koodali

Monday, October 31, 2016

కార్తిక సోమవారం సందర్భంగా...

కార్తిక మాసం శివకేశవులకు ప్రీతికరమైనది. 

శివపంచాక్షరీ స్తోత్రం....
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ

భస్మాంగ రాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్యై  నకారాయ నమశ్శివాయ.


మందాకినీసలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

స్యై మకారాయ నమశ్శివాయ.


శివాయ గౌరీవదనారవింద

సూర్యాయ దక్షాధ్వరనాశకాయ

శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ

స్యై శికారాయ నమశ్శివాయ.


వశిష్ట కుంభోద్భవ గౌతమాది

మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానర లోచనాయ

స్యై వకారాయ నమశ్శివాయ.


యక్షస్వరూపాయ జటాధరాయ

పినాక హస్తాయ సనాతనాయ

సుదివ్య దేహాయ దిగంబరాయ

స్యై యకారాయ నమశ్శివాయ.


పంచాక్షర మిదం పుణ్యం యః పఠేఛ్చివస్సన్నిధౌ

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


Friday, October 28, 2016

లక్ష్మీకటాక్షం....

దీపావళి రోజులలో లక్ష్మీ పూజ చేస్తారు.

 విదేశీ వస్తువులను కొనటం ద్వారా లక్ష్మీకటాక్షం ఇతరదేశాలకు పోవటం కాకుండా ....

లక్ష్మీదేవి కటాక్షం మనపై చక్కగా ఉండటానికి ఎక్కువగా స్వదేశీ వస్తువులను వాడాలి.

రాజధాని  అమరావతిలో మరికొన్ని కట్టడాలకు శంకు స్థాపన జరిగింది.

 అంతా శుభం జరుగుతుందని కోరుకుందాము.



Wednesday, October 26, 2016

భారతదేశంపై విదేశీదండయాత్రలు ఎందుకు జరిగాయో...


శిరిడిసాయిని పూజించినందువల్ల మహారాష్ట్రలో కరువు వచ్చిందని కొందరు అంటున్నారు.

కరువు, అతివరదలు మాహారాష్ట్రలోనే కాదు, దేశంలో ఎన్నో చోట్ల రావటం జరిగింది.

కరువు, అతి వరదలు.. ప్రజలు పర్యావరణాన్ని పాడుచేయటం వల్ల.. గ్లోబల్ వార్మింగ్ వల్ల వస్తున్నాయి. అంతేకానీ, సాయిని పూజించటం వల్ల కాదు.

 ఇక్కడ శిరిడిసాయి పూజలు ప్రారంభించకముందే భారతదేశంపై  విదేశీయుల దండయాత్రలు జరిగాయి.

 ఎందరో ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు .ఆ రోజుల్లో ఎన్నో దారుణాలు జరిగాయి. ఎందరో చంపబడ్దారు. చంపబడిన వారిలో బ్రాహ్మణులు కూడా ఉన్నారు.

 మరి భారతదేశంపై విదేశీదండయాత్రలు ఎందుకు జరిగాయో? చెప్పండి. అప్పటికి శిరిడిసాయి పూజలు లేవు కదా!

 ప్రజలకు కష్టాలు వస్తే ఫలానా దేవుడిని పూజించటం వల్లే అనటం తప్పు.

 ప్రజలు తాము చేసిన పాపపుణ్యాలకు తగ్గట్లు ఫలితాన్ని అనుభవిస్తారు. ఆ కష్టాలు పోవటానికి దైవాన్ని గానీ గురువును గానీ ఆశ్రయిస్తారు.

ఇంద్రుడంతటి వారే .. వృత్రాసుర వధ తరువాత కొంత కష్టాన్ని అనుభవించవలసి వచ్చింది.

ప్రజలైనా అంతే . తాము చేస్తున్న కర్మలకు తగిన ఫలాలను అనుభవిస్తారు.

హిందువులు కొందరు పాటించిన అంటరానితనం, కొన్ని మూఢాచారాలు .. వల్ల భారతదేశంపై విదేశీ దాడులు జరిగి  ప్రజలు కష్టాలు అనుభవించి ఉంటారనుకోవచ్చు కదా!

  ముస్లింలు విగ్రహారాధనను చేయరు.  శిరిడిసాయి శిరిడిలో ఎన్నో హిందూదేవాలయాలను బాగుచేయటానికి ప్రోత్సహించారు.

ఆ  రోజులలో శిరిడిలో సాయి సమక్షంలో శంఖము ఊదటం, గంట వాయించటం, హారతి ఇవ్వటం వంటివి జరిగేవంటారు.

సాయి చెవులకు హిందువుల వలె కుట్లు( రంధ్రము) ఉండెడివంటున్నారు.

 ఇప్పుడు శిరిడిసాయి విగ్రహాన్ని నెలకొల్పి ప్రజలు పూజలు
చేస్తున్నారు.విగ్రహాన్ని నెలకొల్పి పూజలు చేయటం హిందూ పద్ధతే.


Tuesday, October 25, 2016

కొన్ని విషయములు...


   
సాయి బాబా వారి కధలోని కొంతమంది హిందువుల పేర్లు నానా సాహెబ్ డేంగలే, బాపూ సాహెబ్ బుట్టీ, కాకా సాహెబ్ దీక్షిత్. కాకాసాహెబ్ దీక్షిత్ బ్రాహ్మణులు. 
 
ఈ పేర్లలో సాహెబ్ అనే పదం హిందువులలోనూ, ముస్లింలలోనూ కూడా ఉంటుంది.

కొందరు ఏమంటున్నారంటే, షిరిడిసాయి మహమ్మదీయుడు కాబట్టి పూజించకూడదని చెబుతున్నారు.

 షిరిడి సాయి ఎప్పుడూ తాను మహమ్మదీయుడా, హిందువా, లేక మరెవరు ? అనే విషయాల గురించి చెప్పలేదంటారు.

వారి ఆచరణ గురించి పుస్తకాలలో చదివితే,  చాలా మతాల ఆచారాలను కలగలిపి వారు ఆచరించినట్లు తెలుస్తుంది. 

ఉదా..హిందువుల వలె తులసీ పూజ, ధుని వెలిగించటం, శిరిడిలోని హిందూదేవాలయాలను మరమ్మతు చేయించటం..వంటివెన్నో  చేసారు. 

ఇక మహమ్మదీయుల వలె అల్లాహ్ నామమును స్మరించటం వంటివి చేసేవారు.

