koodali

Monday, March 5, 2012

మనం ఆ భగవంతుని తగినంత ప్రేమగా ఆరాధిస్తున్నామా ?



వైదిక ప్రణాళికలో మానవజీవితానికి నిర్ణయించిన నాలుగు దశలు. 1. బ్రహ్మచారి దశ. 2. గృహస్థ దశ. 3. వానప్రస్థ దశ. 4. సన్యాస దశ. హిందూ ధర్మంలో ఇలా ఒక పద్ధతిగా ఒకదాని తరువాత ఒక దశ చెప్పబడింది.

ఇప్పటికీ కొందరు ఈ నాలుగు దశల్నీ నిష్ఠగా, ఒక గురువు యావజ్జీవిత మార్గదర్శకత్వం కింద గడుపుతూ ఉంటారట.

అయితే ఈ రోజుల్లో మారిన సమాజంలో చాలామంది వ్యక్తులకు పూర్వీకుల అంతటి మానసిక దృఢత్వం లేకపోవటం వల్ల ...... దయామయులైన దైవమూర్తులు దయతలచి కొన్ని విషయాలను తెలియజేసారు.


"ఒక యోగి ఆత్మ కధ " గ్రంధంలో శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గురించిన వివరములు ఉన్నాయి. ఈ సాటిలేని పరమ గురువు యొక్క శిష్యులే శ్రీ శ్రీ లాహిరీ మహాశయ.


గృహస్థ యోగిగా లాహిరీ మహాశయులు , ఈ నాటి ప్రపంచం అవసరాలకు అనువయిన, ఆచరణానుకూల సందేశం ఒకటి అందించారు. ప్రాచీన భారత దేశంలో ఉన్న అద్భుతమైన ఆర్ధిక , మత ధార్మిక స్థితులు ఈనాడు లేవు. అందువల్ల యోగి భిక్షాపాత్ర చేత బుచ్చుకొని సంచారం చేసే తపస్విగా జీవించాలన్న పాతకాలపు ఆదర్శాన్ని ఆ మహాయోగి ప్రోత్సహించలేదు. దాని బదులు, ఇప్పటికే ఎంతో ఒత్తిడికి గురి అయి ఉన్న సమాజం మీద ఆధారపడి ఉండకుండా యోగి, తన బతుకు తాను బతకడానికి కావలసినది సంపాదించుకోవడంలోనూ, తన ఇంట్లోనే ఏకాంతంగా ఒకచోట యోగసాధన చెయ్యడంలోనూ గల లాభాలు నొక్కిచెప్పారు. ఈ సలహాకు తోడుగా , హర్షదాయకమైన తమ ఆదర్శ బలాన్ని ఆయన జోడించారు. ఆయన ఆధునికులైన, సర్వశ్రేష్ట ఆదర్శరూపులైన యోగి. ఆయన జీవన మార్గం , ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉండే యోగసాధకులకు మార్గదర్శకంగా ఉండాలని బాబాజీ ప్రణాళికలో నిర్ణయమయింది.




జీవులకు ఎన్నో జన్మలు ఉంటాయని ఆ జన్మలలో ఎందరో బంధువులు ఉంటారని మనం నమ్ముతాము. క్రితం జన్మలో మనం ఏ కులంలో, ఏ మతంలో జన్మించామో ? మనిషిగా జన్మించామో లేక జంతువుగా జన్మించామో కూడా తెలియదు.అయినా, కులం పేరుతో, మతం పేరుతో, మనుషులు అతిగా తాపత్రయపడుతుంటారు. 

ఈ క్రింది వాక్యాలను చదవండి.

మానవుడు అందరినీ సమానంగా ఎందుకు ప్రేమించాలని ఒకసారి బుద్ధుణ్ణి ఒకరు అడిగారు. " ఎందుకంటే, ప్రతి మనిషికి ,అసంఖ్యాకమైన వివిధ జన్మల్లో ఇతరుడు ప్రతి ఒక్కడూ ( ఎప్పుడో ఒకప్పుడు , ఏదో ఒక రూపంలో - జంతు రూపంలో కాని, మానవరూపంలో కాని ) ప్రియమైన వాడు అయి ఉంటాడు కనక. " అని దేశికోత్తముడు జవాబిచ్చాడు.

........................


ఆశ్రమ ధర్మాల విషయానికి వస్తే.....


