koodali

Friday, December 15, 2023

ఈ ఆచారం ఎక్కడవరకు వెళ్ళిందంటే..

 

  పాతకాలంలో నెలసరి రోజుల్లో స్త్రీలు ఎన్నో నియమాలను పాటించేవారు.  ప్రాచీనులు కొన్ని నియమాలను చెప్పారు.. అయితే కొందరు వాటిని ఎక్కువ చేసి, మూఢత్వంగా తయారుచేసారు. 

ఇది ఎక్కడవరకు వెళ్ళిందంటే, కొన్ని ప్రాంతాలలో నెలసరిలో ఉన్న స్త్రీల కొరకు  బయట చిన్నగుడిసె వేసి మూడు రోజులూ అక్కడ కూర్చోవటమనే స్థాయికి కూడా వెళ్ళింది. మరికొందరి విషయంలో దూరంగా గుడిసెలో కూర్చోకపోయినా ఇంట్లోనే పక్కన కూర్చోబెట్టి, ఒక అసహ్యకరమైన వ్యక్తిని చూస్తున్నట్లు వారితో ప్రవర్తిస్తారు.


నేపాల్ లో చాలా ప్రాంతాలలో ఇలా దూరంగా గుడిసెలలో ఉంచే ఆచారం ఉందట. ఆలా ఉంచటం వల్ల పాములు, తేళ్లు కుట్టి కొందరు చనిపోయారట. కొందరు అనారోగ్యం పాలయ్యారట. కొన్ని అఘాయిత్యాలు కూడా జరిగాయని వ్రాసారు. ఇప్పుడు ప్రభుత్వం అలా గుడిసెలలో ఉండటాన్ని నిషేధించిందట. 

మనదేశంలో కూడా కొన్ని ప్రాంతాలలో నెలసరి స్త్రీలను వేరే గుడిసెలలో ఉంచటం అనే పద్ధతి ఉందట.


మహారాష్ట్రలో కొన్నిచోట్ల నెలసరిలో ఉన్న స్త్రీల కొరకు కొన్ని స్వచ్చంద సంస్థలు గుడిసెల బదులు సౌకర్యాలతో కూడిన ఇళ్ళను కట్టి అక్కడ ఉంచుతున్నారట. నెలసరి అని ఇలా ఇళ్ళకు దూరంగా ఉంచటం ఏంటో ఖర్మ. 

 

  ఇలా తల్లులు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు చంటి పిల్లలు తల్లికొరకు ఏడుస్తారు. పిల్లల్ని ఇరుగుపొరుగుదగ్గర  వదలకూడదు. 

  నెలసరి అని తల్లిని దూరం పెడితే, ఆమె యొక్క చిన్నపిల్లల బాగోగులను పక్కవాళ్ళు ఏ మాత్రం చూస్తారో చెప్పలేము. పిల్లల సేఫ్టీ కూడా ముఖ్యమే.

 ఏంటో ఇవన్నీ. ఆచారాలలో మూఢత్వం ప్రవేశించకూడదు. 

.....................................
  నెలసరి సమయంలో గర్భసంచి సున్నితంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ పనిచెయ్యకుండా, కొంత రెస్ట్ ఉండటం, అనారోగ్యం లేకుండా కొన్ని నియమాలను పాటించటం.. వంటివి మంచిదే కానీ, ఆ పేరుతో అతి చేయటం సరైనది కాదు. 

 కొందరైతే, నెలసరి వచ్చిన వారిని చూసి అసహ్యంగా చూస్తూ దూరంగా తప్పుకోవటం, వారికి కంచంలో కొద్దిగా ఆహారాన్ని వేసి, దూరం నుంచి ప్లేటును నెట్టటం..వంటివి చేస్తుంటారు. ఇక పండుగలప్పుడు, వివాహాదిశుభకార్యాలప్పుడు  నెలసరి వస్తే , వచ్చిన వారిని తిట్టిపోస్తారు. అనేకమంది  నెలసరి రాకుండా మందులు వాడుతూ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు.


నెలసరి అంటే సంతానానికి సంబంధించిన విషయం. నెలసరి లేనిదే సంతానం లేదు. ఆ సమయంలో వారిని పక్కన కూర్చోబెట్టి,  కొంత రెస్ట్ ఇచ్చి, ఆరోగ్యకరమైన భోజనం వండి ఇచ్చి, మంచిగా చూసుకోవచ్చు. వారిపట్ల అగౌరవంగా ప్రవర్తించకూడ
దు.

    ఈ రోజుల్లో నెలసరి సమయంలో  స్త్రీలు కాలేజీలకు, ఉద్యోగాలకు, పనులకు వెళ్తున్నారు కదా..మరి అంటుముట్టు ఎలా పాటిస్తారు?


  నెలసరిలో స్త్రీలనుండి నెగటివ్ఎనెర్జీ వస్తుందని కొందరు అంటున్నారు. పాపాలు చేసేవారినుండి, మద్యమాంసాలు తీసుకున్నవారి నుండి కూడా నెగటివ్ ఎనెర్జీ వస్తుంది. 

అందుకే, పాపాలు చేసేవారికి దూరంగా ఉండాలంటారు. ...దుష్టులకు దూరంగా ఉండటం కుదరనప్పుడు, మంచివారు దైవస్మరణ చేసుకోవాలి.

పాపాలు చేసేవారినుండి వచ్చే నెగటివ్ ఎనెర్జీతో పోల్చుకుంటే, ప్రకృతిసహజమైన నెలసరి వల్ల వచ్చే నెగటివ్ ఎనెర్జీ ఫరవాలేదు.

ఆచార వ్యవహారాలను మంచిగా పాటించాలి. మూఢత్వంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఒక లింక్..

Story Of A Young Bride | Gaokor- A Period House

  *****************

 మరి కొన్ని విషయాలు...
 
నెలసరి నియమాలను పాటిస్తే మంచిది. అయితే, ఈరోజుల్లో నెలసరినియమాలు నూటికినూరుశాతం పాటించాలంటే అందరికీ కుదరకపోవచ్చు. సూపర్ బజారుకో, బట్టలషాపుకో వెళితే ఆడవాళ్ళు ఉంటారు. రైలు ఎక్కితే ఆడవాళ్ళుంటారు. అంతమందిలో నెలసరిలో వారూ ఉంటారు. అలాగని ఇంటికొచ్చి అదేపనిగా తలస్నానాలు చేస్తే,  అనారోగ్యం వచ్చే అవకాశముంది. అందువల్ల కొద్దిగా పసుపునీళ్లు చిలకరించుకోవచ్చు..


ఆచారవ్యవహారాలను పద్ధతిగా పాటించాలి. అయితే, కొందరు మూఢనమ్మకాలతో పాటిస్తారు. మూఢనమ్మకాల వారికి చెప్పేదేమిటంటే, నెలసరి ఇంట్లో కలిపేసుకుంటే దోషమని భయపడి, మూఢత్వంగా  చేయవద్దు. ..దీనికి సంబంధించిన ఒక  లింక్ పోస్టులో ఉంది. ఆ సినిమాలోలా మూఢత్వంగా ఎవ్వరూ చేయవద్దు. 

పాతకాలంలో కొందరు.. నెలసరి స్త్రీలంటే గౌరవం లేకుండా, వారు బాధపడేలా మాట్లాడేవారట. ఇలా ప్రవర్తించటం సరైనది కాదు.

*******
 పాపాలు చేసేవారి నుండి కూడా నెగటివ్ ఎనెర్జీ వస్తుందని ఇంతకుముందు వ్రాసాను. దానిగురించి మరికొన్ని విషయాలు..

ఎక్కువ మంచిపనులు చేసేవారికి పాజిటివ్ ఎనెర్జీ ఉంటుంది. ఎక్కువపాపాలు చేసేవారికి నెగటివ్ ఎనెర్జీ ఉంటుంది.. ఇవి ఒకరినుంచి ఇంకొకరికి తగిలే అవకాశాలు కూడా ఉంటాయి.

 

 ఇంకో విషయం ఏమిటంటే.. అన్ని వస్తువులకు, మనుషులకు ఆరా అని ఉంటుందట. ఆరాను కొందరు ఫోటోలు కూడా తీసారు.  మనుషుల ప్రవర్తన బట్టి ఆరా ఉంటుందంటారు. మనుషులు  ధ్యానం చేసేటప్పుడు దగ్గరగా కూర్చోకుండా కొంతదూరంలో కూర్చోవాలట. ఒకరి ఆరా ఇంకొకరిని ప్రభావితం చేయకూడదంటే,  కొంతదూరం పాటించాలట. ఆరా  గురించి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి.  

*జీవితంలో దైవభక్తిని కలిగి సత్ప్రవర్తనతో జీవించడానికి ప్రయత్నించాలి.

 

Friday, September 8, 2023

పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాలని..

 

Wednesday, December 10, 2014

పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాల..


  • పూర్వీకులు  అంటరానితనాన్ని  ప్రోత్సహించారని  కొందరు    తప్పుపడతారు. దయచేసి  పెద్దలను  తప్పు  పట్టవద్దు . 

    పశుపక్ష్యాదులనే  పూజించమని  చెప్పిన  పెద్దలు  సాటి  మనుషులను  తక్కువగా  చూడమని  చెప్పరు  కదా  !

    దైవం దృష్టిలో   అందరూ సమానమేనని   పెద్దలు  ఎంతగానో   చెప్పటం   జరిగింది. పురాణేతిహాసాలలో దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పబడ్డాయి .

    ధర్మరక్షణకోసం  విష్ణుమూర్తి  దశావతారాల్లో  జంతుజన్మలను  ధరించటానికి  కూడా  వెనుకాడలేదు.