 సబ్ కా మాలిక్ ఏక్ హై.. అనేవారంటారు.
 
********************
 కొందరు ఏమంటున్నారంటే, సాయి మాంసాహారం తినేవారు కాబట్టి.. అలాంటి వ్యక్తిని ఎలా పూజిస్తారని ప్రశ్నిస్తున్నారు.

పూర్వకాలంలో కొందరు బ్రాహ్మణులు కూడా కొన్ని సందర్భాలలో మాంసాహారం తినేవారంటారు.
 
 ఉదా.. వాతాపి, ఇల్వలుల గురించిన కధలో అనేక విధములుగా ఉన్నది. ఒక చోట చదివిన ప్రకారం, ఇల్వలుడు బ్రాహ్మణ వేషము ధరించి తమ ఇంట  భోజనానికి రమ్మని బ్రాహ్మణుణి పిలిచెడివాడు.

వాతాపిని మేకగా చేసి వండి బ్రాహ్మణులకు భోజనం పెట్టి .. బ్రాహ్మణులు భుజించిన తరువాత వాతాపిని బయటకు పిలవగా బ్రాహ్మణుల పొట్ట చీల్చుకుని వాతాపి బయటకు రావటం..ఈ విధంగా ఆ రాక్షసులు బ్రాహ్మణులను చంపటం జరిగేది...

 ఈ కధ ద్వారా ఆ కాలంలో కొందరు బ్రాహ్మణులు కొన్ని సందర్భాలలో మాంసాహారం భుజించేవారని తెలుస్తుంది.

ఈ కాలంలో కూడా  బెంగాల్ ప్రాంతపు బ్రాహ్మణులు చాలామంది చేపలు తింటారట.

 అయినా సాయి మాంసాహారాన్ని అందరికీ పెట్టేవారు కాదు. మాంసాహారాన్ని తినేవారికే పెట్టేవారంటారు.
 
************
 ఈ క్రింది విషయాలను ఈ పోస్ట్ వేసిన కొంతకాలం తరువాత వ్రాసి ప్రచురించటం జరిగింది..2024 లో..

హిందువులకు చాలామందిదేవతలు ఉన్నా కూడా, కొత్తవాళ్ళను ఎందుకు పూజిస్తున్నారంటూ కొందరు మాట్లాడుతున్నారు. అయితే, క్రొత్త దేవతలను ఆరాధించటం హిందువులకు క్రొత్తకాదు.

 
హిందువులకు చాలామంది దేవతలు ఉన్నాకూడా, తరతరాలనుంచి ఎందరినో  దేవతలుగా పూజిస్తున్నారు.  ఒక్కో యుగంలో దైవం అవతారాలను ధరించినప్పుడు, ఆ అవతారాలను పూజిస్తారు.  ప్రాచీనగ్రంధాలలో లేని దేవతలు ఎందరినో ఇప్పుడు దేవతా అవతారాలుగా పూజిస్తున్నారు. 
 
ఉదా.. కొందరు గొప్పవారు మానవులుగా జీవించినప్పుడు గొప్పమహిమలు కలిగి ఉంటారు. అలాంటి కొందరి శరీరత్యాగం తరువాత, వారిని కూడా దేవతలుగా గుడికట్టించి పూజిస్తున్నారు. వారి పూజా విధానాలు ఏర్పరుస్తారు.

 
మహిమలు గలవారు గొప్పవారే.. దేవతలవంటివారే. వారిని గౌరవించవలసిందే. అయితే, హిందువులకు మరింత ఎక్కువమంది దేవతలు పెరుగుతారు. భవిష్యత్తులో ఇంకా ఎందరిని దేవతాస్వరూపాలుగా పూజిస్తారో..చెప్పలేము.

 
హిందువులకు అనేకమంది దేవతలు ఉన్నా కూడా, అవధూతలను, ఇంకా చాలామందిని పూజిస్తుంటారు. అవధూతలు వంటివారు గొప్పవారే. అలాగని అవధూతలు ఎవరైనా పరమపదించితే వారి విగ్రహాలను తయారుచేసి, దేవాలయాలను నిర్మించి  దేవతలుగా పూజలు మొదలుపెడితే .. బోలెడు పూజలు, బోలెడు ఆచారవ్యవహారాలు అవుతాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.

 
దైవం సృష్టి అంతటా ఉంటారు. అలాగని ప్రతి జీవినీ దైవంగా భావించి విగ్రహాలు చేసి, గుడులు కట్టి పూజించలేరు కదా.. దైవాన్ని ఒకమహాశక్తిగా భావించి చక్కగా ఆరాధించుకోవచ్చు.

 
హిందువులు ఇంకాఇంకా ..కొత్త  పూజావిధానాలను  పెంచుకుంటూ వెళ్తే, భవిష్యత్తులో భక్తుల మధ్య గొడవలు వచ్చి, వివిధ శాఖలుగా చీలే అవకాశమూ ఉంది. ఇప్పటికే హిందువులు బౌద్ధులు, జైనులు..ఇంకా కొన్ని శాఖలుగా అయ్యారు.
 
 
ఇప్పటికే ఒకే మతంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. పూజా విధానాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆచారవ్యవహారాల విషయంలోను   అభిప్రాయభేదాలుంటున్నాయి. వీటివల్ల సామాన్య భక్తులలో అయోమయం నెలకొంటుంది. వ్యవస్థ క్లిష్టంగా కాకుండా, సరళంగా ఉంటే బాగుంటుంది.

 
దైవశక్తిని చక్కగా పూజించవచ్చు. భవిష్యత్తులో అయినా మరింతగా  పూజావిధానాలను  పెంచుకోకుండా పూజించుకుంటే  సరిపోతుంది.  వేదములలో, పురాణేతిహాసాలలో, ఇంకా కొన్ని ప్రముఖ గ్రంధాలలో.. చెప్పబడిన దేవతలను చక్కగా పూజించుకుంటే చాలా గొప్ప.

 
 ఇంకా కూడా కొత్తగా పూజించాలంటే, వారిని  వేదములలో.. పురాణేతిహాసాలలో.. ఇంకా కొన్ని ప్రముఖ గ్రంధాలలో..చెప్పబడిన దేవతాస్వరూపాలుగా భావించి, ఒకరితోఒకరు గొడవలు లేకుండా, హిందుమతంలో మరిన్ని విభజనలు జరగకుండా పూజించుకోవాలి.


