koodali

Saturday, September 21, 2024

కల్తీ..

 

 

 శ్రీ వేంకటేశ్వరస్వామికి సమర్పించే  పదార్ధాలలో వాడే ఆవునేతిలో కల్తీ జరిగిందని అంటున్నారు.  ఇలా కల్తీ చేయటం మహాపరాధం.

దైవానికి సమర్పించే పదార్ధాలలో కల్తీ చేసే వారు,  దైవం పట్లకానీ, సాటి జీవులపట్ల కానీ అధర్మం చేసినవారు దైవన్యాయస్థానం నుంచి తప్పించుకోలేరు.

 *************

 ఆవునేతిని వేరే సంస్థల  నుంచి కొనటం కాకుండా, దేవస్థానం నిర్వాహకులు ఆవులను పెంచి, పాలను సేకరించి, నేతిని తీసి వాడవచ్చు. 

 పశుగ్రాసం కొరకు కొంత భూమిని కొని  (దేవాలయ భూములు కూడా ఉంటాయి ..) చక్కగా పశువులను పెంచితే, స్వచ్చమైన నేయి లభిస్తుంది.  ఆ నెయ్యి మిగిలితే ఇతర దేవాలయాలకు కూడా సరఫరా చేయవచ్చు.

 లేదంటే,  జాగ్రత్తగా పరీక్షించి..కల్తీ చేయని వారి వద్ద నుండి  నేతిని తీసుకోవచ్చు. 

***********

 దేవాలయాలకు కొందరు గోవులను దానం చేస్తారు. అయితే,   గోవులను పోషించటానికి, వాటిని చక్కగా చూసుకోవడానికి సరైన వ్యవస్థ ఉండాలి. అందుకు చాలా ధనం  అవసరం. గోవులను చక్కగా  చూసుకునే మనుషులు కూడా ఉండాలి.

*************

ఇంకొక విషయమేమిటంటే, హిందుధర్మాన్ని నమ్మిన హిందువులే దేవస్థానాల వద్ద పనిచేయాలి. హిందుధర్మాన్ని నమ్మని వారిని దేవస్థానాలలో నియమించటం ఏమిటో అర్ధం కాదు.

 

 యితే, కొందరు హిందువులు కూడా పాపభీతి లేకుండా,  దేవాలయాల వద్ద అధర్మంగా ప్రవర్తించటం వార్తల ద్వారా తెలుస్తుంది. ఇలాంటి వారిని  కూడా దేవాలయాల పనుల నుండి దూరంగా ఉంచాలి.

*************

 సహజంగా పశువులు  ఆరుబయట   తిరుగుతూ మేత మేస్తాయి. పాతకాలంలో ఆవులను పెంచేవారు కూడా,  మేత మేయడానికి వాటిని పచ్చికబయళ్లకు తీసుకువెళ్ళేవారని తెలుస్తుంది.  

ఈ రోజుల్లో చాలాచోట్ల గోవులను ఒక దగ్గర కట్టేసి మేత వేసి పెంచుతున్నారు.

గోవులు మేతకు వెళ్లి తిరిగివచ్చే సమయాన్ని గోధూళి సమయంగా చెబుతారు. ఆ సమయం విలువైనదని ప్రాచీనులు తెలియజేసారు.

***************

ఆవులు పవిత్రమైనవి, ఆవులను పూజించాలి..అని  చెబుతారు . కానీ, ఈ రోజుల్లో పాలు,  నెయ్యి వాడేవారిలో...  ఎంతమంది  గోవులను చక్కగా పెంచి,  వాటి  పాలను, నేతిని వాడుతున్నారు?

 

 అందరూ ఆవులను చక్కగా చూసేవాళ్లయితే, ఆవులు ఆహారం కొరకు రోడ్లపై ఎందుకు తిరుగుతాయి? కబేళాలకు అన్ని పశువులు ఎందుకు తీసుకుపోబడతాయి? 

 

 పెద్ద వయస్సు వచ్చిన ఆవుల పేడ తో పిడకలు తయారుచేసి..యజ్ఞయాగాదుల్లో వాడవచ్చు. పొలాల్లో ఎరువుగా కూడా వేయవచ్చు.