    ఈ   విషయాలను  గమనిస్తే , సృష్టిలో  ఏ  జీవినీ  తక్కువగా  చూడకూడదని  తెలుస్తుంది.

    అందుకే   పశుపక్ష్యాదులను,  చెట్లను  కూడా  పూజించి  గౌరవించమని  పూర్వీకులు  మనకు  నేర్పించారు. 


    వేదములలోని  విషయములను  చక్కగా  అర్ధం  చేసుకోవటానికి   పురాణేతిహాసాలు  తోడ్పడుతాయి.  


    వేదపురాణేతిహాసాలలోని  భావాలను  సమాజానికి  మరింత  చక్కగా  తెలియజేయటానికి ఎందరో  అవతారమూర్తులు,  మహానుభావులు  జన్మించారు.

    వీరి  బోధనలు  మరియు  ,  ఆచరణ  ద్వారా  ఏది  ధర్మం,  ఏది  అధర్మం  అనే  విషయములు    అందరికీ  తెలుస్తాయి.  


      శ్రీ  రాముడు  శూద్ర  స్త్రీ  అయిన   శబరి  సమర్పించిన  ఫలాలను  స్వీకరించారు.  గుహునితో  స్నేహం  చేశారు. శ్రీరాములవారు  అంటరానితనాన్ని  పాటించలేదు.

    భగవద్గీతలో శ్రీకృష్ణుడు .... అందరూ సమానమేనని చెప్పటం జరిగింది.


    శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ జీవిత చరిత్రము ..గ్రంధములో  కూడా ఇలాంటి   విషయములు   వివరంగా  చెప్పబడ్డాయి.


     ఆది శంకరాచార్యుల జీవితంలోని ఒక సంఘటన ద్వారా .... అంటరానితనం తప్పు ....అని తెలుస్తోంది.  శివుడే  ఈ  విషయాన్ని  తెలియజేశారంటారు. 


     మహావతార్  బాబాజీ  శిష్యులైన  లాహిరీ  మహాశయులు, స్వామి యుక్తేశ్వర్ , పరమహంస  యోగానంద,  రామకృష్ణపరమహంస,  వివేకానందుడు...మొదలగువారు  గొప్ప  మహానుభావులు.  వీరు   అంటరానితనాన్ని   పాటించలేదు.

  • ఒక యోగి ఆత్మకధలో ..... లాహిరీ మహాశయుల వారికి అన్ని కులాల నుంచి శిష్యులు ఉండేవారని చెప్పటం జరిగింది.

    రామకృష్ణమఠంలో అన్ని కులాలు, మతాల వారికి   ప్రవేశం ఉంది.


    అంటరానితనాన్ని  అగ్రవర్ణాల   వాళ్ళు  పాటించారని  కొందరు  అంటారు.  
     అగ్రవర్ణాలవాళ్ళలో ఇతరులను  ఎంతో చక్కగా  ఆదరించిన  వారెందరో  ఉన్నారు.  అగ్రవర్ణాల లో  కూడా పేదరికంతో  దయనీయంగా  జీవిస్తున్నవారెందరో  ఉన్నారు. 

     కొన్ని  గ్రామాలలో  ధనవంతులైన  శూద్రులు   పేదవారైన  శూద్రుల  పట్ల   పట్ల  అంటరానితనాన్ని పాటించారు.  

    ******************

    గ్రంధముల  ద్వారా  తెలుసుకున్న  మరి  కొన్ని  విషయములు.....

    బ్రాహ్మణ  క్రత్రియ  వైశ్యులను  ద్విజులు అంటారు...ఉపనయనం  జరగకుండా  వారికి  ద్విజత్వం  రాదు.  అందాకా  వీళ్ళు  శూద్రుల  కిందనే  లెక్క.  రాకుమారులకు  11  వ ఏట,  బ్రాహ్మణ పుత్రులకు  ఎనిమిదవ  ఏట, వైశ్య  తనయులకు  పన్నెండవ  ఏట  ఉపనయనం  చెయ్యాలని  ధర్మశాస్త్రాల  నిర్ణయం......... అన్నట్లు    పెద్దలు  తెలియజేశారు.


    భీష్ముల  వారి  విషయంలో............

    భారతంలో , భీష్ముల  వారు అంపశయ్యపై  ఉన్నప్పుడు  వారే  తెలియజేసిన  విషయాన్ని  బట్టి ,  వ్యక్తులు  తినే  ఆహారాన్ని  బట్టి    మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది. 


      అధర్మంగా  ప్రవర్తించే  వారి  వద్దనుంచి  స్వీకరించే  ఆహారం  వల్ల  కూడా స్వీకరించిన వారి  మనస్తత్వంలో  మార్పులుచేర్పులు  వస్తాయని  తెలుస్తుంది.

     దుర్యోధనుడు  గొప్ప  వంశంలో   జన్మించినా   కూడా  ,అధర్మపరుడైనందువల్ల  అతని  నుంచి  స్వీకరించిన  ఆహారం  వల్ల  భీష్ముల  వారికి  కష్టాలు  వచ్చాయి.  


    శ్రీ కృష్ణుల వారు   కూడా.....దుష్టుడైన  దుర్యోధనుని  ఆహ్వానాన్ని  తిరస్కరించి , సౌమ్యుడైన  విదురుని  ఆతిధ్యాన్ని స్వీకరించారు. 

    పై  విషయాలన్నీ  గమనిస్తే  ,  అధర్మంగా  ప్రవర్తించేవారిపట్ల..,   పాపాలు  చేసే వారి  పట్ల  అంటరానితనాన్ని  పాటించాలన్నది . పెద్దల  అభిప్రాయం  అనిపిస్తుంది.


    కొందరు  గొప్ప పదవి  లభించినా  అంతటితో  తృప్తిని  పొందక  ఇంకా  ఏదో  కావాలని  అశాంతితో  జీవిస్తారు. 


     భగవదనుగ్రహాన్ని  పొందాలంటే  నిష్కామకర్మతో జీవించాలని పెద్దలు  తెలియజేశారు.  

  • నిష్కామ  కర్మతో  జీవించేవారు  మహారాజ  పదవిలో  ఉన్నా,   పొంగిపోకుండా  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు.    జనకమహారాజులా.  


     నిష్కామ  కర్మతో  జీవించేవారు  ఆడంబ
    రాలు  లేకున్నా  ,   క్రుంగిపోకుండా  ప్రశాంతంగా  జీవించి  దైవకృపకు  పాత్రులవుతారు . .శబరిలా .

    భగవంతుని  కరుణను  పొందిన  జీవులలో   పశువులు,  పక్షులు,   పేద వారు,  ధనవంతులు, అన్నిరకాల  జీవులు  ఉన్నారు. అంతా  దైవం  దయ.
  •  .....
  •  

ఇప్పుడు ఎవరెంత మంచిగా ఉంటున్నారు?

 
కొందరు ..మతం పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి తమ పబ్బం గడుపుకుంటున్న పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఎప్పటినుంచో ఉంది...ఇలాంటి వారి మాటలు విని ప్రజలు గొడవలు పడుతుంటారు.

ఇంకా ఎన్నాళ్లు ప్రజల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటారు? నిజంగా ప్రజలపై జాలి ఉంటే వాళ్లకున్న సంపదలో కొద్దిగా తమకు ఉంచుకుని, మిగతాది పేద ప్రజలకు ఇచ్చేస్తే బాగుంటుంది. 

మతాలు, కులాలు, ప్రాంతాలు, దేశాల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు ఎగదోసి తాముమాత్రం కోట్ల సంపదలు కూడబెట్టుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. మరి కొందరు ముందు జాగ్రత్తతో ప్రజలకు కూడా గోరంత ఇచ్చి, తాము కొండంత సంపాదించుకుంటారు.

కొందరి ప్రవర్తన పైకి కనిపించేదొకటి..వెనుక ఉండేదొకటి.
.....................................

పూర్వం జరిగిన సంగతులు అలా ఉంచితే, ఈ రోజుల్లో ఎవరు ఎంత వరకూ సాటిమనుషులను గౌరవిస్తున్నారో? ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఇంట్లో పనిచేసే సర్వెంట్ ను విసుక్కోకుండా ఎంతమంది ఆప్యాయంగా చూసుకుంటున్నారు?

 చాలామంది తమ ఆఫీసులో పై అధికారికి నమస్కరిస్తారు, గౌరవిస్తారు, మరి ఆఫీసు గుమ్మం బయట కాపలా ఉండే వ్యక్తి మనకు నమస్కరించినప్పుడు, ప్రతినమస్కారం చేసి గౌరవంగా మాట్లాడేవారు ఎంతమంది? రోడ్డుప్రక్కన ఉండే బిచ్చం ఎత్తుకునే వారిని సాటిమనిషిగా అయినా గౌరవించే వారెందరు? 

 ఇంట్లో పిల్లల అభిప్రాయాలకు కొంతయినా విలువ ఇచ్చే పేరెంట్స్ ఎందరు? నీకు ఏం తెలుసు? మేము చెప్పిన చదువు మాత్రమే నువ్వు చదవాలి..అని మాట్లాడే పేరెంట్స్ ఎందరో ఉన్నారు.కుటుంబాలలో కూడా మెతకగా ఉండేవారిని గడుసుగా ఉండేవారు ఏడిపిస్తారు. ఇలా ఎన్నో అసమానతలు, అణచివేతలు ఇంటాయటా ఉన్నాయి.

ఈ ప్రపంచంలో బలహీనులను బలవంతులు అణచివేస్తున్నారంటూ గగ్గోలు పెట్టే ఎందరో మనుషులు..మూగజీవులైన పశుపక్ష్యాదులను చంపి తింటున్నారు. అప్పుడు ఈ మాటలు వర్తించవా? మూగజీవులపైన మన పెత్తనమేమిటి? వాటికీ ఈ ప్రపంచంలో జీవించే హక్కు ఉంది.
................................