 ఎవరిని ఏ విధంగా  పూజించాలి ? అనే విషయాల గురించి  బాగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. హిందుత్వానికి నష్టం జరగకుండా ఉండాలి.
సమాజంలో అనేక అభిప్రాయాలుంటాయి. కొన్ని విషయాలు కొందరికి నచ్చుతాయి. కొన్నిసార్లు ఒకరు చెప్పింది ఇంకొకరికి నచ్చదు. ఇలాంటి పరిస్థితిలో దైవమే దారి చూపాలి.


 
 

Monday, October 24, 2016

ఈ మధ్యకాలంలో కొందరు షిరిడి సాయిని ...


ఈ మధ్యకాలంలో కొందరు షిరిడి  సాయిని విమర్శిస్తు....
 సాయిని పూజించేవారు రాముడిని, శివుణ్ణి పూజించకూడదన్నట్లు మాట్లాడుతున్నారు.

  **************

హిందువులు..ఎందరో దేవతలను, గురువులను, అవతారమూర్తులను.. ఆరాధించుకుంటారు. అలాగే షిర్డిసాయినీ ఆరాధించుకుంటున్నారు.

  *************

హిందువులు రాయిలోను, రప్పలోనూ, చెట్టు లోనూ  కూడా దైవాన్ని భావించి ఆరాధిస్తారు. గురువును దైవంగా పూజిస్తారు చాలామంది.

************

మనిషిగా జీవించిన పైడితల్లిని  దేవతగా పూజిస్తున్నారు. మనుషులుగా జీవించిన సమ్మక్క, సారలమ్మలను దేవతలుగా పూజిస్తున్నారు.

ఇప్పుడు షిర్డిసాయిని పూజించకూడదని అంటున్న వాళ్లు  ముందుముందు...పైడితల్లిని, సమ్మక్క, సారలమ్మలను కూడా పూజించకూడదని  అంటారేమో?

*******************
 కొందరు స్వార్ధపరుల వల్లా, కొందరు తెలిసీతెలియని వారి వల్లా హిందుత్వంలో అంటరానితనం వంటి కొన్ని దోషాలు ప్రవేశించాయి.
ఇలాంటి వాటి వల్ల  హిందూ సమాజం ఇప్పటికే ఎంతో నష్టపోయింది. 
 
  మూఢనమ్మకాలను,  అంటరానితనం ..వంటి  భూతాలను తరిమివేయండి.


 హిందువులు ఎన్నో మూఢనమ్మకాలను, కఠినమైన ఆచారవ్యవహారాలను పెంచుకున్నారు. అవన్నీ పాటించలేని కొందరు సులభంగా ఉండే పద్ధతుల పట్ల ఆకర్షితులవుతున్నారు. 
 
 
అనేకమైన ఆచారవ్యవహారాలను పాటించలేక , ఇన్ని పద్ధతులు ఎందుకు ఆచరించాలంటూ నాకు కూడా చాలాసార్లు విసుగు అనిపించేది. ఆచరించకపోతే ఏమవుతుందో అని భయంతో ఆచరించాను. ఇప్పుడు చాలావరకూ తగ్గించుకుని నాకు వీలైనంతలో ఆచరిస్తున్నాను. ఇప్పుడు భయం తగ్గింది. 
 

కొందరు తమకు గల అతిభయం వల్లనో, తమ పేరుకోసమో, డబ్బుకోసమో,  తమ స్వార్ధప్రయోజనాల కోసమో..తమకు తోచినట్లు చెబుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. 


హిందువులు ఇతర పద్ధతులలోకి వెళ్ళకుండా ఉండాలంటే,  తమ మూఢాచారాలను వదిలేయాలి. ఆచారవ్యవహారాల విషయంలో కూడా కాలానుగుణంగా  కొంత సులభంగా ఉండాలి. 
 
 
అంతేకాని, ప్రతిది ఇలా చెయ్యకూడదు, ఇలానే చెయ్యాలి అంటూ..అదేపనిగా చెప్పుకుంటూ పోతూ ప్రజలను నిందించటం సరైనది కాదు.


Friday, October 21, 2016

పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా....



సైనికులలానే  పోలీసులు కూడా ప్రజల రక్షణ కొరకు ఎంతో శ్రమపడుతున్నారు.


  ప్రజల రక్షణ కొరకు త్యాగాలు చేసిన.. అమరులైన పోలీసులకు వందనములు.


 దేశప్రజల రక్షణ కొరకు ఎందరో ఎన్నో త్యాగాలు చేస్తున్నారు.


 ఇవన్నీ గమనించి ప్రజలు కూడా తమ జీవితంలో బాధ్యతగా.. ఆదర్శపౌరులుగా జీవించటానికి ప్రయత్నించాలి.
 
*****************
 
మరి కొన్ని విషయములు..

ఈ రోజుల్లో చాలా మంది ఎలాగోలా డబ్బు  సంపాదించి, వస్తువులను కొనటం కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు.

దుస్తుల కోసం, ఫర్నిచర్ మరియు  కార్లు..వంటి వాటి విషయంలో అవసరానికి మించి ఖర్చుపెడుతున్నారు.

ఈ రోజుల్లో చాలామందికి నెలకే వేలు లేక కొన్ని లక్షల వరకు  ఆదాయం వస్తోంది. ఈ డబ్బుతో విపరీతంగా వస్తువులను కొనిపడేస్తున్నారు.

మనిషి  సౌకర్యంగా జీవించాలంటే కొన్ని వస్తువులు చాలు.
 ఉదాహరణకు దుస్తుల విషయంలో చూస్తే..

 ఒక మనిషి ఒక సంవత్సరానికి.. రోజువారీ ధరించే దుస్తులు అరడజను( సుమారు 1000  రూపాయల లోపు ), వారాంతాల్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ధరించటానికి  నాలుగు దుస్తులు ( సుమారు 1000 నుంచి 2000 ధరలో ) ఫంక్షన్స్లో  ధరించటానికి (2000 నుంచి 5000 ధరలో)  రెండు ఖరీదైన డ్రస్సులు కొనుక్కోవచ్చు.

ఈ విధంగా ఒక  మహిళకు  సంవత్సరానికి సుమారు  సుమారు  10,000 లేక  25,000 ఖర్చు చేస్తే 12 చీరలు లేక డ్రస్సులు వస్తాయి.. వచ్చే సంవత్సరం మళ్లీ కొత్తవి కొనుక్కోవచ్చు.