ఒకప్పుడు వ్యాసుని కుమారుడైన శుకుడు తాను గృహస్థాశ్రమం స్వీకరించకుండానే సన్యాసాశ్రమం స్వీకరిస్తానని చెప్పగా ....... వ్యాసుల వారు ఆశ్రమధర్మాలను వివరించి చెబుతారు. తరువాత శుకుల వారిని జనక మహారాజు వద్దకు పంపిస్తారు. ( జనకుల వారు రాజ్యాన్ని పాలిస్తూ కూడా నిష్కామంగా జీవించిన గొప్పవారు. ) జనక మహారాజు వద్ద నుండి వచ్చిన తరువాత శుకుడు వివాహం చేసుకోవటం , వారికి సంతానం కలగటం .... తరువాత కొంతకాలానికి పరమపదాన్ని పొందటం జరిగింది.

అయితే, రామకృష్ణపరమహంస , వివేకానందులు, షిరిడీ సాయి, ఇలా ఎందరో మహానుభావులు వారివారి పధ్ధతిలో దైవాన్ని ఆరాధించారు.

మానవుని అంతిమలక్ష్యం దుఃఖమూ లేని అత్యంత ఆనందమయ పరమపదాన్ని ( మోక్షాన్ని ) పొందటమే ...... ఇది మరిచి చాలా మంది మోహంలో పడిపోతున్నారు.

లౌకిక జీవితంలో ఏదైనా పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాలంటేనే కొంత శ్రమ పడవలసి ఉంటుంది. ఉదా..ఒక వ్యక్తి కలెక్టర్ కావాలంటే, ఆఖరి పరీక్షలను వ్రాయటానికి కొంత ముందు నుంచే శ్రమపడి చదవవలసి ఉంటుంది.


మరి అత్యుత్తమైన పరమపదాన్ని పొందాలంటే ఎంతో కొంత ముందు నుంచే శ్రమ తప్పదు కదా!

పరమపదాన్ని పొందాలన్నా కొంత ముందు నుంచే సిద్ధపడి ఆ అర్హతను సంపాదించుకోవలసి ఉంటుంది.

అందుకే మానవులు కనీసం 75 ఏళ్ళు వచ్చాకయినా కుటుంబం గురించి అతి తాపత్రయాలు కొంత తగ్గించుకుని దైవాన్ని ఆరాధించటం వల్ల వారికే మంచిది.


అయితే ఈ రోజుల్లో కొందరు తాము పిల్లల్ని చిన్నప్పుడు ఎంతో ప్రేమగా పెంచామనీ, అయినా తమ పిల్లలు తమను ఆప్యాయంగా చూడటం లేదని వాపోతూ ఉంటారు.

కొందరు పిల్లలు తల్లిదండ్రులను ఆదరించని మాట నిజమే,అది బాధాకరమే.


మన పిల్లలు మనల్ని తగినంత ఆప్యాయంగా చూడకపోతేనే మనకు బాధ కలుగుతున్నప్పుడు..మరి మనల్ని ఎన్నో జన్మల నుంచీ గాలి, నీరు, ఆహారం వంటివి అందించి పోషిస్తున్న( జగజ్జననీజనకులైన) దైవం సంగతి ఏమిటి?


జీవిత చరమాంకములోనైనా మనం ఆ భగవంతుని తగినంత ప్రేమగా ఆరాధిస్తున్నామా ? ఎక్కువగా కోరికల కోసమే వారిని ఆరాధిస్తాము కదా !
వారికి మనం కృతజ్ఞతలు తెలపటం అవసరం లేదా?

సన్యాసం అంటూ అరణ్యాలకు వెళ్ళకపోయినా ఇంట్లోనే ఉంటూ తాపత్రయాలను, విషయాసక్తిని కొద్దిగా అయినా తగ్గించుకోవటం వల్ల( అంతస్సన్యాసము అన్నమాట.).... దైవానుగ్రహం కలిగి మోక్షమును పొందవచ్చు.... లేక మరుజన్మలో ఉత్తమజన్మను పొందవచ్చు.


అంతేకానీ, వృద్ధులైన తల్లిదండ్రులు.. తమను సరిగ్గా ఆదరించని సంతానం గురించి అదేపనిగా ఆలోచించటం వల్ల లాభం లేకపోగా .. దైవానుగ్రహానికి కూడా దూరమవుతారు.


పిల్లలు కూడా తెలుసుకోవలసింది ఏమంటే,......తాము తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆదరించకపోవటం వల్ల భవిష్యత్తులో వారి పిల్లలు .... వారిని కూడా అదేవిధంగా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది..అని తెలుసుకోవాలి.