ఈ రోజుల్లో కూడా తేడాలుంటున్నాయి. ఉదా.. వైద్యులకు ఇచ్చినంత గౌరవం, జీతం నర్సులకు ఉంటుందా? నర్సులు రోగులకు ఎంతో చేస్తారు.వారి రక్తం, మలమూత్రాలను కూడా శుభ్రం చేస్తారు. నర్సుల సాయం లేనిదే రోగులకు, వైద్యులకు కూడా  కుదరదు.అలాగని, వైద్యులకు, నర్సులకు ఒకే జీతం ఇవ్వాలంటే ఎంతమంది  ఒప్పుకుంటారు?

  డాక్టర్లు ఏమంటారంటే, మేము అన్ని సంవత్సరాలు కష్టపడి చదివాము..మాకు..నర్సులకు ఒకేలా జీతాలు ఎలా ఇస్తారంటారు. తేలికగా అర్ధం అవ్వటం కోసం వైద్యుల ఉదాహరణ చెప్పాను.. ఏ రంగంలో వారికైనా ఇది వర్తిస్తుంది.
 
ఈ రోజుల్లో కూడా మరి గార్డులుగా పనిచేసేవారు కొందరు వారి కష్టాల గురించి చెప్పి బాధపడుతున్నారు.ఈ గార్డుల్లో అన్ని కులాల వాళ్లున్నారు.

ప్రజల  మధ్యన  ఆర్ధిక అసమానతలు తగ్గితే అన్ని అసమానతలు తగ్గుతాయి. అందుకే, ఒకే ఆఫీసులో పనిచేసేవారి జీతాల విషయంలో పెద్ద తేడాలు లేకుండా చేస్తే బాగుంటుందేమో? అనిపిస్తుంది. ఈ విషయాల గురించి ఇంతకుముందు కొన్ని పోస్టులు వ్రాసాను. అనేక చర్చలు కూడా జరిగాయి.

ప్రాచీన గ్రంధాలలో అంటరానితనం లేదని నేను వివరించాను. క్రమంగా కొందరు తెలిసీతెలియని వారి వల్లా, కొందరు స్వార్ధపరుల వల్లా సమాజంలో అంటరానితనం..వంటి దురాచారాలు ప్రవేశించాయి.
.................................

అంటరానితనం పేరుతో సాటి మనుషులను వేరుగా పెట్టడం ఖచ్చితంగా తప్పే.అలా వేరుచేయబడ్దవారు ఎంతో బాధపడతారు.

పాతకాలంలో కొందరి శ్రమశక్తిని కొందరు  దోచుకున్నారని అంటారు.మేము ఎవరినీ దోచుకోలేదు.. మేమూ కష్టాలు అనుభవించాము అంటారు కొందరు. ఎవరి వాదన వారిది.
 
 మనము మాత్రమే  బాధలు పడ్డాము అనుకోనక్కరలేదు. ఎవరి కష్టసుఖాలు వారికున్నాయి. బ్రాహ్మణులు ఉపవాసాలని సరిగ్గా  ఆహారం కూ
డా తినకపోవటం,  తలస్నానాలు, కఠినమైన ఆచారాలను పాటించటం..వంటివి చేస్తారు. అలా పాటించాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది.వేరే వృత్తులు  చేయకూడదని వచ్చిన ఆదాయంతోనే సరిపెట్టుకుంటారు.. 

రాజులు, సైనికులు వంటివారు ..యుద్ధానికి వెళితే తిరిగి వస్తారో రారో తెలియదు. ఇలా ఎవరి బాధలు వారికి ఉన్నాయి. అన్ని కులాల్లోనూ మంచివారుంటారు, చెడ్దవారుంటారు.

సమాజంలో ఎన్నో వృత్తులుంటాయి. ఆవన్నీ లేనిదే సమాజం సరిగ్గా నడవదు.శూద్రులు రకరకాల పూజలు చేయకపోయినా ఫరవాలేదు, కొంత పూజ చేసినా చాలు.. చక్కటి ఫలితం వస్తుందని గ్రంధాలలో తెలియజేసారు. .. కొందరికి ఇది నచ్చదు. 

 హమ్మయ్య....పూజ కొంత చేసుకున్నా చక్కటిఫలితం వస్తుందంటే మంచిదే కదా..  అనుకునే శూద్రులూ ఉన్నారు.  శూద్రులకు ఎన్నో వెసులుబాట్లున్నాయి. వీరికి  ఆహారం విషయంలో   ఉల్లి, వెల్లుల్లి..వంటివి తినకూడదనే  నియమాలు లేవు. మడి వంటివి ఉండవు.

 ప్రత్యేకపూజలు చేయాలనుకుంటే కొన్ని నియమాలను పాటించాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. నియమాలను పాటించనివారు, మాంసాహారం తినేవారు ఈ పూజల విషయంలో పండితులను సంప్రదించి ఆచరించటం మంచిది.

పాతకాలంలో మడి అని అందరినీ దూరంగా ఉంచారని అంటారు కొందరు. బ్రాహ్మణులలో కూడా మడికట్టుకున్నప్పుడు వారి ఇంట్లో వారిని కూడా అందరినీ ముట్టుకోరు.
............................

 పాతకాలంలో అంటరానితనం లేదు. ఎవరిపనిని వారు చక్కగా చేసుకునేవారు. ఎవరి గౌరవం వారికి ఉండేది. పాతకాలంలో భారతదేశం ఎంతో సుసంపన్నంగా ఉండేది.ఈ విషయాలను ఎందరో విదేశీ యాత్రీకులు కూడా  తమ గ్రంధాలలో వ్రాసారు.అయితే, మధ్యకాలంలో విదేశీదండయాత్రల వల్ల వ్యవస్థ మారిపోయింది.

 ఇక్కడి సంపదపై కన్నేసిన కొందరు విదేశీయులు ఇక్కడకొచ్చి, ఇక్కడవారిని భయపెట్టి, బెదిరించి కొంత లోబరుచుకున్నారు. 

ప్రతిసమాజంలోనూ కొందరు చెడ్దవారుంటారు. వారు శత్రువులకు సహకరించారు. క్రమంగా అనేక చెడ్దవిషయాలు సమాజంలో ప్రవేశించాయి. విభజనలు జరిగాయి. మనుషుల మధ్య విభేదాలు ఏర్పడ్దాయి.
...................................

 విదేశాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. సంపన్నులు..పేదల మధ్య దూరం, తెల్లవారు..నల్లవారి మధ్య దూరం..ఒక్క మతం వారి మధ్యే గొడవలు.. ఇలాంటివి ప్రపంచమంతటా ఉన్నాయి. ఇక్కడే భారతదేశంలోనే ఉన్నాయనుకోవటం మూర్ఘత్వం.

హిందువుల్లో కులాలున్నాయంటారు. ఇతర మతాల వారిలో కూడా తెగలున్నాయి. వారి గొడవలు వారికున్నాయి.
........................................
  పాతకాలంలో శూద్రులు అంటరానితనం వల్ల ఇబ్బందులు పడ్దారని, వారు పైకి రావాలని ఈ మధ్య కాలంలో అనేక చట్టాలు వచ్చాయి. అంటరానితనాన్ని నిర్మూలించటానికి చట్టాలు తప్పకుందా రావాలి. ఇందువల్ల పరిస్థితి మెరుగుపడింది..  రిజర్వేషన్లు కూడా వచ్చాయి. 

కొద్దిగా ప్రారంభమయిన రిజర్వేషన్లు ఇప్పుడు బాగా పెరిగాయి.  

  రిజర్వేషన్లు లేని కులాల్లో కూడా ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన వారు ఎందరో ఉన్నారు. వీరికి చదువులు, ఉద్యోగాలు లభించటం కొంత కష్టంగా ఉంది.

ఇంకో కొందరున్నారు. వారు శూద్రులలోనే కొన్ని కులాలు. వీరు ఆర్ధికంగా ముందున్నారని వీరికి  రిజర్వేషన్లు  ఇవ్వలేదు...దీనినిబట్టి  ఏ కులంలో వారైనా ఆర్ధికంగా బాగుపడితే ఇక వారికి రిజర్వేషన్లు అక్కరలేదు అని, అనుకోవచ్చేమో..

 .........................

 రిజర్వేషన్లు  లేని శూద్రులలో కూడా  ఎందరో పేదవారున్నారు.  వీళ్ళు ఏమంటారంటే.. మేము పాతకాలంలో అంటరానితనంతో బాధపడ్దాము. ఇప్పుడు రిజర్వేషన్లు కూడా లేవు..ఇలా రెండు విధాలుగా అన్యాయం జరుగుతోందంటారు.  

 ఆర్ధికంగా వెనుకబడినవారికి చదువుకోవటానికి, వ్యాపారానికి నిలదొక్కుకోవటానికి ప్రభుత్వాలు ఆర్ధికంగా సహాయం చెయ్యవచ్చు. 

అంతేకానీ, ఎంతో కష్టపడి చదివిన మాకు  సీట్లు, ఉద్యోగాలు ఇవ్వకపోవటం అన్యాయం. ....

పాతకాలంలో కొందరికి అన్యాయం జరిగిందని.. ఇప్పుడు మరి కొందరికి అన్యాయం చేయటం ఏం న్యాయం? మమ్మల్ని ఇలా అణచివేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలంటున్నారు.

ఈ కొత్త అసంతృప్తులను గమనించి కాబోలు..ఈ మధ్య అన్ని కులాల్లోనూ ఆర్ధికంగా వెనుక బడినవారికి  కొద్దిశాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. అయితే, అవకాశాలు లేనివారు మరెందరో ఉన్నారు. వీటన్నింటివల్ల ప్రజల మధ్య విద్వేషాలు పెరుగుతున్నాయి. కనిపించకుండా ప్రజల మనస్సుల్లో విభేదాలు ఉంటున్నాయి.