  అయితే, ఈ రోజుల్లో చాలామంది ఒక్కో డ్రస్సుకే 20 వేలు, 50 వేలు, ఒక లక్ష..ఆపైన కూడా ఖర్చు చేసి కొంటున్నారు.

 ( సొంత ఫంక్షన్స్ కొరకు అయితే కొంచెం ఎక్కువ ఖరీదు పెట్టి  దుస్తులు కొనుక్కోవచ్చు. )

డబ్బు ఎక్కువఉన్న వారు కూడా  పరిమితమైన ధరలో వస్తువులు కొనుక్కోవచ్చు.

కోటి రూపాయల కారు కన్నా 10 లక్షల లేక 20 లక్షల  కారును కొనుక్కోవచ్చు.

 (పైన వ్రాసిన ధరలను కొంచెం ఎక్కువ తక్కువగా మార్చుకోవచ్చు.)

మార్కెట్లో కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నవన్నీ కొనాలని ఆశపడకుండా ఏది అవసరమో అవే కొనుక్కుంటే బాగుంటుంది.

 బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కువ ధరలు పెట్టి బోలెడు వస్తువులను కొనటం కన్నా, తగుమాత్రం వస్తువులను కొనుక్కుని,  తమ ఉద్ద ఉన్న డబ్బుతో.. డబ్బు బాగా అవసరం ఉన్నవారికి సహాయం చేస్తే ఎంతో మనశ్శాంతి లభిస్తుంది.

 ఉదా.. డబ్బు లేక  వైద్యాన్ని చేయించుకోలేకపోతున్నవారికి, డబ్బు లేక చదువుకు దూరమవుతున్నవారికి..ఇలా సహాయం చేయవచ్చు.

ఊళ్ళలో నీటిశుద్ధి కేంద్రాలను  ఏర్పాటుచేయవచ్చు. ఉచిత అన్నదానం, వైద్యకేంద్రాలను ఏర్పాటుచేయవచ్చు. ఇలా ఎన్నో చేయవచ్చు. 
 
పర్యావరణాన్ని రక్షించే సంస్థలకు ధనసహాయం చేయవచ్చు. 
 
పశుపక్ష్యాదులను కాపాడే వారికి సాయం చేయవచ్చు.

ఐశ్వర్యాన్ని అతి ఆడంబరంగా ప్రదర్శించేవారికి ఇతరుల నుండి దృష్టి ( నెగటివ్ శక్తి..) తగిలి కష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది.

ఒంటినిండా, ఇంటినిండా ఎన్నో వస్తువులు  ప్రోగేసుకోవటం కన్నా, మనతో పాటు ఇతరుల జీవితాలు బాగుపడటంలో  సహాయపడటం ఎంతో మంచిది.
 
************
 మరి కొన్ని విషయములు..
 
 
 

కంప్యూటర్ కీ బొర్డ్ మరి కొన్ని విషయములు...


కంప్యూటర్ వల్ల రేడియేషన్ తో ఎన్నో సమస్యలు వస్తాయంటారు.. ..

కంప్యూటర్ ముందు కూర్చుని కళ్లకు ఎక్కువ శ్రమ కలగటం వల్ల కూడా తలనొప్పి, మెడనొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయట. 

 చాలామంది విషయంలో కళ్ళకు శ్రమ కలగటంతో పాటు  .. గంటల తరబడి వేళ్ళతో  పనిచేస్తే  ఒత్తిడి వల్ల శ్రమ కలుగుతుంది .. అనిపిస్తోంది.


ఇంకో విషయం ఏమిటంటే,  కీ బొర్డ్ నొక్కే శ్రమ లేకుండా మాటతో వ్రాసే టెక్నాలజీ రాబోతుందంటున్నారు.


ఈ విధానంలో కీ బోర్డ్ తో పని లేకుండా వ్యక్తి చెప్పే విషయం మానిటర్ పై వచ్చేస్తుందట.

 అయితే, వ్యక్తి చెప్పే విషయాన్నిఅన్ని భాషలలోనూ, అన్ని యాసలలోనూ  గ్రహించి తప్పులు లేకుండా వచ్చే విషయంలో మరింత మెరుగ్గా రావటం కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారట. ఇది  ఎంతో సంతోషకరమైన విషయం. 
 

ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరిగి ... త్వరలో ఆ సౌకర్యాలు రావాలని ఆశిద్దాము.

 అయితే ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా మనం కంప్యూటర్ వద్ద వ్రాసే విషయం ప్రక్కవారికి తెలియటం అన్నివేళలా ఇష్టపడము.
 
ప్రైవసీ కావాలంటే కీ బోర్డ్ అప్పుడప్పుడు అవసరపడుతుందనిపిస్తుంది.
 
మనం కంప్యుటర్ ముందు మాట్లాడే మాటలు ప్రక్కవారికి వినబడని విధంగా ఏమైనా  టెక్నాలజీ ఏర్పాటు చేస్తారా ? లేక మాటలు ప్రక్క వారికి వినబడతాయో ? ఇవన్నీ తెలియదు.

మాట్లాడలేని మూగవారి విషయంలో కూడా కీ బోర్డ్ అవసరం ఉంటుందనిపిస్తుంది.

అయితే ఈ విషయాలలో కూడా శాస్త్రవేత్తలు ఏమైనా పరిశోధనలు చేస్తున్నారేమో తెలియదు.

మాటతో వ్రాసే విధానం వచ్చినా కూడా.... కీబోర్డ్ సౌకర్యాన్ని  తీసివేయకుండా  ఉంటే సౌలభ్యంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగించుకోవచ్చు.

ప్రస్తుతానికి మాత్రం  పెన్ను,పెన్సిల్ వంటి సాధనంతో కీబోర్డ్ వాడటం నా విషయంలో సులువుగా ఉంది.

సన్నటి బాల్ పెన్ను కాకుండా వెడల్పాటి పెన్నుతో అయితే మరింత సులువు అనిపిస్తుంది.
***************

అయితే, ఒక ప్రక్క టెక్నాలజీ తో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని  అనుకుంటుంటే టెక్నాలజీతో ఎన్నో సమస్యలు కూడా  ఎదురవుతున్నాయి.

 కంప్యూటర్  హ్యాక్ చేయటం  ద్వారా ఎన్నో ఇబ్బందులు కలగటం గురించి వింటున్నాము.