***********

 పాతరోజుల్లో తిరుమలకు ఎందరు భక్తులు వచ్చేవారో తెలియదు కానీ, రవాణావసతులు పెరిగిన ఈ రోజుల్లో రోజూ వేలమంది తిరుమలకు వస్తున్నారు. ఎక్కువమంది  దైవదర్శనానికి రావటం మంచిదే.  అయితే,  అంతమందికి  లడ్డూలను ఇవ్వాలంటే,  వేల కిలోల నెయ్యి అవసరమవుతుందట. 


స్వచ్ఛమైన నెయ్యి బోలెడు లభించటం కష్టమనుకుంటే, తిరుమలలో దైవానికి స్వచ్ఛమైన నేతితో కొన్ని లడ్డూలను నివేదించి, తీపిబూందీని కూడా దైవానికి నివేదించి, భక్తులకు చిన్న లడ్డును లేక తీపిబూంది వంటివి ప్రసాదంగా ఇవ్వవచ్చు. పాతకాలంలో తిరుమలలో తీపిబూందీని కూడా ప్రసాదంగా ఇచ్చేవారని అంటున్నారు.

 

గుడినుంచి తెచ్చిన లడ్డు వంటి ప్రసాదాన్ని.. చాలామందికి కొద్దిగా పంచాలన్నా కష్టమే.

 బోలెడు ప్రసాదం తయారీకి బోలెడు నెయ్యి ..అవసరమవుతుంది. అందువల్ల, ఎక్కువమందికి ఇవ్వాలంటే కొద్దిగా ఇస్తే సరిపోతుంది.

**********

దైవమే దిక్కు.

 మనుషులు దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించటానికి  ప్రయత్నిస్తే దైవకృపను పొందగలరు.

 


8 comments:


  1. ఈ రోజుల్లో పశువులను పెంచేవారు కొందరు, పాలు ఇచ్చేంతవరకు పశువులను ఉంచి, వాటికి వృద్ధాప్యం వచ్చాక కబేళాలకు అమ్మేస్తున్నారంట. ఇలా చేయటం పాపం.

    ఆధునికకాలంలో పశువులు ఎక్కువపాలు ఇవ్వటం కొరకు, కొందరు వాటికి హార్మోన్లు ఇంజక్షన్లు ఇస్తున్నారని, దూడలను కూడా చంపేస్తున్నారని..అంటున్నారు. ఆవులను మంచిగా చూసుకోకుండా.. వాటినుండి పాలు పిండుకోవటం, ఆనక వాటిని కబేళాలకు పంపటం..ఇలాంటివి దైవానికి నచ్చుతాయా?

    ఆవులను, ఎద్దులను పెంచుకోవాలంటే..వాటిని చక్కగా చూసుకోవాలి. దూడలు అవసరమైనన్ని పాలు త్రాగిన తరువాత, మనుషులు మిగిలిన పాలను పిండుకోవచ్చు. వృద్ధాప్యం వచ్చినా వాటిని కబేళాకు పంపకుండా,చక్కగా చూసుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. మనకు అనేక దేవాలయాలున్నాయి. ఇళ్ళలో కూడా దేవునికి నైవేద్యాన్ని నివేదన చేస్తారు. వంటలో కూడా నేతిని వాడతారు.

      కొంతకాలం క్రిందట..నెయ్యి వంటి వాటిల్లో జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేసి అమ్ముతున్నారని వార్తలు వచ్చాయి. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించి, పదార్ధాలను వాడుకోవటం మంచిది. కొన్నిచోట్ల నూనె కూడా కల్తీ జరుగుతోందని అంటున్నారు.

      Delete
  2. ఈ మధ్య కొన్ని కామెంట్లను గమనిస్తే, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇస్కాన్ సంస్థకు అప్పగించటం మంచిదని ఎవరో వ్రాసారు. ఇంకొకరు ఇంకో విధంగా అన్నారు.

    ఇలాంటివి గమనించిన తర్వాత నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి. అవన్నీ ఇక్కడ వ్రాయలేను కానీ, కొన్ని విషయాలు ఏమిటంటే...

    TTD ని అలా అప్పచెప్పటం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందరో గొప్ప భక్తులున్నారు. అలాంటివారిని దేవాలయం నిర్వహణకు నియమించవచ్చు.