 ఇవన్నీ లేకుండా ఉండాలంటే అందరికీ అన్ని అవకాశాలు చక్కగా ఉండాలి.   కొందరికి న్యాయం చేయాలంటే, మరికొందరికి అన్యాయం చేయటం సరైన పద్ధతి కాదు.
  .................................

కొందరేమో రిజర్వేషన్లు తీసివేయాలంటారు. కొందరేమో కులాలు, మతాలు తీసివేయాలంటారు. రిజర్వేషనులు, కులాలు, మతాలు..పోయే పరిస్థితి ప్రస్తుతం కనిపించటం లేదు. అందువల్ల అన్నీ ఉండకతప్పని పరిస్థితి ఉంది కాబట్టి, అవన్నీ ఉండక తప్పదు.

 కులవ్యవస్థ పోవాలంటారు, అయితే వెనుకబడ్ద కులాలు అని అంటున్నవారిలో కూడా ఎవరి కులంలో వారినే వారు వివాహం చేసుకుంటారు. హిందువులలో కొందరు, ఒకే కులంలో కూడా శాఖా భేదాల వల్ల వివాహాలు చేసుకోరు.

 మతాలు, కులాలలో మూఢనమ్మకాలు, అంటరానితనం వంటివి పోవాలి. రిజర్వేషన్లు ఉన్న కులాలలో కూడా ధనవంతులు, బాగా చదివి పెద్ద స్థాయిలో ఉన్నవారు ఉన్నారు. వారిలో కొందరు తమ రిజర్వేషన్లు వదులుకున్న గొప్పవారున్నారు. కొన్ని కులాలవారు  తమ రిజర్వేషన్ కోటాలో కొంత తగ్గించుకుని ఇతర శూద్రులకు వాటా ఇవ్వవచ్చు.
....................................

అప్పుడైనా ఇప్పుడైనా సమాజంలో కొందరికి అవకాశాలు బాగుండటం..కొందరికి అవకాశాలు తగ్గటం.. అనే విధమైన వ్యవస్థ సరైనది కాదు. అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. అసమానతలు ఉండకూడదు.

 సంపద కొందరు ధనవంతుల వద్ద మాత్రమే కాకుండా, అందరి వద్దా ఉండేలా వ్యవస్థ మారినప్పుడు అందరికీ చదువు,ఉపాధి అవకాశాలు చక్కగా ఉంటాయి.అసమానతలు తగ్గుతాయి.

సమాజంలోనూ, కుటుంబాల్లోనూ.. అందరూ ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకుంటూ ఉండాలి, . అందరూ కష్టపడి పనిచేసుకోవాలి. అందరూ చేసే పని ఒకేలా ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో రకం పని ఉంటుంది.

   సమాజం, కుటుంబం  అన్నాక కొంతయినా ఒకరితో ఒకరు సర్దుకుపోవాలి. అప్పుడే కుటుంబమయినా, సమాజమయినా బాగుంటుంది.  స్వేచ్చ అని ఎవరిష్టానికి వారు ప్రవర్తించటం వల్ల సమాజానికి హాని కలుగుతుంది. మేము చెప్పినట్లే అందరూ వినాలని అహంకరించినా సమాజానికి హాని కలుగుతుంది.

సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఏర్పరుచుకుని ముందుకుపోవాలి. లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి.
.....................................
 

కొన్ని విదేశాల్లో భారతీయుల పిల్లలలో తెలివిగలవాళ్ళను ఎంచుకుని, గిఫ్టెడ్ చైల్డ్... అని  తక్కువఫీజులతో చదివిస్తున్నారు. ఆ దేశాభివృద్ధిలో వీళ్ళు బాగా ఉపయోగపడతారు. ఇలాంటి వాటివల్ల భారతదేశానికి తిరిగిరావాలనుకున్న తల్లితండ్రులు కూడా విదేశాల్లోనే ఉండిపోతున్నారు. మేధోవలస వల్ల భారతదేశానికి నష్టం కలుగుతుంది.

.......................................

 నాకు తెలిసినంతలో భారతదేశంలో మాత్రం మార్కులు తక్కువ వచ్చినా కూడా రిజర్వేషన్లు ఉన్నవారికి, రిజర్వేషన్లు లేకపోయినా డబ్బు బాగా ఉన్నవారికి.. విద్యాసంస్థలలో సీట్లు ఇస్తారు.  మెరిట్ ఉన్నా కూడా.. పేదవారు, రిజర్వేషన్లు లేనివారు..విద్యాసంస్థలలో  సీట్లు పొందలేరు.

కులం పేరుతో మార్కులు తక్కువ వచ్చినా సీట్లు ఇవ్వటం, డబ్బుతో సీట్లు కొనటం ద్వారా సీట్లు ఇవ్వటం..కాకుండా, మెరిట్ ప్రకారం సీట్లు కేటాయించాలి.

డబ్బు కట్టి చదివిన వాళ్లందరిని తప్పుగా అనుకోనవసరం లేదు. మెరిట్లో బాగా మార్కులు వచ్చినా కూడా సీట్ రాని, రిజర్వేషన్ లేని వాళ్ల పిల్లలు డబ్బు కట్టి చదువుకుంటే తప్పేముంది? వాళ్లకూ డాక్టర్ అవ్వాలని ఆశలుంటాయి కదా.

.........................

మెరిట్ లేకుండా విద్యాసంస్థలలో సీట్లు ఇస్తే సమాజానికి నష్టం కలిగే అవకాశం ఉంది. ఒక డాక్టర్ కు సరిగ్గా నాలెడ్జ్ లేకపోతే పేషంట్లకు నష్టం జరిగే అవకాశముంది. ఒక ఇంజనీర్ కు సరిగ్గా నాలెడ్జ్ లేకపోతే సమాజానికి నష్టం జరిగే అవకాశముంది.. మెరిట్ లేకుండా చేసే పనుల వల్ల సమాజానికి నష్టం కలిగే అవకాశం ఉంది. 

విద్యలో..వృత్తిలో ఎక్కువ విషయపరిజ్ఞానం తెలుసుకోవాలంటే, కష్టపడి బాగా చదవాలి, నేర్చుకోవాలి. తక్కువ మార్కులు వచ్చినా సీట్ వస్తుందంటే, మరింత నేర్చుకోవటం కొరకు కష్టపడిచదవటానికి ఎక్కువమంది ప్రయత్నించకపోవచ్చు.

**************

 ఆర్ధికంగా వెనుకబడిన వారికి చదువుకోవటానికి ప్రభుత్వాలు ఆర్ధికంగా సాయం చేయవచ్చు. మెరిట్ ఉండాలి. చదువు, ఉద్యోగాల్లో మెరిట్ కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.  

............................
 కొన్ని శూద్రకులాల వారు ధనవంతులు కాబట్టి, వాళ్ళు అభివృద్ధి చెందారని,  రిజర్వేషన్లు ఇవ్వటం లేదు. అలాంటప్పుడు, అందరికీ విద్య, ఉపాధి అవకాశాలను కులాల ప్రకారం చూడకూడదు. 

ఏ కులంవాళ్ళయినా పేదవారికి చదువుకు, వ్యాపారానికి లోన్లు ఇచ్చి వారిని ప్రోత్సహించాలి. అంతేకానీ, నైపుణ్యత ఉండవలసిన చోట నైపుణ్యత ఉండాలి కదా..

కొన్నిసార్లు జనాభా ఎక్కువ ఉన్న కులాలకు రిజర్వేషన్లు ఎక్కువ ఇవ్వాలంటారు. రిజర్వేషన్లు వస్తాయని ఎక్కువ సంతానంతో జనాభా పెంచితే, రిజర్వేషన్లు అందరికి సరిపోవు కదా. మంది ఎక్కువయితే మజ్జిగ పలుచన సామెత ఉందిగా.

............................

పాతకాలం వాళ్లు కొందరిని కులాల పేరుతో అవకాశాలు రాకుండా చేసినట్లుగా..ఇప్పుడు కూడా కులాలపేరుతో కొందరికి అవకాశాలు రాకుండా చేయటం ఏం న్యాయం?  అందరూ ఈ దేశపు పౌరులే కదా.

పాతకాలంలో కొన్ని విదేశాల వాళ్లు  మనదేశాన్ని దోచుకున్నారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు మనల్ని ఉద్దరించాలంటే, ఆ దేశాల వాళ్ళు   ఊరుకుంటారా? పాతకాలంలో ఏం జరిగిందో.. ఇప్పుడు మాకేం సంబంధం , పాతకాలంలో అన్యాయాలు చేసింది మేముకాదుకదా ..అనికూడా అంటారుకావచ్చు.

*************************

ప్రపంచంలో  అధికారం, డబ్బు కొరకు ఎంతకైనా దిగజారుతున్నారు కొందరు. వారి మాటలు నమ్ముతున్నారు కొందరు ప్రజలు.

విదేశీయులు చాలా కాలం భారతదేశాన్ని పాలించారు. అప్పుడు వారివల్ల భారతీయులు ఎన్నో కష్టాలు అనుభవించారు. 

భారతదేశాన్ని పాలించిన విదేశీయులు ఇక్కడి ప్రజలను ఎన్నోబాధలు పెట్టారు. స్త్రీలపట్ల అవమానాలు చేసారు. అన్యాయాలకు ఎదురుతిరిగి పోరాడిన యువకులను చంపివేసారు. 