ముందుముందు ఏం జరుగుతుందో ఏమిటో.

Monday, October 17, 2016

పెన్ లేక పెన్సిల్ తో కీ బోర్డ్ వాడటం..


 
కంప్యూటర్ వాడుతూ ఏదైనా రాయవలసి వచ్చినప్పుడు .... కీ బోర్డు  పైన ఎక్కువసేపు వేళ్ళతో టకటక నొక్కవలసివస్తుంది.

ఇలాంటప్పుడు చాలామందికి  వేళ్ళు నొప్పి పుట్టే  అవకాశం ఉంది.

అదేపనిగా వేళ్లు పనిచేయటం వల్ల .... నరాల బలహీనత, వీపు, చేతులు నొప్పి,  భుజాల నొప్పి మరియు మెడ నొప్పి వచ్చే  అవకాశం ఉంది.

వేళ్ళు నుంచి   .... మెడ, వీపు వంటి భాగాలకు  నరాలు ఉంటాయి కాబట్టి ... చేతులు , భుజాలు,  మెడ నొప్పి తద్వారా తలనొప్పి వంటివి వస్తుంటాయి.

ఈ మధ్య నాకు  చేయి నొప్పి వచ్చింది.  అప్పుడు  నాకు ఒక ఐడియా వచ్చింది.

వేళ్ళతో ఏదైనా  పెన్ను  వంటిది పట్టుకుని ఆ పెన్ను  వంటి వస్తువుతో   కీ - బోర్డు  పైన అక్షరాలు నొక్కుతున్నాను. దీనివల్ల చేయి  నొప్పి తగ్గింది.

అయితే కీ - బోర్డు   పైన  మరీ గట్టిగా నొక్కకుండా... కాప్  మూసి ఉన్న బాల్ పెన్ను తో  లేక  బాల్ పెన్ను తిరగేసి .... అక్షరాల పైన సున్నితంగా నొక్కాలి.

బాల్ పెన్ను  చివర దూది వంటిది చుడితే మరీ మంచిది. (నేను దూది చుట్టలేదు.)

ఇలా వాడితే పెన్ను తో పుస్తకం పై   వ్రాసినట్లు చేయి కొద్దిగా కదులుతుంది.......  వేళ్ళు అదేపనిగా కదిలించనవసరం లేదు.

  ప్రస్తుతానికి ఈ పద్ధతి  సులువుగానే ఉంది మరి.....అంతా  దైవం దయ. 


Friday, October 14, 2016

సరస్వతి దేవి ఆలయములు..

 
బాసరలో సరస్వతి దేవి ఆలయం చాలామందికి తెలుసు. 

కర్నూల్ వద్ద ఆత్మకూరుకు కొంత దూరంలో కూడా సరస్వతీ దేవి ఆలయం ఉన్నది. ఈ దేవాలయం కొలనుభారతిదేవి (సరస్వతి దేవి) ఆలయం.

 మేము బాసర మరియు కొలనుభారతి దేవాలయాలను దర్శించుకున్నాము. దైవానికి అనేక వందనములు. అంతా దైవం దయ. 

కొలనుభారతి దేవాలయం గురించి ఇంతకుముందు ఒక టపా వ్రాసాను. ఆసక్తి ఉన్న వారు ఈ లింక్ వద్ద చూడగలరు.

కొలనుభారతి శ్రీ సరస్వతీదేవి ఆలయం .



Tuesday, October 11, 2016

దసరా ...

ఓం ..                                           


సాయి సాయి.

శ్రీ రాజరాజేశ్వర స్వామికి  అనేక  నమస్కారములు,
 శ్రీ రాజరాజేశ్వరీ దేవికి  అనేక  నమస్కారములు.

                       శ్రీ  రాజరాజేశ్వర్యష్టకం.

  1.  అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమాపార్వతీ
      కాళీహైమవతీ  శివా  త్రినయనీ  కాత్యాయనీ  భైరవీ
     సావిత్రీ  నవయౌవనా శుభకరీ  సామ్రాజ్యలక్ష్మీ ప్రదా
     చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ రాజరాజేశ్వరీ 

2.  అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసంధాయినీ
     వాణీ పల్లవపాణి  వేణుమురళీగాన  ప్రియాలోలినీ
    కళ్యాణీ  ఉడురాజబింబవదనా  ధూమ్రాక్ష సంహారిణీ
   చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ 

3. అంబానూపుర  రత్నకంకణధరీ  కేయూరహారావళీ
  జాజీచంపక  వైజయంతలహరీ  గ్రైవేయ వైరాజితాం
  వీణావేణు  వినోదమండితకరా  వీరాసనా  సంస్థితా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ 

4. అంబా రౌద్రిణి భద్రకాళి  బగళా జ్వాలాముఖీ  వైష్ణవీ
  బ్రహ్మాణీ  త్రిపురాంతకీ  సురనుతా  దేదీప్యమానోజ్వలా
  చాముండా  శ్రితరక్ష  పోషజననీ  దాక్షాయణీ  పల్లవీ
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీరాజరాజేశ్వరీ 

5. అంబా  శూలధనుః  కుశాంకుశధరీ  అర్ధేందు  బింబాధరీ
  వారాహీ  మధుకైటభప్రశమనీ  వాణీరమా సేవితా
  మల్లాద్యాసుర  మూకదైత్యదమనీ  మాహేశ్వరీ  అంబికా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ రాజరాజేశ్వరీ 

6. అంబా  సృష్టి వినాశ పాలనకరీ  ఆర్యా  విసంశోభితా
    గాయత్రీ  ప్రణవాక్షరామృతరసః  పూర్ణానుసంధీకృతా
   ఓంకారీ  వినుతా  సురార్చితపదా  ఉద్దండ  దైత్యాపహా
   చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ

7. అంబా శాశ్వత  ఆగమాది  వినుతా ఆర్యామహాదేవతా
  యా  బ్రహ్మాది  పిపీలికాంత జననీ  యావై  జగన్మోహినీ
  యా  పంచప్రణవాది రేఫజననీ  యా  చిత్కళామాలినీ
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీ  రాజరాజేశ్వరీ  

8. అంబాపాలిత  భక్తరాజి రనిశం   అంబాష్టకం  యః పఠేత్
   అంబాలోక  కటాక్షవీక్ష  లలితా  ఐశ్వర్యమవ్యాహతా
   అంబాపావన మంత్ర రాజపఠనా ద్యంతేన  మోక్షప్రదా
  చిద్రూపీ  పరదేవతా  భగవతీ  శ్రీరాజరాజేశ్వరీ
 
    ఫలం : ఆధ్యాత్మిక  జ్ఞానప్రాప్తి, సర్వవాంఛా  సిద్ధి.
..........................................