    దైవానికి చక్కగా పూజలు జరగాలి..అన్నీ సక్రమంగా జరగాలి. దేవాలయాలకు చెందిన ఆస్తులను, ఆభరణాలను, భూములను జాగ్రత్త చేసుకోవాలి.

    ReplyDelete
  3. సనాతన ధర్మ పరిరక్షణ కొరకు..సంస్థలు ఏర్పాటు చేయటం అనేది మంచి ఆలోచన. ప్రతి రాష్ట్రంలోనూ ఈ సంస్థలను ఏర్పాటు చేయవచ్చు.

    ప్రతిరాష్ట్రంలోనూ ఎన్నో దేవాలయాలున్నాయి. ఎవరి రాష్ట్రంలోని దేవాలయాల వ్యవహారాలను వారు చక్కగా నిర్వహించుకోవచ్చు.

    ReplyDelete
  4. హిందువుల్లో కొన్ని విభాగాలున్నాయి. ఎన్నో భిన్న ఆచారవ్యవహారాలున్నాయి. ఉదా..తమిళనాడు వారు మూఢాన్ని పాటించరు. తెలుగువాళ్లు మూఢాన్ని పాటిస్తారు. చాలామంది ఉత్తర భారతీయులకు పౌర్ణమి తరువాత నెల ప్రారంభమవుతుంది. చాలామంది దక్షిణాది వారికి అమావాస్య తరువాత కొత్త నెల ప్రారంభమవుతుంది. ఇలా దేశంలో ఎన్నో భిన్న ఆచారవ్యవహారాలున్నాయి. ఎవరి పద్ధతులను వారు ఆచరిస్తారు.

    ReplyDelete
    Replies
    1. చాలాకాలం నుంచి కొందరు ఏమంటున్నారంటే, హిందూదేవాలయాలను ప్రభుత్వాలకు సంబంధం లేకుండా..హిందువులకే అప్పజెప్పాలంటున్నారు.

      అందరూ హిందువులే అయినా, హిందువుల్లో ఎన్నో వర్గాలున్నాయి. వీరిలో ఎవరెవరికి అప్పజెప్పాలో..అనేవి పెద్ద విషయాలు. హిందువుల్లో కూడా కొందరు తప్పులు చేసేవారుంటారు.

      అయితే, హిందువులందరూ ఒకటే అని..మనరాష్ట్రంలోని దేవాలయాలను వేరే వారికి అప్పజెప్పటం వంటివి చేయనవసరం లేదు.

      దేశంలో ఎన్నో రాష్ట్రాలున్నాయి. ఎన్నో భాషలున్నాయి. హిందువుల్లో కూడా ఎవరి గొడవలు వారికున్నాయి. ఇలాంటప్పుడు, కొత్తగా సమస్యలు రాకుండా ఉండాలంటే, ఎవరి రాష్ట్రంలోని దేవాలయాలను ఆ రాష్ట్రంలోని హిందువులు చూసుకోవచ్చు.

      రాష్ట్రాల నిర్మాణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ..ఇప్పుడు ఉన్న ప్రకారం ఎవరి పరిస్థితులు వారివి.

      Delete
  5. హిందూ దేవాలయాల గురించే కాకుండా, దేశంలోని హిందువుల బాగోగుల గురించి కూడా ఆలోచించాలి.
    కొన్ని హిందు దేవాలయాల వద్ద చాలా సంపద నిల్వలు ఉన్నాయి. అలా బోలెడు ధనాన్ని పోగుచేసుకుని కూర్చుంటే, ఇతరులు ఆ సొమ్మును కాజేయటానికి ప్రయత్నిస్తారు. కొందరు హిందువులు కూడా తమ చేతివాటతనం ప్రదర్శించవచ్చు.

    అలాంటివి జరిగేకంటే, దేవాలయాల వద్ద ఉన్న కొంత సొమ్మును పక్కకు తీసి, హిందుదేవాలయాల ఆధ్వర్యంలో దేశంలోని హిందువులకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది.

    స్కూల్స్, హాస్పిటల్స్ పెడితే హిందువులు చాలామంది వాటికి విరాళాలు కూడా ఇస్తారు. తిరుమల అన్నదానానికి ఎందరో విరాళాలు ఇస్తున్నారు కదా..

    ReplyDelete
  6. మీకు మీరే

    ReplyDelete