అప్పుడు కూడా  కొందరు స్వదేశీయులే తమ స్వార్ధం కొరకు వారికి సహకరించారు. ఈ రోజుల్లో కూడా కొందరు స్వదేశీయులు దేశానికి ద్రోహం చేస్తున్నారు. 

 ప్రపంచయుద్ధసమయంలో మనకు యుద్ధంతో ఏమీ సంబంధం లేకపోయినా, మన సైనికులను యుద్ధానికి తీసుకెళ్లటం వల్ల ఆ కొత్త వాతావరణంలో యుద్ధం చేయలేక వేలమంది సైనికులు చనిపోయారు.

******************
 ఈ మధ్యన..మనుషులు మతాల పేరుతో,కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, దేశాల పేరుతో.. ఒకరికొకరు నిందించుకోవటం ఎక్కువయ్యింది. ఎవరికైనా దైవం ఒక్కరే.. ఆ మహాశక్తి ఒక్కటే. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క దైవం సృష్టించరు. 

అయితే ఇతరులు మనల్ని అణచివేస్తారేమో? అనే భయాల వల్లా, ఇతరులపై మనమే ఆధిపత్యం చెలాయించాలనే ధోరణి వల్లా.. ఇలాంటి కొందరి వల్ల సమాజం అంతా సమస్యలు వస్తుంటాయి.

  గొడవకొరకే కొందరు వాదనలకు దిగుతారు. అలాంటివారు ఎవరేం చెప్పినా వినిపించుకోరు.

ఓట్ల కొరకు పార్టీలు ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ప్రజలు కూడా అలాంటి వారికే ఓట్లు వేస్తున్నారు.

 మతం పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి తమ పబ్బం గడుపుకుంటున్న వారి విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు ఆలోచించాలి. ప్రజలు విచక్షణతో ఉండకపోతే ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు.

 ప్రపంచంలోని అందరూ సుఖసంతోషాలతో ఉండాలి.చెడు పోవాలి.

 నా అభిప్రాయాలు కొందరికి  నచ్చకపోవచ్చు. నాకు తోచినవి వ్రాసాను.  వీటిలో చాలా విషయాలను ఇంతకుముందే బ్లాగులో వ్రాయటం జరిగింది. ఎవరు ఎన్ని చెప్పినా అనేవాళ్లు అంటూనే ఉంటారు. ఎంతని చెప్పగలం? చేయగలిగినంత చేస్తాము. దైవం ఎవరికి ఏది చేయాలో అది చేస్తారు. అంతా దైవం దయ.



Sunday, August 27, 2023

సంపదలకు నిలయమైన భారతదేశం...ఇప్పుడు..

 చంద్రయాన్ విజయవంతమవటం గర్వించదగిన  ఎంతో గొప్ప విషయం.

భారతదేశం ఒకప్పుడు సిరిసంపదలతో ఉండేది.ఎంతో పరిశుభ్రంగా కూడా ఉండేది. ఇప్పుడు చాలాచోట్ల చూస్తే మురికికుప్పలతో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని చూసి మనం సిగ్గుపడాలి. ఇండోర్ ఒకప్పుడు చాలా మురికిగా ఉండేదట. ఒక కమిషనర్ గారు కొందరు సిబ్బందితో కలసి ప్రజలను జాగృతం చేసి ఇండోర్ ను ఇప్పుడు శుభ్రమైన నగరంగా మార్చివేసారు. భారతదేశం అంతా అలా పరిశుభ్రంగా ఎందుకు మార్చుకోలేము? విదేశాల వాళ్ళు ఎంతో శుభ్రంగా ఉంచుకుంటున్నారు. మనమెందుకు ఇలా మురికిగా ఉండాలి. అందరూ తలచుకుంటే శుభ్రంగా ఉంచుకోవటం పెద్ద విషయమేమీ కాదు.  


మొదటగా కనీసం దేవాలయాల వద్ద, నదులను అయినా శుభ్రంగా ఉంచుకోవటాన్ని మొదలుపెడితే బాగుంటుంది. ఈ విషయాల గురించి పదేళ్ళ క్రితమే బ్లాగులో వ్రాసాను. ఇప్పటికీ అలాగే ఉంది పరిస్థితి. జనాల మూఢత్వం చూసి దైవానికి కూడా విసుగు వస్తోందేమో.. భారతదేశం ఇలా పేదరికంలో ఉంది. శుభ్రత ఉన్నచోట లక్ష్మీదేవి ఉంటుందని పెద్దలు తెలియజేశారు. డబ్బు కొరకు విదేశాలకు పరుగులు పెడుతున్న యువత పెరిగిపోతున్నారు. అక్కడ అంతా సుఖమే ఉండదు. విదేశాల్లో కూడా మంచి, చెడు రెండూ ఉన్నాయి. 

 

విదేశాలకు వెళ్లిన భారతీయులు గొప్పగా ఆచారవ్యవహారాలను పాటిస్తున్నారు.. అని కొందరు అంటారు. అక్కడివారు ఎంతకాలం పాటించగలరో చెప్పలేము. ఒక తరం వరకు కొంత పాటించగలరు. అక్కడ ఈ తరంవాళ్ళు కూడా కొందరు మామూలు రోజులలో మంగళసూత్రం తీసివేసి, పండుగలు వస్తే మాత్రం శ్లోకాలు చదివి పూజలు చేయటం చేస్తుంటారు. వారి తరువాతి తరం రెండు సంస్కృతుల మధ్య నలిగిపోయి క్రమంగా మారిపోయే అవకాశం ఉంది. విదేశాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. సడన్ గా ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? మన ఇల్లు బాగోలేదని ప్రక్కింటికి వెళ్తామా? మన ఇంటినే మనం బాగుచేసుకుంటాము. విదేశాలకు పరుగులు మారి మనదేశాన్ని మనం బాగుచేసుకోవాలి.విదేశాలకు వెళ్లటానికి కూడా ఒక హద్దు ఉంటుంది. జనాలు వరదలా పోతామంటే అక్కడివాళ్ళే అడ్డుకట్టవేస్తారు. 

 

ఎక్కడైనా సంపద విపరీతంగా పెరిగితే కష్టాలే. ఎంతవరకూ అవసరమో అంతవరకే అయితే మంచిది. ఎందుకంటే, ఒకప్పుడు భారతదేశం సిరిసంపదలతో తులతూగేది. మన దేశాన్ని ఆక్రమించిన విదేశీయులు ఇక్కడనుంచి ఓడలలో బోలెడు బంగారాన్ని,రత్నాలు, వజ్రాలు ఇంకా ఎన్నో విలువైన గ్రంధాలను, అవి చదవడానికి బ్రాహ్మణులను కూడా వారి దేశాలకు తీసుకెళ్ళారని గ్రంధాల ద్వారా తెలుస్తుంది. మన ప్రాచీన విజ్ఞానం గురించి ఎన్నో గ్రంధాలు ఉన్నాయి. టెక్నాలజీ, గొప్పవైద్యం, సర్జరీలు , ఇంకా ఎంతో విజ్ఞానం  ఉంది..

 PraveenMohan తెలుగు అనే బ్లాగ్..చూడవచ్చు.   

JanakiRam.CosmicTubeChannel....చూడవచ్చు.

ఇంకా ఇలాంటివి చూడవచ్చు.

సంపదలకు నిలయమైన భారతదేశానికి రావడానికి కొత్తదారి కనుగొనే ప్రయత్నంలో కొందరు విదేశీయులు కనిపెట్టినదే ఇప్పటి అమెరికా భూభాగం... అనేకదేశాల వారు వచ్చి అక్కడ స్థిరపడ్దారు. ఎక్కడైనా మంచిచెడు ఉంటాయి. విదేశాల వారి వద్ద నుంచి కూడా ఎన్నో మంచి విషయాలను మనం తెలుసుకోవచ్చు.

 

 నేను ఆ మధ్యన విదేశాలకు వెళ్లినప్పుడు గమనించాను. వారు చాలామంది శుభ్రతను పాటిస్తారు.అంటే, రోడ్లపైన ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరు. నడిచేవారు కనిపిస్తే దూసుకుపోకుండా కారును స్లొ చేసి వెళ్ళమంటారు. విదేశీయులు కొందరు, మనప్రాచీనులు తెలియజేసిన విధానాలను పాటిస్తున్నారు. కొందరు ఉదయాన్నే లేచి పనులను చేసుకుని, సాయంకాలమే భోజనం చేసి, రాత్రి త్వరగా పడుకుంటున్నారు. కొందరు స్త్రీలు ఇంటిపట్టున ఉండి చంటిపిల్లలను దగ్గరుండి చక్కగా పెంచుకుంటున్నారు. 

 

మనదేశంలో కొందరు అవసరం లేకున్నా అర్ధరాత్రి భోజనశాలలకు వెళ్ళి తింటున్నారు. భారతదేశంలో చాలామంది ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేస్తుంటారు. చాలామంది భారతీయులకు డబ్బుపిచ్చి బాగా పెరిగింది. భారతీయులు ఇలా ఎందుకు మారిపోయారో? బాధగా ఉంది. 

  ఇళ్లల్లో ప్లాస్టిక్ వేస్టుకు ఒక చెత్తబుట్ట, వంటవండినప్పుడు వచ్చిన చెత్తకు ఒక చెత్తబుట్టపెట్టుకుని బయట కూడా విడివిడిగా పారవేస్తే శుభ్రంగా ఉంటుంది. ప్లాస్టిక్ పాలకవర్లు కొంచెం కడిగి ఉంచుకోవాలి. సూపర్ బజార్ కు వెళ్ళినప్పుడు సరుకులను వేసి ఇచ్చే ఒక పెద్దప్లాస్టిక్ బాగ్ లో వేసి ఈ వాడేసిన పాలకవర్లు, నూనెకవర్లు..ఉంచి, వారానికి ఒకసారి బయటపడేసుకోవచ్చు.