ఏమైనా  అచ్చుతప్పుల  వంటివి  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



Monday, October 10, 2016

ఆది పరాశక్తి కధలు .. మూడవ భాగం ..


 మహిషాసుర మర్దిని అమ్మవారు ...............

ఒకప్పుడు మహిషాసురుడు రాక్షసులకు చక్రవర్తి అయ్యాడు. అతడు దేవేంద్రుని జయించి స్వర్గాధిపత్యాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. దిక్పాలకులు, దేవతలు అందరూ అతని ఆజ్ఞకు వశులయ్యారు.

మహిషాసురుడు చేసే అన్యాయములు భరించలేక , దేవతలందరూ బ్రహ్మదేవునితో కలిసి శివకేశవులను దర్శించుకొని తమ బాధలు చెప్పుకొన్నారు. మహిషాసురుని దుర్మార్గాలు వివరించారు.

ఆ తరువాత వారందరి అంశాలతో ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆ మహాశక్తి సర్వాలంకారములతో, సమస్త దివ్యాయుధములతో సాక్షాత్కరించింది. ఒక్కసారి మహాభయంకరముగా వికటాట్టహాసం చేసింది. ఆ తల్లిని దివ్యులంతా స్తుతించారు.

రాక్షసులకు ఆ భయంకరారావం గుండెల్ని బ్రద్దలు చేసేదిగా అనిపించింది. రాక్షసులు ఆయుధాలు ధరించి మహిషుని వెంట యుధ్ధానికి బయలుదేరారు. జగన్మాతను చూశాడు మహిషాసురుడు. ఇరుపక్షాలకు పోరు ప్రారంభమయింది.

చిక్షురుడు- తామ్రుడు- బిడాలుడు- అసిలోముడు మొదలైన రాక్షసులు నూతన వ్యూహ రచనలతో యుధ్ధం ప్రారంభించారు. ఎందరో రాక్షస వీరులు హతులయ్యారు.

జగన్మాత సింహవాహనాన్ని అధిరోహించింది. సింహగర్జనలతో, రాక్షసవీరుల అరుపులతో, రణరంగం భయంకరంగా ఉంది. సింహం రక్కసుల రక్తం త్రాగుతూ జూలు విదిలిస్తోంది. రాక్షసులు ప్రాణభీతితో అరుస్తూ ఉంటే, దేవతలు దేవి మీద పూలవాన కురిపిస్తున్నారు.

ఎందరో రాక్షసులు దేవి చేతిలో హతులయ్యారు.

ఈ దృశ్యం చూసి మండిపడ్డాడు మహిషాసురుడు. మహిష (దున్నపోతు ) రూపం ధరించాడు. కాలిగిట్టలతో నేల తట్టాడు. కొమ్ములతో పర్వతాలను బంతుల మాదిరిగా ఎగురగొట్టాడు. వాడి భయంకర రూపానికి ప్రకృతి కంపించింది.

మహిషుణ్ణి పాశంతో బంధించింది శ్రీదేవి. వాడు వెంటనే మహిష రూపం విడిచి రాక్షసాకారం  ధరించాడు. భయంకరారావం గావించాడు. అంతలో దేవి ఒక్కసారిగా మహిషుడిని   క్రింద పడవేసి పాదంతో త్రొక్కి పెట్టి ,శూలంతో గుండెల్లో పొడిచి సంహరించింది.

మహిషాసురుని సంహారాన్ని కళ్ళారా చూసిన మిగిలిన రాక్షస సైన్యం హాహాకారాలు చేస్తూ పాతాళానికి పారిపోయారు. దేవతలు ఆనందించి మహాదేవిని స్తుతించారు.

అంబా! నీ శక్తితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమతమ విధుల్ని నిర్వహించగలుగుతున్నారు. నువ్వు కీర్తివి, మతివి, స్మృతివి, గతివి, ధృతివి, కరుణవు, భయవు, శ్రధ్ధవు, వసుధవు, నువ్వే. .కమల, విజయ, గిరిజ, రమ, ఉమ, జయ మొదలైన నామాలతో కీర్తికెక్కిన దానివి నువ్వే. నువ్వు తుష్టివి, పుష్టివి, బుధ్ధివి, విద్యా, క్షమా, కాంతి, మేధలు నువ్వే. నీ ధారణా శక్తి వలన నాగకూర్మాలు భూమిని మోస్తున్నాయి. నీ స్వాహా శక్తి వలన యజ్ఞ హవిస్సులు దేవతలకు లభిస్తున్నాయి. 

తల్లీ ! నువ్వు అందరికీ భోగభాగ్యాలు ప్రసాదిస్తావు. వాగ్దేవతవై విద్యను అనుగ్రహిస్తావు. జనుల ఆర్తిని తొలగిస్తావు. నిన్ను నిరంతరం ధ్యానించేవారికి గర్భశోక రహితమైన మోక్షఫలాన్ని అందిస్తావు.

మాతా ! ఈ భువన చక్రాన్ని కారుణ్యవీక్షణంతో నడిపించే నీ నిజతత్వం వేదాలకే అర్ధం కాదు. మరి అన్యులకెలా బోధపడుతుంది .

మాతా ! మహోగ్రుడూ, భువన కంటకుడూ అయిన మహిషాసురుణ్ణి సంహరించి మమ్మల్ని అనుగ్రహించావు. మేము ధన్యులం. సర్వశరణ్యాలైన నీ పదపంకజాల మీద మాకు అచంచలమైన భక్తిని ప్రసాదించు. ఈ శరీరం (వృక్షం ) రెండు పక్షులకు ( జీవాత్మ, పరమాత్మ )ఆశ్రయం. వాటి సఖ్యం అవి భాజ్యం. వాటిమధ్య మూడోదానికి స్థానం లేదు. అటువంటప్పుడు జీవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు ? అలాగే మేము నిన్నెప్పుడూ సేవిస్తూనే ఉంటాము. మమ్మల్ని కరుణించి రక్షించు తల్లీ !