ధర్మవ్యాధుని కధ వంటి కధల ద్వారా వృద్ధులైన తల్లితండ్రులను వారి సంతానం చక్కగా ఆదరించటం..... గొప్ప ధర్మమని మనం తెలుసుకోవచ్చు.
జీవికి తన అంత్య దశలో కలిగే ఆలోచనలను అనుసరించి .... వారి భవిష్యత్తు ఉంటుందని పెద్దలు తెలియజేసారు.
జడభరతుని వంటి గొప్ప వ్యక్తి ..... ఒక లేడిని గురించిన మితిమీరిన ఆపేక్ష వల్ల వారు మరుజన్మను పొందవలసి వచ్చింది. అలా కాకుండా ఆ లేడిని కాపాడుతూ .... తాపత్రయం లేకుండా ఉంటే కర్మ చక్రం పూర్తయి మరు జన్మ లేకపోయేది అనిపిస్తుంది.



ఎందరో వృద్ధులు జీవితచరమాంకములో తమను పిల్లలు సరిగ్గా ఆదరించటం లేదంటూ అదే ఆలోచిస్తూ దిగులుతో కన్ను మూస్తారు.


కొందరు పిల్లలు వృద్ధులైన తమ తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటారు. కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులను చూస్తేనే చిరాకు పడతారు. ఇలాంటి దురదృష్టవంతులైన తల్లితండ్రులు

.....తమను ఆదరించని పిల్లలను గురించి అదే పనిగా ఆలోచించి విలువైన సమయాన్ని వృధా చేసేకంటే .....


.....తమ జీవితంలో తెలుసుకున్న విలువైన విషయాలను ఇతరులకు సలహాల రూపంలో అందించటం, జీవుల అందరి జన్మజన్మల ఆత్మబంధువు అయిన దైవాన్ని ప్రేమించటం వంటి విషయాలతో కాలం గడపటం వల్ల దైవానుగ్రహాన్ని పొందవచ్చు కదా !


మనలను ఎవరూ ఇష్టపడకపోయినా మనగురించి ఎప్పుడూ ఆలోచించి ఇష్టపడే దైవం గురించి మనం ఇష్టంగా ఆలోచించకపోవటాన్ని ఏమనాలి?


వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


5 comments:

  1. బాగుంది.

    ReplyDelete
    Replies
    1. సర్ ! మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. ఆలస్యంగా జవాబిస్తున్నందుకు దయచేసి క్షమించండి.


      ఇక్కడ నా అభిప్రాయాలు మరికొన్నింటిని వ్రాస్తాను. ఏమీ అనుకోవద్దండి.

      .......................................

      పెద్దవాళ్ళలో రకరకాల మనస్తత్వాల వాళ్ళు ఉంటారండి.

      కొందరు పెద్దవాళ్ళు తమ పిల్లలతో కలిసిమెలిసి ఉంటూనే తామరాకుమీద నీటిబొట్టులా చక్కగా జీవిస్తారు. వారి జీవితంలో అనుభవంతో వచ్చిన పెద్దరికంతో ఇతరులకు సలహాలనూ, సూచనలనూ , ఇస్తూ ...దైవం మీద భారం వేసి చక్కగా జీవిస్తుంటారు.



      కొందరు పిల్లలు తమ వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారు. అయినా ఈ పెద్దవాళ్ళు ఆ పిల్లలనే తలుచుకుంటూ దుఃఖిస్తుంటారు. ఎంత అనునయించినా ఇతర వ్యాపకాల వైపు మనసును పోనివ్వరు. పిల్లల తమను నిర్లక్షం చేయటం గురించే పదేపదే బాధపడుతారు.



      మరి కొందరు పెద్దవాళ్ళు ........ పిల్లలకు వివాహాలు చేస్తారు. వారి జీవితాలు సుఖంగా ఉండాలని తమ కోరిక అని కూడా అంటుంటారు. . కానీ వారికి కొన్ని భయాలుంటాయి. వివాహం తరువాత పిల్లలు తమను సరిగ్గా ఆదరించరేమో ? ఇత్యాది భయాలతో జీవితాన్ని భారంగా గడుపుతుంటారు.

      మరి కొందరు పెద్దవాళ్ళకు ఈ భయాలు, బాధలకు తోడు అసూయ, నాదే పై చేయి అవ్వాలనే పట్టింపులు కూడా ఉంటాయి ..