 

 పూజ చేసినప్పుడు మిగిలిన పువ్వులను,ఇంకా మిగిలినవాటిని.. పెరట్లో మొక్కలవద్ద వేయవచ్చు. లేదంటే బయట ఎక్కడైనా మొక్కలు ఉన్నదగ్గర వేయవచ్చు. ఇవన్నీ వద్దనుకుంటే ఒక పాత న్యూస్ పేపర్ చింపకుండా పెద్దగా తీసుకుని అందులో వేసి, ఆ పొట్లాన్ని కూరగాయల వేస్ట్ తోపాటు పడేయవచ్చు.  ప్లాస్టిక్ కవర్లో కాకుండా పేపర్లో చుట్టివేయండి. 


జాతకాలు..కొన్ని నమ్మకాలు..

 

పాతకాలంలో కొందరికి బిడ్దలు జన్మించినప్పుడు,  ఆ బిడ్దల వల్ల తల్లితండ్రికి దోషం.. అని చెబితే ఆ చిన్నపిల్లలను తిట్టేవారట. అలా చేయటం చాలా పాపం.ఎవరు చేసిన కర్మల ప్రకారమే వారి జాతకాలు ఉంటాయి, వారి కర్మల ప్రకారమే బిడ్దలు కూడా జన్మిస్తారు. తమ గతకర్మ ప్రకారం బిడ్దలు జన్మిస్తే ఆ బిడ్డల తప్పు ఏముంటుంది? 

జాతకంలో దోషాలు ఉంటే మంచిపనులు చేసి దోషాలు తగ్గించుకోవాలి. అంతేకానీ, పసిబిడ్దలను తిట్టడం ఇంకో ఘోరమైన పాపం. 

జాతకాలు చూడటంలో ఎన్నో విధానాలు ఉంటాయి. బిడ్ద కడుపులోపడ్ద సమయం ఎవరూ చెప్పలేరు. బయటకు వచ్చాక బొడ్దుత్రాడు కత్తిరించిన తరువాతా, ముందా, ఊపిరిపీల్చిన సమయమా..ఇలా ఎన్నో ఉన్నాయి. 

ఈ రోజుల్లో కొన్ని పంచాంగాలలో ఒకే ఊరికి సంబంధించిన తిధినక్షత్రాల సమయాలలో కూడా చాలా తేడాలు ఉంటున్నాయి. అలాంటప్పుడు జాతకం సరిగ్గా ఎలా తెలుస్తుంది?  ఈ విషయాల గురించి గతంలో బ్లాగులో వ్రాయటం జరిగింది. 

 నాకు ఏమనిపిస్తుందంటే, మనం దైవభక్తి కలిగి ఉండి, సత్ప్రవర్తనతో ఉండటమే  చాలా సమస్యలకు పరిష్కారం.

సతీసావిత్రి, మార్కండేయుల వారు తమ జీవితాలను మార్చుకోగలిగారు. 

 ..........................

ఇక , ఆడపిల్లలు మెచూర్ అయిన సమయాన్ని బట్టి భవిష్యత్తు  చెప్పటం గురించి నాకు ఏమనిపిస్తుందంటే, అసలు మొదటిసారి రజస్వల ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము. మొదటిసారి కొద్దిగా కనిపించి కనిపించనట్లు జరిగి ఎవరూ గమనించకపోవచ్చు. ఆ సమయాన్ని ఎలా తెలుసుకోగలం? అందువల్ల అలాంటి వాటికి భయపడనవసరం లేదు.  

మనం మొదట గమనించిన సమయమే మొదటిది కాకపోవచ్చు. రుతుస్రావం మొదట రిలిజ్ అయిన సమయమే అసలైన సమయం. . అయితే, మొదటి బిందువు ఏ సమయంలో వచ్చిందో చెప్పటం కష్టం.

కొందరిలో బహిష్టుకు సుమారు ఒకరోజు ముందు కూడా ఆరెంజ్ రంగులో స్రావం కనిపిస్తుంది. దాన్నిబట్టి కూడా రజస్వల ప్రారంభమయ్యిందని అనుకోవాలా? ఇవన్నీ సందేహాలే.

 అందువల్ల, మనం మొదట గమనించిన సమయాన్ని పట్టుకుని, ఆ అమ్మాయి భవిష్యత్తు అలా ఉంటుంది..ఇలా ఉంటుంది..అని చెప్పటం ఎంతవరకు సరైనది?

 కొన్ని సమయాలలో రజస్వల అయితే, ఆ అమ్మాయి భవిష్యత్తులో విధవ అవుతుందని, ఇంకా ఏదేదో అవుతుందని భయంకరంగా పుస్తకాల్లో రాస్తే, ఆ అమ్మాయి, అమ్మాయి తల్లితండ్రి, వారిని వివాహం చేసుకున్నవాళ్ళు చాలా బాధపడతారు. ఇంట్లో గొడవలు కూడా రావచ్చు. సరిగ్గా తెలియని విషయాల గురించి ఏదేదో చెప్పి  జీవితాలను గందరగోళం చేయటం సరైనది కాదు.

జాతకం ఎలా ఉన్నా, దైవభక్తి కలిగి దైవస్మరణ చేయటం..సత్ప్రవర్తనతో జీవించటానికి ప్రయత్నించటం..కష్టాలలో ఉన్న జీవులకు సాయం చేయటం..చేస్తూఉంటే కష్టాలు తగ్గే అవకాశం ఉంటుంది.

................................

 పాతకాలంలో శూద్రులు జాతకాలపొంతన అంత పట్టించుకునేవారు కాదు. అప్పట్లో చాలామందికి జన్మసమయమే సరిగ్గా చూసేవారు కాదు. ఇప్పుడు సోషల్మీడియా వచ్చాక జాతకాల పొంతన వంటివి చెప్పటం వల్ల అందరూ చూస్తున్నారు.

 కొన్నిసార్లు జాతకాలు కలవలేదని ఇష్టమయిన సంబంధాలను కూడా వదులుకోవలసి వస్తోంది. కొందరి విషయంలో జాతకాలు బాగా కలిసాయని వివాహం చేసుకున్నా కూడా,  గొడవలుపడటం, విడిపోవటం జరుగుతోంది. 

సూర్యోదయం ఊరిని బట్టి మారుతుంది. కొన్ని పంచాంగాల్లో ఒకే ఊరిలో కూడా నక్షత్రం సమయం విషయంలో గంట కూడా తేడా ఉంటోంది. ఆ సమయంలో జన్మించిన వారిది ఏ నక్షత్రం అనుకోవాలో? నక్షత్రమే మారినప్పుడు వివాహపొంతన, తారాబలం సరిగ్గా ఎలా కుదురుతుంది? ఆ సమయంలో ముహూర్తం పెడితే ఫలితం ఎలా ఉంటుందో? తెలియదు. 

 konni links..

 * జాతకంలో రాసిపెట్టి ఉన్నది అనుభవించక తప్పదా ?

 * జాతకాలు విషయంలో నాకు కలిగిన కొన్ని సందేహాలు....

 

ఒంటినిండా, ఇంటినిండా ఎన్నో వస్తువులు ప్రోగేసుకోవటం కన్నా...

 


ఈ రోజుల్లో చాలా మంది ఎలాగోలా డబ్బు  సంపాదించి, వస్తువులను కొనటం కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు.

దుస్తుల కోసం, ఫర్నిచర్ మరియు  కార్లు..వంటి వాటి విషయంలో అవసరానికి మించి ఖర్చుపెడుతున్నారు.

ఈ రోజుల్లో చాలామందికి నెలకే వేలు లేక కొన్ని లక్షల వరకు  ఆదాయం వస్తోంది. ఈ డబ్బుతో విపరీతంగా వస్తువులను కొనిపడేస్తున్నారు.

మనిషి  సౌకర్యంగా జీవించాలంటే కొన్ని వస్తువులు చాలు.
 ఉదాహరణకు దుస్తుల విషయంలో చూస్తే..

 ఒక మనిషి ఒక సంవత్సరానికి.. రోజువారీ ధరించే దుస్తులు అరడజను( సుమారు 1000  రూపాయల లోపు ), వారాంతాల్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ధరించటానికి  నాలుగు దుస్తులు ( సుమారు 1000 నుంచి 2000 ధరలో ) ఫంక్షన్స్లో  ధరించటానికి (2000 నుంచి 5000 ధరలో)  రెండు ఖరీదైన డ్రస్సులు కొనుక్కోవచ్చు.

ఈ విధంగా ఒక  మహిళకు  సంవత్సరానికి సుమారు  సుమారు  10,000 లేక  25,000 ఖర్చు చేస్తే 12 చీరలు లేక డ్రస్సులు వస్తాయి.. వచ్చే సంవత్సరం మళ్లీ కొత్తవి కొనుక్కోవచ్చు.

  అయితే, ఈ రోజుల్లో చాలామంది ఒక్కో డ్రస్సుకే 20 వేలు, 50 వేలు, ఒక లక్ష..ఆపైన కూడా ఖర్చు చేసి కొంటున్నారు.

 ( సొంత ఫంక్షన్స్ కొరకు అయితే కొంచెం ఎక్కువ ఖరీదు పెట్టి  దుస్తులు కొనుక్కోవచ్చు. )

డబ్బు ఎక్కువఉన్న వారు కూడా  పరిమితమైన ధరలో వస్తువులు కొనుక్కోవచ్చు.

కోటి రూపాయల కారు కన్నా 10 లక్షల లేక 20 లక్షల  కారును కొనుక్కోవచ్చు.

 (పైన వ్రాసిన ధరలను కొంచెం ఎక్కువ తక్కువగా మార్చుకోవచ్చు.)