దేవతలు చేసిన స్తుతికి దేవి సంతోషించి మృదుమధుర వాక్కులతో- "దుస్సాధ్యమూ దుర్ఘటమూ అయిన కార్యం ఎప్పుడైనా సంభవించినప్పుడు నన్ను స్మరించండి. మీ ఆపదల్ని వెంటనే హరిస్తాను. " అని అభయమిచ్చి దేవి అంతర్ధానమయ్యింది.
 
 

ఆదిపరాశక్తి కధలు.. రెండవ భాగము..


ఒకప్పుడు మహాశక్తి యొక్క సరస్వతీ శక్తి శుంభనిశుంభాది రాక్షసుల్ని సంహరించింది. 


ఒకానొక సమయంలో శుంభుడు, నిశుంభుడు అనే పేర్లు గల రాక్షసులు ,వరబలగర్వాలతో దేవతల్ని అమరావతి నుండి తరిమివేశారు.



శుంభ,నిశుంభుల వల్ల ఎన్నో బాధలు పడ్డ దేవతలు .... ఏదైనా ఉపాయం చెప్పమని దేవగురువు వద్దకు వెళ్ళి అడిగినప్పుడు, ఆయన చెప్పిన సలహా ప్రకారం , మీకేమయినా ఆపదలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ... మహిష వధానంతరం దేవి ఇచ్చిన అభయప్రదానమును గుర్తు తెచ్చుకుని , అందరూ కలిసి హిమాలయానికి వెళ్ళి దేవీద్యాన పరాయణులై, మాయాబీజ జపమగ్నులై పరమేశ్వరిని ప్రార్ధించారు.



దేవతల దీనాలాపాల్ని విని .. . . జగన్మాత ' కౌశికి ' అనే పేరుతో ఆవిర్భవించి మహాకాళి అనే నామంతో వారి కష్టాలు తీరుస్తానని పలికింది.



హిమాలయ ప్రాంతములో ఉన్న మహాకాళిని, శుంభనిశుంభుల సేవకులయిన చండముండాసురులు చూశారు. ఆ విషయాన్ని , ఆమె రూపలావణ్యాలను తమ ప్రభువులకు విన్నవించారు. ఆమె సౌందర్యాతిశయాన్ని గురించి విన్న శుంభుడు , సుగ్రీవుడనే రాక్షసుణ్ని దేవి దగ్గరకు రాయబారిగా పంపాడు.



సుగ్రీవుడు జగన్మాతను సమీపించి , శుంభనిశుంభుల గొప్పదనాన్ని ప్రశంసించి వారిలో ఎవరినో ఒకరిని వరించమన్నాడు. 


అతని మాటలు విని ఆ తల్లి చిరునవ్వు నవ్వి , "నీ పలుకులు యధార్ధం. నన్ను జయించిన వాణ్ని గాని, నాతో సరిసమానమయిన పరాక్రమశాలిని గాని నేను వివాహం చేసికొంటాను. ఇది నా నియమం. నీవు పోయి ఈ విషయాన్ని మీ ప్రభువులకు చెప్పు." అన్నది.



ఆ మాటలకు కోపించిన సుగ్రీవుడు, ఆమెతో ఏవేవో ప్రగల్భాలు పలికి, శుంభునకు విషయాన్ని వివరించాడు. శుంభనిశుంభులు రణమునకు బయలుదేరి వచ్చారు. ఉభయపక్షాలు పోరు ఘోరంగా చేస్తున్నాయి. వీరుల పదఘట్టనలతో భూమి దద్దరిల్లుతోంది. దేవతలు ఆసక్తిగా చూస్తున్నారు. సృష్టికి ప్రళయం సంభవిస్తుందేమోనన్న అనుమానం బయల్దేరింది  కొంతమంది విద్యాధరులకు.



జగన్మాత; సదాశివుని, శుంభనిశుంభుల దగ్గరకు రాయబారం పంపింది. రాయబారం విఫలమైంది. యుధ్ధం ప్రారంభమైంది. రాక్షససంహారం ముమ్మరంగా సాగుతోంది. పిశాచాలు రణరంగంలో ఆనందనాట్యం చేస్తున్నాయి. భూత- ప్రేత- పిశాచ- బ్రహ్మరాక్షస- శాకినీ- డాకినీ- హాకినీ గణాలు స్వైరవిహారం చేస్తున్నాయి. తెగిన తలలు, భుజాలు, అవయవాలు, ఎముకలగుట్టలతో   రణరంగం మహా భయంకరంగా ఉంది.



ఇంతలో వచ్చాడు రక్తబీజాసురుడు. వాడి శరీరంలో నుండి నేలమీద రాలే ఒక్కొక్క రక్తపు బొట్టుకి ఒక్కొక్క రక్తబీజుడు ఉధ్భవిస్తాడు. ఆ ఇంద్రాణీ శక్తి తన వజ్రాయుధంతో రక్తబీజుడ్ని కొట్టింది. వాడు గాయపడ్డాడు. రక్తం చిందింది. అనేకులు రక్తబీజులు పుట్టుకొచ్చారు. ఇది వాడు సాధించిన అపూర్వశక్తి. వాణ్ణి జయించటం కష్టం.



ఆ దృశ్యం చూసింది సరస్వతీదేవి. మహాకాళితో ఈ విధంగా అన్నది.


కాళీ! వీడి శరీరంలో రక్తం ఉన్నంతవరకు చావడు. కనుక, వీని శరీరం నుండి నేల మీద పడే రక్తాన్ని నేలమీదపడకుండానే త్రాగెయ్యి. నీకు చండిక సహకారంగా ఉంటుంది." మహాదేవి మళ్ళీ రక్తబీజుడ్ని గాయపరిచింది. రక్తం నేలమీద పడకుండానే మహాకాళి పీల్చివేసింది. రక్తరహితుడయ్యాడు ఆ రాక్షసుడు. వెంటనే వాని శిరస్సు ఖండించి అతని కపాలాన్ని తన కపాలమాలలో చేర్చుకొన్నది కాళిక .


రక్తబీజ సంహారం గాంచిన శుంభనిశుంభులు కాలాగ్నిరుద్రులై వచ్చారు. మళ్ళీ భయంకర యుధ్ధం. సరస్వతీదేవి సింహంలా గర్జించింది. నారిసారించి ధనుష్టంకారం చేసింది. ఆ ధ్వనికి బ్రహ్మదేవుని చెవులు గింగురుమన్నాయి. మృత్యుదేవత నృత్యం చేస్తూ దైత్యగణాల్ని అత్యుత్సాహంతో ఆరగిస్తున్నది.



