినుసులను కడగకుండానే వాడవలసి ఉంటుంది. కూరగాయలకు చీడపీడలు ఉంటే, ఆ భాగాన్ని కత్తిరించి మిగిలింది వండుకుంటాము.

    నదులు, చెరువుల నీటిలో ఎన్నో మాలిన్యాలు కలుస్తాయి. వర్షం వచ్చినప్పుడు ఊళ్లలోని మురికినీరు కూడా నదుల్లోకి, చెరువుల్లోకి వెళ్తుంది. ఎన్నో మలినాలు ఆ నీటిలో కలుస్తాయి.

    చితాభస్మాలను కూడా నదుల్లో కలుపుతారు. మరి ఆ నీటినే పవిత్రంగా వాడుకుంటాము. బావులకు గోడలు లేకపోతే వర్షం పడినప్పుడు నేలపై ఉన్న మురికి నీరు బావుల్లోకి కూడా వెళ్తుంది. ఇలా ఎన్నో ఉంటాయి.

    కరోనా సమయంలో ప్రజలు ప్రాణాలతో ఉండటం కొరకు అనేక నియమాలు చెబితే మన మంచికే అయినా పాటించలేక అల్లాడిపోయాము. జీవితం అంతా అలా కఠినంగా పాటించాలంటే పాటించలేము కదా.. అలాగే ఆచారవ్యవహారాలను కూడా మరీ ఎక్కువయితే పాటించలేము.

    నియమాలు కొంతవరకైతే పాటించగలం కానీ, మరీ ఎక్కువయితే అన్నింటినీ వదిలేయాలనిపిస్తుంది.

    నేను ఇలా అంటే కొందరికి బాధగా ఉండవచ్చు. కొన్నిసార్లు మనము ఎంతో గౌరవించే వారు చెప్పే మాటలను కూడా మనం పాటించలేక, ఇలా వ్రాయాలంటే ఎంతో బాధాకరంగా ఉంటుంది. నేను ఎవరినీ నిందించటంలేదు. కొన్ని విషయాలను పాటించలేకపోవటం గురించి చెబుతున్నాను. సందేహాలు కలిగితే అడగటంలో తప్పులేదు. దైవానికి కూడా కొన్నిసార్లు మన అశక్తతను తెలియజేసుకుని క్షమించమంటాము.

    జీవితంలో ఎవరికి హాని కలిగించకుండా జీవించటానికి ప్రయత్నించాలి.

    ఆచారవ్యవహారాల్లో ప్రతి విషయానికి అదేపనిగా ఆలోచించాలంటే కష్టం. సరైన విధముగా జీవించే శక్తిని ప్రసాదించమని దైవాన్ని కోరుకోవాలి.

    ReplyDelete
  2. మేము కొంతకాలం క్రిందట కాశీ, ప్రయాగ.. వెళ్ళినప్పుడు గంగానదిలో పడవ ప్రయాణం చేశాము. ఆ పడవ నడిపే వ్యక్తి మాకు కొన్ని సంగతులను తెలియజేయటం జరిగింది. అతని భాషలో నాకు అర్ధమయినంతవరకు, నాకు గుర్తు ఉన్నంతలో వ్రాస్తాను.

    అక్కడ మృతదేహాలను కొన్నిసార్లు సరిగ్గా దహనం జరగకుండానే వాటిని నదిలో విడిచేస్తారట. గంగానదిలో చాలా ఎముకలు ఉన్నాయట. కొన్నిసార్లు వాటికి పడవ యొక్క అడుగుభాగం తగిలి అస్తిపంజరాలు పైకి లేస్తాయట. అవన్ని విన్నప్పుడు మాకు ఒళ్లు జలదరించింది.

    గంగలో కలిపితే పుణ్యం వస్తుందని అనేక మృతదేహాలను సరిగ్గా దహనం చేయకుండా నదిలో వదిలేయటం వల్ల నది కలుషితం అవుతుంది. గంగానది ప్రవహించే పరిసరాలలో ఉన్న నగరాలనుంచి ఎంతో మురుగును నదిలో వదులుతున్నారట. కొందరు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధాలను నదుల్లోకి వదులుతున్నారట. గంగానదికి శుద్ధిచేసే గుణం ఉండటం నిజమే అయినా, అతిగా అన్నింటిని కలుపకూడదు. చాలా నదులలో కూడా పారిశ్రామిక వ్యర్ధాలను వదులుతున్నారు.ఇలా చేయకూడదు.

    ReplyDelete