మార్కెట్లో కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నవన్నీ కొనాలని ఆశపడకుండా , ఏది అవసరమో అవే కొనుక్కుంటే బాగుంటుంది.

 బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కువ ధరలు పెట్టి బోలెడు వస్తువులను కొనటం కన్నా, తగుమాత్రం వస్తువులను కొనుక్కుని,  తమ ఉద్ద ఉన్న డబ్బుతో.. డబ్బు బాగా అవసరం ఉన్నవారికి సహాయం చేస్తే ఎంతో మనశ్శాంతి లభిస్తుంది.

 ఉదా.. డబ్బు లేక  వైద్యాన్ని చేయించుకోలేకపోతున్నవారికి, డబ్బు లేక చదువుకు దూరమవుతున్నవారికి..ఇలా సహాయం చేయవచ్చు.

ఊళ్ళలో నీటిశుద్ధి కేంద్రాలను  ఏర్పాటుచేయవచ్చు. ఉచిత అన్నదానం, వైద్యకేంద్రాలను ఏర్పాటుచేయవచ్చు. ఇలా ఎన్నో చేయవచ్చు. 
 
పర్యావరణాన్ని రక్షించే సంస్థలకు ధనసహాయం చేయవచ్చు. 
 
పశుపక్ష్యాదులను కాపాడే వారికి సాయం చేయవచ్చు. ఇందువల్ల పుణ్యం వస్తుంది. 
 
  అదేపనిగా అతిగా దానాలు చేసేసి తాము అడుక్కునే పరిస్థితి తెచ్చుకోకూడదు.
 
జీవితంలో ఎప్పుడైనా కష్టం వస్తే, మనం చేసుకున్న పుణ్యం వల్ల కష్టాలు తగ్గే అవకాశం ఉంటుంది.
 
 పొదుపుగా జీవించలంటారు.. వస్తువులపైన వ్యామోహాన్ని తగ్గించుకుంటే, వాటికోసం  అతిగా డబ్బు సంపాదించవలసిన అవసరం కూడా తగ్గుతుంది.
 
 ఐశ్వర్యాన్ని అతి ఆడంబరంగా ప్రదర్శించేవారికి ఇతరుల నుండి దృష్టి ( నెగటివ్ శక్తి..) తగిలి కష్టాలు వచ్చే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. 
 
 ఒంటినిండా, ఇంటినిండా ఎన్నో వస్తువులు  ప్రోగేసుకోవటం కన్నా, మనతో పాటు ఇతరుల జీవితాలు బాగుపడటంలో  సహాయపడటం ఎంతో మంచిది.
 .....................
 
 జీవితంలో ఎంతోకొంత సంతోషంగా ఉండాలంటే, అతిగా ఆలోచించకూడదు, అతిగా మాట్లాడకూడదు( అనవసరంగా వాగ్వివాదాలు చేయకూడదు..), అతిగా తినకూడదు, అతిగా కోరికలను పెంచుకోకూడదు, అతిగా సెల్ఫోన్ చూడటం వంటివి చేయకూడదు..అనిపిస్తుంది.
 
 

పాలు, తేనె వంటివి శాకాహారం ఎలా అవుతాయి?..హింస..అహింస..

 

వీగన్ అనే వారు పాలు, నేయి, పెరుగు..వంటివి కూడా తినరు. ఇవి కూడా జంతువుల నుంచి వచ్చినవే అని వారు తినరు. పాలు జంతువుల రక్తం నుంచి తయారయ్యే పదార్ధమే అని వైజ్ఞానిక పరిశోధనలో తేలిందని, అందువల్ల అవి శాకాహారం ఎలా అవుతుందని అంటారు. 

  శాకాహారం అంటే కూరగాయలు,పండ్లు,ఆకుకూరలు, కొన్నిరకాల దుంపలు..ఇలా మొక్కలు, చెట్లనుంచివచ్చేవి.

మరి.. పాలు, తేనె వంటివి శాకాహారం ఎలా అవుతాయి? తేనెను పిండే సమయంలో కొన్నిసార్లు  ఆ తేనెటీగలు చనిపోయి తేనెలో ఉండే అవకాశం ఉంది. పాల ఉత్పత్తులు, తేనె..వంటివి ఆహారంగా తీసుకునేవారిని శాకాహారులని ఎందుకు అనాలి? 

 ************

 కొందరు ఏమంటున్నారంటే, మనుషులు కూడా చిన్నతనంలో తల్లిపాలు త్రాగుతారు, అలాంటప్పుడు తల్లిరక్తం త్రాగినట్లు కాదు కదా..అని వాదిస్తుంటారు. పెద్దవారు పాలు త్రాగటానికీ, చంటిపిల్లలు పాలుత్రాగటానికి పోలిక ఏమిటి? 

 తల్లిపాలు త్రాగే చంటిపిల్లలు కొద్దిగా త్రాగుతారు. చంటిపిల్లలు పాలు తప్ప వేరే ఆహారం తినలేరు కాబట్టి పాలు త్రాగుతారు. బడితల్లాగా పెద్దయిన వారుకూడా కాఫీలు, టీలు, పాలతో చేసిన స్వీట్స్ రుచికి అలవాటు పడి పాలపదార్ధాలు వాడుతున్నారు. 

 ఇక ప్రసాదాల్లో పాలు, నెయ్యి, పెరుగు..వాడమని గ్రంధాలలో చెప్పారు ..అంటారు. నిజమే చెప్పారు, ఆ కాలంలో పశువులు ధారాళంగా పాలను ఇచ్చిన రోజుల్లో వాటిదూడలు త్రాగగా ఇంకా పాలు మిగిలిఉండేవి. వాటిని పిండుకుని పాలు, నెయ్యి, పెరుగు చేసుకుని ప్రసాదం తయారుచేసి దైవానికి నివేదించి ప్రసాదం స్వీకరించేవారు. 

 *********

ఈ రోజుల్లో మనుషుల రుచులు పెరిగి, పాలను విరిచి పన్నీరులు, కాఫీలు, టీలు తయారీకి ఎన్ని పాలు కూడా సరిపోక పశువులకు హార్మోన్స్ ఇచ్చి కొన్నిచోట్ల వాటి దూడలను చంపి, మిషన్ల ద్వారా పాలను పిండుతున్నారు. ఇదేమి న్యాయమో ఆలోచించండి. 

 నువ్వులు వంటివాటిలో పాలకంటే ఎక్కువ కాల్షియం ఉంటుందని ఎందరో చెబుతున్నారు.

 ప్రసాదం అంటే తగుమాత్రం పుచ్చుకున్నా చాలు. అప్పుడు అందరికీ కొద్దిగా పాలు, నేయి, పెరుగు..సరిపోతాయి. అంతేకానీ భారీఎత్తున ప్రసాదాలు తయారుచేసి బోలెడంత  తినమని  వారి అభిప్రాయమని నాకు అనిపించటం లేదు .  మనం రోజూ తినే భోజనాన్ని కూడా తినేముందు దైవానికి నివేదించి తినవచ్చు. ఇది ఇంకోరకం ప్రసాదం.దీనిని కడుపునిండా తినవచ్చు. 

అయినా మనకోసం ఇతర జీవులను ఇంతలా ఎందుకు బాధపెట్టాలి? 

  శాకాహారం కాని పాల ఉత్పత్తులు, తేనె వంటి వాటిని ఆహారంగా తీసుకుంటున్నప్పుడు,    శాకాహారులని ఎందుకు అంటారని సందేహం.

 శాకాహారాన్ని కూడా ఎంతవరకో అంతవరకే తినాలి. రుచికొరకు అదేపనిగా తినటం కూడా తప్పే. అదేపనిగా తినటం వల్ల అనారోగ్యం కూడా వస్తుంది. పిల్లలు, యుక్తవయస్సు వారు సరిపడినంత పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలి. పెద్దవయస్సు వచ్చినతరువాత రుచికొరకు బోలెడు ఆహారాన్ని తినటం మంచిదికాదు.

******************

సాత్వికాహారం,రాజసాహారం, తామసాహారం..అని కూడా ఉన్నాయి. సాత్వికాహార నియమాలు పాటించటం చాలా  కష్టం. చద్దివి, నిల్వ ఉన్నవి,  ఎక్కువగా వేయించిన వేపుళ్లు..వంటివి తినటం కూడా తామసాహారం కోవలోకే  వస్తుందంటారు. ... ఇంకా చాలా ఉన్నాయి. న్యాయార్జిత సొమ్ముతో సంపాదించిన ఆహారం కూడా తామసాహారమే.

 ******************

 పశువులు ఏమైనా చనిపోతే వాటి శరీరాలను పూడ్చవచ్చు, దహనం చేయవచ్చు. లేదంటే ఇతర పశుపక్ష్యాదులకు ఆహారంగా అలా బయట వదిలేయవచ్చు..వాటిని మనుషులు తినవలసిన అవసరం లేదు.

**********************

కొంతమంది ఏమనుకుంటారంటే, సాటి జీవులను ఎక్కువగా చంపితే వీరత్వం అనుకుంటారు. ఎవరైనా తమ మనస్సును అదుపులో ఉంచుకున్న వారే వీరులు. అంతేకానీ, మూగజీవులను చంపటం వీరత్వం కాదు.

*****************

  ప్రాచీనకాలంలో రాజులు, సైనికులు యుద్ధాలలో శత్రువులను చంపవలసి వచ్చేది.   శత్రువులను చంపే విషయంలో కొంత కఠినత్వం రావటానికి..వేటకు వెళ్ళటం, జంతువులను చంపటం.. జరిగిందేమో? అని అనిపిస్తుంది....ఇలా వ్రాసిన తరువాత నాకు కొన్ని ఆలోచనలు కలిగాయి....