      ఈ రోజుల్లో ఇలాంటి కొన్ని కుటుంబాలలో పెళ్ళి అయిన మరుక్షణం నుంచే పెట్టుపోతలు, మర్యాదలు వంటి విషయాలలో అమ్మాయి తరపు పెద్దలు ...... అబ్బాయి తరపు పెద్దలు కూడా తిట్టుకోవటం వింటున్నాము. పెద్దల పంతాలకు కొందరు భార్యాభర్తలు విడిపోతున్నారు కూడా .


      ..వివాహానంతరం పిల్లలు గొడవపడి తల్లిదండ్రుల వద్దకు వస్తే వారికి నచ్చచెప్పటం మాని ఈ పెద్దవాళ్ళు పంతాలకు పోయి ఆ గొడవను మరింత పెద్దది చేస్తారు. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు తరచు చూస్తున్నాము.

      ఇంకా, రకరకాల మనస్తత్వాలు కలిగిన పెద్దవాళ్ళున్నారండి.

      ....................

      ఇక పిల్లల విషయానికి వస్తే,

      తమ సుఖసంతోషాలను త్యాగంచేసి పిల్లలను పెంచి పెద్ద చేస్తే ......వృద్ధులైన ఆ తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టక, అనారోగ్యం వస్తే పట్టించుకోని పిల్లలు ఎందరో ఉన్నారు.

      అయితే,తల్లిదండ్రులను చక్కగా చూసుకునే పిల్లలు కూడా ఎందరో ఉన్నారు.


      ..వివాహానంతరం కొందరు పిల్లలు గొడవపడి తల్లిదండ్రుల వద్దకు వస్తే.........సంసారంలో సర్దుకుపోవాలని పిల్లలకు నచ్చచెబుతారు ...... చాలామంది తల్లిదండ్రులు.


      వారు అలా చెప్పినప్పుడు ..... మా బాధను అర్ధం చేసుకోకుండా సర్దుకుపొమ్మంటున్నారా ? అని తల్లిదండ్రులనే ..... తిట్టిపోసే పిల్లలు కూడా ఉన్నారు.


      మరి కొన్ని చోట్ల పిల్లలే ( కొందరు యువత ) అంతా మా ఇష్టం మా పెళ్ళి విషయంలో పెద్దవాళ్ళకు సంబంధం లేదు.... అంటూ పెద్దలకు సమస్యలు తెచ్చిపెడుతున్నారు...


      వివాహం అంటే రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. వివాహవ్యవస్థ చక్కగా ఉంటే సమాజం కూడా బాగుంటుంది.


      అయితే , కొందరు యువతీయువకులు వివాహం అంటే అదేదో తమ సొంత వ్యవహారం అన్నట్లు మాట్లాడుతుంటారు. వారి సొంత విషయం అనేది కొంతవరకూ నిజమే.

      కానీ, వారి పెద్దవాళ్ళకు కూడా ....... తమ కోడలో. అల్లుడో తమ పద్ధతులకు తగ్గట్లుగా ఫలానా విధంగా పద్ధతిగా ఉండాలని పెద్దవాళ్ళకూ కొన్ని ఆశలుంటాయి కదా ! మనుమలు, మనుమరాండ్రతో ఆడుకోవాలన్న ఆశలూ ఉంటాయి కదా !


      ఇవన్నీ ఆలోచించకుండా కొందరు యువత అంతా మా ఇష్టం.... మా పెళ్ళి విషయంలో పెద్దవాళ్ళకు సంబంధం లేదు.... అంటూ వివాహాలు చేసుకుంటున్నారు.

      అయితే, పెద్దల ఆశలను గౌరవిస్తూ వారి ఇష్టప్రకారం వివాహం చేసుకునే పిల్లలూ చాలామందే ఉన్నారు.

      టపా లా వ్రాసేసానండి.......ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే ...... ...ఇలా వ్రాసానని ఏమీ అనుకోవద్దండి.


      మీ వ్యాఖ్య ద్వారా నా అభిప్రాయాలను అందరికీ చెప్పాలనిపించి ఇలా వ్రాసాను అంతేనండి......

      Delete
  2. మీలో ఆవేశం, ఆలోచన, ఆవేదన, అన్నీ ఉన్నాయి

    ReplyDelete
    Replies
    1. సర్ ! మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  3. డబ్బు పిచ్చిలో పడిపోయి పెద్ద చిన్న అంతా ఒకలాగే ప్రవర్తిస్తున్నారు. సద్దుబాటు ధోరణి ఏకోశానా కనపడటంలేదు.

    ReplyDelete