నిశుంభాసురుడు జగదాంబను గుర్తించాడు. అసురీ మాయతో వేరొక ఆకారాన్ని పొందాడు. ఆ విధంగా కొంతసేపు పోరాడినాడు. జగదంబ భయంకరాకారాన్ని ధరించి నిశుంభుని మీదికురికింది. సింహనాదం చేస్తూ నిశుంభుని శిరసు ఖండించింది. దేవతలు ఆనందించారు. దుష్టరాక్షస గణాలు దుఃఖించాయి.


నిశుంభుడు చనిపోయాడు. శుంభుడు , దుర్గాదేవికి , నన్ను శరణు వేడుకో ! అని సలహా ఇచ్చాడు.


 అపుడు అంబ , నీవు పూర్వజన్మలో చేసికొన్న పుణ్యలేశం వల్ల నన్ను గాంచగలిగావు. నాతో సంభాషించగలిగావు. నేనెవరినో, నా రూపమేమిటో, నా  నామమేమిటో తెలియక వేదాలు ఘోషిస్తున్నాయి." అని అన్నది.



శుంభునికి జగన్మాత దర్శనమైనది. ఆమె తత్వం అవగతమయ్యింది. ఆమె చేతిలో చనిపోయి జన్మ ధన్యం గావించుకోవాలనుకొన్నాడు. ఆయుధాలు ధరించాడు. రధమారోహించాడు. పోరు ప్రారంభించాడు. వీరి పోరాటాన్ని గగనతలాన నిలిచి యక్ష కిన్నర కింపురుష గరుడోరగ సిధ్ధసాధ్య విద్యాధరాధి దేవతాగణాలు , మహర్షులు చూశారు. ఆ యుధ్ధంలో దేవి వాడిని సంహరించింది.



దేవతలు, దిక్పాలకులు, మహర్షులు మహాశక్తిని స్తుతించారు.


రాక్షస సంహారం జరిగింది. అంటే అజ్ఞానం తొలగిపోయింది. విజ్ఞాన కాంతులు దశదిశల వ్యాపించాయి.


 విజ్ఞానం సరస్వతి. కనుకనే మానవ హృదయాలలో గూడుకట్టుకొన్న దురభిమానం, అహంకారం, మమకారం, ఆత్మీయత, స్వార్ధం, ద్రోహం మొదలయిన దుష్ట రాక్షసశక్తులు నశించిపోవాలని, శాశ్వతమైనది, పారలౌకికమైనది, నిరంతరానందసంధాయకమైనది పరమేశ్వరీ కృపాకటాక్షమని గ్రహించడం కోసం సరస్వతీ పూజ చేస్తారని పెద్దలు చెబుతున్నారు.




Friday, October 7, 2016

ఆదిపరాశక్తి కధలు.


ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం మీద ఆదిశేషునిపై పవళించి యోగనిద్రలో ఉన్నారు. 


 అప్పుడు విష్ణుమూర్తి చెవులలోని గులివి నుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారిద్దరూ మహా బలవంతులు.

వారు శక్తిస్వరూపిణి అయిన పరాశక్తిని గురించి తపస్సు చేసి స్వేచ్చామరణమును వరముగా కోరుకొన్నారు.

 ఆ వరగర్వముతో రాక్షసులిద్దరూ బ్రహ్మ మీద దాడి చేశారు. బ్రహ్మదేవుడు విష్ణువు శరణుజొచ్చారు.

మధుకైటభులు విష్ణుదేవుని తమతో యుధ్ధము చేసి గెలవమన్నారు. వారు ఒకరితర్వాత ఒకరు అలసట తీర్చుకుంటూ విష్ణుమూర్తితో యుధ్ధము చేశారు.

విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేకపోయింది.

అప్పుడు మధుకైటభులు , "నీవు పరాక్రమశాలివే, అలసిపోయినట్లున్నావు. దాసోహమన్నచో నిన్ను విడిచిపెడతాం. కాదంటే నిన్ను సంహరించి తర్వాత ఈ బ్రహ్మదేవుని పని పడతాం " అన్నారు.

 అప్పుడు విష్ణువు, నేను అలసిపోయాను. కొంత విశ్రాంతి తీసికొన్న పిమ్మట మళ్ళీ మీతో యుధ్ధం చేస్తాను " అన్నారు.

మళ్ళీ యుధ్ధం ప్రారంభమయ్యింది. విష్ణువు యోగమాయను నుతించాడు. యోగమాయ విష్ణువును అనుగ్రహించటం జరిగింది.

యుధ్ధసమయములో యోగమాయ గగనతలంలో రాక్షసులకు దర్శనమిచ్చి వారివైపు తన మాయా దృష్టిని ప్రసరించటం జరిగింది.

ఆ చూపులకు మధుకైటభులు   తమనుతాము   మరచిపోయారు.

ఆ సమయములో విష్ణువు , "గతములో నేను ఎంతోమంది రాక్షసులను వధించాను. నాతో ఇంతకాలం యుధ్ధం చేసినవారు మీరు తప్ప మరొకరు లేరు. కనుక ఏదైనా వరము కోరుకొనుడు ఇస్తాను " అన్నారు.

పరవశులై, మదోన్మత్తులై యున్న ఆ దానవులు, "మేము యాచకులము కాదు. నీవే కోరుకో వరం, ఇస్తాము." అన్నారు.

అపుడు  శ్రీ మహావిష్ణువు, మీరిద్దరూ నా చేతిలో మరణించాలి: అన్నారు.

 వారు ఆశ్చర్యపోయారు. తెలివిగా మోసగింపబడ్డామని గ్రహించారు. లోకమంతా జలమయంగా ఉండడం చూసి , మమ్మల్ని నిర్జలప్రదేశంలో సంహరించు అన్నారు.

విష్ణువు రాక్షసుల్ని తన తొడలమీద నొక్కిపెట్టి సుదర్శన చక్రంతో వారి తలలు నరికారు. ఆ తలలనుండి మేధస్సు {మెదడు} బయటకు వచ్చి నీటి మీద తేలింది. మధుకైటభులిద్దరూ మరణించారు.

మేధస్సు ఆవరించిన జలభాగం మేదిని {భూమి } అయింది. అందుచేతనే మట్టి తినకూడదంటారు.