( యుద్ధాలు చేసుకోవటం మనుషుల తప్పు. తమపై దండెత్తి వచ్చిన క్రూరులైన శత్రువులను చూస్తే ఆవేశం దానికదే ఉప్పొంగి శత్రుసంహారం చేయాలి. అంతేకానీ, తమకు..ఆవేశం, కఠినత్వం..రావటం కొరకు మూగజీవులను చంపవలసిన అవసరం లేదు..అనిపించింది.)


యుద్ధసమయంలో కొన్నిసార్లు ఆహారం సరిగ్గా దొరకని సందర్భాలలో..దొరికిన జంతువులను చంపి తినటం .. అలా కూడా వారు మాంసాహారాన్ని అలవాటు చేసుకున్నారేమో? అనిపిస్తుంది....ఇలా వ్రాసిన తరువాత నాకు కొన్ని ఆలోచనలు కలిగాయి....


(ఇక్కడ ఒక విషయం ఏమిటంటే,
హారం కొరకు ప్రపంచంలో బోలెడు మొక్కలున్నాయి. బోలెడు మొక్కలు, చెట్ల నుండి బోలెడు ఆహారం లభిస్తుంది. ఆకలి వేస్తే.. ఆకులు, కూరలు, కాయలు, పండ్లు..వంటివి తిని కడుపు నింపుకోవచ్చు. పశుపక్ష్యాదుల ప్రాణాలు అంటే మనుషులకు లెక్కలేదు కాబట్టి, వాటిని చంపి తింటారు. ఆహారం కొరకు పశుపక్ష్యాదులను  చంపకూడదు..అనిపించింది.) 

***********

మొక్కలకు కూడా జంతువులకు లానే జీవం ఉంది, మొక్కలను తింటున్నట్లే జంతువులను చంపి తింటే తప్పేంటి? అని కొందరు మాట్లాడుతున్నారు. 

మొక్కలు, చెట్ల యొక్క ఆకులను, కొమ్మలను  తీస్తే కొత్త ఆకులు, కొమ్మలు పెరుగుతాయి. మరి చాలా జంతువుల విషయంలో అలా అవయవాలు పెరగవు కదా..

 మనుషులు, మొక్కలు, జంతువులు అన్నింటికి జీవం ఉంది.. అన్నీ సమానమే కాబట్టి, జంతువులను చంపి తిన్నట్లే మనుషులనూ చంపి తింటే తప్పేంటి? అని కూడా అంటారా?

మనుషులు తమకు చిన్న దెబ్బ తగిలినా కూడా గిలగిలలాడుతూ గాయం, అనారోగ్యం తగ్గాలని దైవాన్ని ప్రార్ధిస్తారు. జంతువులను చంపి తింటే మాత్రం తప్పేమిటని ప్రశ్నిస్తారు.
................................

 వేదముల ప్రకారం ఎవరైనా కూడా..వారు క్షత్రియులైనా, మరెవరైనా కూడా  మాంసాహారాన్ని భుజించకూడదని తెలుస్తుందని.. వేదముల గురించి  రీసర్చ్..చేస్తున్న వారు తెలియజేసారు.

వేదముల గురించి రీసెర్చ్ చేస్తున్నవారు ఎన్నో విషయముల గురించి తెలియచేయటం ఎంతో మంచి విషయము. 

************

నేను చదివిన, విన్న.. కొన్ని విషయాలను బట్టి క్షత్రియులు, మరికొందరు.. మాంసాహారాన్ని భుజించవచ్చేమో?..అనుకున్నాను. ..అలా భావించటం తప్పని  ఇప్పుడు తెలుస్తోంది.

***********

సంస్కృతంలో ఒకే పదానికి ఎన్నో అర్ధాలుంటాయట. ప్రతి విషయానికి ఎన్నో అంతరార్ధాలూ ఉంటాయంటారు.

 గ్రంధాలలో ఎప్పటినుంచో ఎన్నో మార్పులుచేర్పులు జరిగాయని కూడా తెలుస్తుంది.కొందరు స్వార్ధపరులు, కొందరు తెలిసితెలియనివాళ్లవల్ల ఎన్నో ప్రక్షిప్తాలు (మార్పులుచేర్పులు)జరిగాయంటారు. 

**************

వేట అలవాటు వల్ల  దశరధ మహారాజు , పాండుమహారాజు.. కష్టాల పాలయ్యారు.

**************

 సృష్టిలో పర్యావరణ సమతౌల్యం కొరకు  మొక్కలను జంతువులు తినటం, చిన్న జంతువులను పెద్ద జంతువులు తినటం ఉంది. ఎందుకంటే, మొక్కలు అన్నీ బ్రతికి పెరిగి పెద్దవయితే దగ్గరదగ్గరగా ఉండి బలంగా పెరగవు. భూసారం సరిపోదు. జంతువులు అన్నీ బ్రతికి, పెరిగితే వాటికి ఆహారం సరిపోదు. అందుకే జంతువులు ఒకదానిని మరొకటి తింటాయి.

సమతౌల్యం కొరకు మనుషులు జంతువులను తినే అవసరం లేదు.అయితే రుచి కొరకు తింటారు. మనుషులు పశుపక్ష్యాదులను పెంచి,  మరీ తింటున్నారు.

ఈ రోజుల్లో చాలామంది పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. ఇందువల్ల, కొన్ని జీవజాతులు అంతరించే పరిస్థితి వచ్చిందంటున్నారు. పర్యావరణంలో సమతౌల్యత ఉండాలంటే మానవుల జనాభా తగ్గాలి...


 హింస చేయకూడదనుకుని కొందరు.. క్రిందరాలిపడిన ఆకులను, పండ్లను తిని జీవిస్తారట. వారు 
 మాత్రమే గొప్పవారని, మామూలుగా జీవించేవారు తక్కువవారని చెప్పలేం. ఎన్నో నియమాలతతో ఎంతో తపస్సు చేసినా కూడా, కొందరు కొన్నిసార్లు కామక్రోధాలకు లొంగి పొరపాట్లు చేయటం జరుగుతుంది. మనస్సును నిగ్రహించుకోవటం అత్యంత కష్టం. దైవసహాయం తప్పనిసరి.

 ***********************

హింస అంటే చంపటం, తినటం ఒక్కటే కాదు. మనుషులను, పశుపక్ష్యాదులను.. మాటలతో, చేతలతో బాధించటం కూడా హింసే.

  జంతువులను ఒకదగ్గరనుంచి ఇంకొకదగ్గరికి పంపేటప్పుడు సరిగ్గా నీరు, మేత ఇవ్వకుండా చిన్న వాన్ లో కుక్కి పంపటం, జంతువులపైన విపరీతంగా బరువులను వేసి మోయించటం.. ఇవన్నీ హింసే.

 మొక్కలకు, 
మనుషులకు..  నెప్పి విషయంలో బాధపడే స్థాయిలో తేడాలుంటాయని అంటారు...ఈ విషయాలు సరిగ్గా అర్ధం కావట్లేదు.

 పశువులకు  ఎప్పుడైనా దెబ్బలు తగిలితే,  మనుషులలానే బాధపడటం, పెద్దగా గాయాలు తగిలితే గిలగిలా కొట్టుకోవటం మనకు కనిపిస్తుంది.మొక్కలలో అలా కనిపించదు.

 అయితే.. జుత్తు, గోర్లను కత్తిరిస్తే బాధ  ఉండదు. మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసినా ఎక్కువ బాధ ఉండదు. అలా మొక్కలకు ఎక్కువ బాధ ఉండదేమో? అని కొందరి అభిప్రాయం. 

ఇవన్నీ సరిగ్గా అర్ధంకాని విషయాలు.... ఆధునిక వైజ్ఞానిక పరికరాలకు కూడా  సరిగ్గా అంతుబట్టని  విషయాలు ఎన్నో ఉన్నాయి. 

 నడిచేటప్పుడు కాళ్ళక్రింద ఎన్ని చీమలు చనిపోతాయో? అతి ఆలోచనలకు పోకుండా కొంతవరకే పాటించటం మంచిది.

మొక్కలు, పశుపక్ష్యాదులు మూగజీవులు. వాటి భావాలు మనకు సరిగ్గా అర్ధం తెలియవు,
 సృష్టిలో..ఎన్నో విషయములు..రహస్యములు..

***********

భూమి ఒక పరీక్షా లోకం.ఇక్కడ కష్టాలు, సుఖాలు రెండూ ఉండే విధంగా సృష్టి ఉంది. ఇది ఒక ఆటస్థలం, నాటకరంగం వంటిది కూడా కావచ్చు.  లౌకిక జీవితంలో ఒక గొప్ప స్థాయికి రావాలంటే ఎంతో కష్టపడాలి. మరి ఏ కష్టాలు లేని అత్యంత ప్రశాంతమైన, అత్యంత గొప్పదైన పరమపదాన్ని పొందాలంటే కొంతైనా కష్టాలు ఉంటాయి కదా. ఇక్కడ మంచిగా జీవించి దైవకృపకుపాత్రులైనవారు పైలోకాలకు చేరుకుంటారు.. పరమపదాన్ని పొందుతారు.

మనకు అర్ధం కాని విషయాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ దైవానికే తెలుస్తాయి.

*****************

 ఇక్కడ బోలెడు విషయాలు వ్రాయటం వల్ల గజిబిజిగా ఉండవచ్చు. మరికొన్ని కొన్ని విషయాలను ఈ లింక్ వద్ద చూడగలరు.

links...*  .అందరికి.. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి...mari...

 *  జంతువులను చంపటం...

 *  ఈమధ్య కాలంలో వెగన్ గా

 * ఓం , కొన్ని విషయాలు ..ఇతరజీవులను చంపిన పాపానికి మర...