koodali

Monday, October 24, 2016

ఈ మధ్యకాలంలో కొందరు షిరిడి సాయిని ...


హిందువులు..ఎందరో దేవతలను, గురువులను, అవతారమూర్తులను.. ఆరాధించుకుంటారు. అలాగే షిర్డిసాయినీ ఆరాధించుకుంటున్నారు.

  *************
హిందువులు రాయిలోను, రప్పలోనూ, చెట్టు లోనూ  కూడా దైవాన్ని భావించి ఆరాధిస్తారు. గురువును దైవంగా పూజిస్తారు చాలామంది.

*******************
 కొందరు స్వార్ధపరుల వల్లా, కొందరు తెలిసీతెలియని వారి వల్లా హిందుత్వంలో కొన్ని  మూఢనమ్మకాలు  ప్రవేశించాయి.
ఇలాంటి వాటి వల్ల  హిందూ సమాజం ఇప్పటికే ఎంతో నష్టపోయింది. 
 

 హిందువులు ఎన్నో మూఢనమ్మకాలను, కఠినమైన ఆచారవ్యవహారాలను పెంచుకున్నారు. అవన్నీ పాటించలేని కొందరు సులభంగా ఉండే పద్ధతుల పట్ల ఆకర్షితులవుతున్నారు. 
 
 
అనేకమైన ఆచారవ్యవహారాలను పాటించలేక , ఇన్ని పద్ధతులు ఎందుకు ఆచరించాలంటూ నాకు కూడా చాలాసార్లు విసుగు అనిపించేది. ఆచరించకపోతే ఏమవుతుందో అని భయంతో ఆచరించాను. ఇప్పుడు చాలావరకూ తగ్గించుకుని నాకు వీలైనంతలో ఆచరిస్తున్నాను. ఇప్పుడు భయం తగ్గింది. 
 

హిందువులు ఇతర పద్ధతులలోకి వెళ్ళకుండా ఉండాలంటే,  తమ మూఢాచారాలను వదిలేయాలి. ఆచారవ్యవహారాల విషయంలో కూడా కాలానుగుణంగా  కొంత సులభంగా ఉండాలి. 
 
 
అంతేకాని, ప్రతిది ఇలా చెయ్యకూడదు, ఇలానే చెయ్యాలి అంటూ..అదేపనిగా చెప్పుకుంటూ పోతూ ప్రజలను నిందించటం సరైనది కాదు.
.................
 
 మరికొన్ని విషయాలు..ఈ విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలాకాలం తర్వాత వ్రాసి పోస్ట్ చేయటం జరిగింది.
............
సమాజంలో రకరకాల మనస్తత్వాలవారుంటారు. కొందరు తమ మతంప్రకారం దైవాన్ని ప్రార్ధించుకుంటారు. కొందరు అనేకమతాలదేవతలను కూడా ప్రార్ధించుకుంటారు. కొందరు దైవాన్ని నమ్మని నాస్తికులుంటారు. 
 
సాయిబాబా షిరిడి వస్తే, అక్కడ కొందరు హిందువులు వారిని  సాయి అని పిలిచారట. తరువాత భక్తులు రావటం పెరిగింది. షిర్డిసాయి తనకు ఆడంబరంగా పూజలు చేయటం వద్దనేవారట. అయినా భక్తులు వినరు కదా..
 
సమాజంలో ఎందరో గొప్పవాళ్లు యోగులు, అవధూతలు ఉంటారు. వాళ్లు ఎంతో గొప్పవారే. ..హిందువులు ఎందరో యోగులను, అవధూతలను కూడా పూజిస్తారు. 
 
కొందరు మహిమలు కలవారు వారిమానాన వారు ఆడంబరం లేకుండా జీవించి మరణించిన తరువాత, వారి పేరుతో కొత్త విధానాలను తెచ్చి తాము లాభం పొందాలని చూసే వాళ్ళూ సమాజంలో ఉంటారు.
.....................
 
సాయిబాబా.. దత్తాత్రేయస్వామి అవతారం అని కొందరు, హనుమంతుని అవతారం అని కొందరు అంటున్నారు కదా.

అసలు దత్తాత్రేయుల వారు, హనుమంతుల వారు ఉండగా..ఇంకా ఎందుకు బాధ...దత్తాత్రేయస్వామివారిని, ఆంజనేయస్వామివారిని పూజిస్తే సాయిబాబాను కూడా పూజించినట్లే.....అలా వద్దనుకుంటే సాయిబాబాను పూజించుకోవచ్చు.

సాయిరాం, సాయి కృష్ణ అని సాయిబాబాకు రామ, కృష్ణ పేర్లను కలిపి అంటున్నారు కదా.. శ్రీరాముని, శ్రీకృష్ణుని పూజిస్తే సాయిని కూడా పూజించినట్లే.  దైవము ఒకే శక్తి.
 ...........................
 
కొందరు గొప్పవారికి మహిమలు ఉంటాయి. వారు ఎంతో గౌరవనీయులే. అలాగని చాలామంది దేవతలను పెంచుతూ ఉంటే, హిందువులకు బోలెడు దేవతలు, బోలెడు శాఖలుగా మారి, భవిష్యత్తులో ఏమవుతుందో?
 .....................
 
సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి ఎక్కువ డబ్బు ఖర్చుచేయలేము,  ఎక్కువ సమయం చేయలేము...అనుకుంటే, తక్కువ ఖర్చుతో, కొంత సమయంలో  పద్ధతిగా చేయవచ్చు. అసలే చేయకుండా మానటం కన్నా, చేయటం మంచిది కదా.. అనుకుంటున్నాను.

 
హిందువులు చాలా నియమాలను  పాటించగలిగిన వాళ్లు పాటించవచ్చు. అందరూ అలా పాటించాలి, లేకపోతే కష్టాలు మీదపడిపోతాయని చెప్పకూడదు. కలికాలంలో దైవస్మరణ..దైవనామస్మరణ చేసినా తరించుతారని ప్రాచీనులు తెలియజేసారు.
 
హిందు పెద్దలు కూడా ఈ విషయాలను గమనించాలి.  
ఈ  రోజుల్లో ఆచారవ్యవహారాలంటూ  బోలెడు నియమాలను చెబితే, పాటించలేక సరళంగా దైవపూజ చేసే మార్గాల వైపు జనం వెళ్లే అవకాశం ఉంది.

 పూజ అంటే చాలా నియమాలు పాటించలేమో? అని భయపడకండి. ఎక్కువ నియమాలతో కాకుండా,  సరళంగా కూడా హిందూదేవతలను పూజించుకోవచ్చు....చాలా నియమాలతో పూజించగలిగే వారు అలా పాటిస్తూ పూజించుకుంటారు.

 ఎవరైనా కూడా, దైవము పట్ల ప్రేమతో చక్కగా పూజించుకుంటే మంచిది.
**********
 వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 
 

No comments:

Post a Comment