koodali

Monday, July 16, 2012

శ్రీ షిరిడి సాయిబాబా కధలు...


  శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము.

 బాపు  సాహెబు  బుట్టీ  

ఒకానొకప్పుడు  బాపు  సాహెబు  బుట్టీ  జిగట  విరేచనములతోను   వమనములతోను  బాధపడుచుండెను. అతని  అలమారు  నిండ  మంచి  మందులుండెను.  కాని    యేమియు  గుణమివ్వలేదు.  విరేచనముల  వల్లను, వమనముల  వల్లను బాపు  సాహెబు  బాగా  నీరసించెను. అందుచే   బాబా  దర్శనమునకై   మసీదుకు  పోలేకుండెను.  బాబా  వానిని  రమ్మని  కబురు  చేసెను.  వానిని  తనముందు  కూర్చుండబెట్టుకొని  యిట్లనెను.  ' జాగ్రత్త  !  నీవు  విరేచనము  చేయకూడదు. '  అనుచు  బాబా  తన  చూపుడు  వ్రేలాడించెను.  '  వమనము  కూడ  ఆగవలెను  '  అనెను.  బాబా  మాటల  సత్తువను  గనుడు.  వెంటనే  ఆ  రెండు  వ్యాధులు  పారిపోయెను.  బుట్టీ  జబ్బు  కుదిరెను.

 

ఇంకొకప్పుడు  అతడు  కలరాచే  బాధపడెను. తీవ్రమైన  దప్పితో  బాధపడుచుండెను.   డాక్టరు  పిళ్ళే  యన్ని  యౌషధములను  ప్రయత్నించెను. కాని  రోగము  కుదురలేదు. అప్పుడు  బాపు  సాహెబు  బాబా  వద్దకు  వెళ్ళి  ఏ  యౌషధము  పుచ్చుకొనినచో తన  దాహము  పోయి   జబ్బు   కుదురునని  సలహా  అడిగెను.  బాదాము పప్పు,  పిస్తా,  అక్రోటు,  నానబెట్టి  పాలు  చక్కెరలో   ఉడికించి  యిచ్చినచో  రోగము  కుదురునని  బాబా  చెప్పెను.  ఇది  జబ్బును  మరింత  హెచ్చించునని  యే  డాక్టరయినను  చెప్పును.  కాని  బాపు  సాహెబు  బాబా  యాజ్ఞను  శిరసావహించెను. పాలతో  తయారుచేసి  దానిని  సేవించెను. వింతగా   రోగము  వెంటనే  కుదిరెను.  

 

కాకామహాజని

కాకామహాజని  యను  నింకొక  భక్తుడు  గలడు.  అతడు   నీళ్ళ  విరేచనములతో  బాధపడుచుండెను.  బాబా  సేవ  కాటంకము  లేకుండునట్లు  ఒక  చెంబునిండ  నీళ్ళు  పోసి  మసీదులో  నొక  మూలకు  పెట్టుకొనెను.  అవసరము  వచ్చినప్పుడెల్ల  పోవుచుండెను.  బాబా  సర్వజ్ఞుడగుటచే  కాకా  బాబాతో  నేమి  చెప్పకే , బాబాయే  త్వరలో  బాగుచేయునని  నమ్మెను.  మసీదు  ముందర  రాళ్ళు  తాపనచేయుటకు  బాబా  సమ్మతించెను;  కావున  పని  ప్రారంభమయ్యెను.  వెంటనే  బాబా  కోపోద్దీపితుడై  బిగ్గరగా  నరచెను.  అందరు  పరుగెత్తి  పారిపోయిరి.  కాకా  కూడ  పరుగిడ  మొదలిడెను.    కాని  బాబా  అతనిని  పట్టుకొని  యచ్చట  కూర్చుండ  బెట్టెను.  ఈ  సందడిలో  నెవరో  వేరుసెనగ   పప్పుతో  చిన్న  సంచిని  అచ్చట  విడిచి  పారిపోయిరి.  బాబా  యొక  పిడికెడు  శనగపప్పు  తీసి ,  చేతులతో  నలిపి  ,  పొట్టును  ఊదివైచి  శుభ్రమైన  పప్పును  కాకాకిచ్చి  తినుమనెను.  తిట్టుట  శుభ్రపరచుట   తినుట  యొకేసారి  జరుగుచుండెను.  బాబా  కూడ  కొంత  పప్పును  తినెను.  సంచి  ఉత్తది  కాగానే  నీళ్ళు  తీసుకొని రమ్మని  బాబా  కాకాను  ఆజ్ఞాపించెను.  కాకా  కుండతో  నీళ్ళు  తెచ్చెను.  బాబా    కొన్ని  నీళ్ళు  త్రాగి   , కాకాను  కూడ  త్రాగుమనెను.  అప్పుడు  బాబా  యిట్లనెను.  '  నీ  నీళ్ళ  విరేచనములు  ఆగిపోయినవి.  ఇప్పుడు  నీవు  రాళ్ళు  తాపన జేయు  పనిని  చూచుకొనవచ్చును.  "  అంతలో   పారిపోయినవారందరును  వచ్చిరి.  పని   ప్రారంభించిరి.  విరేచనములు  ఆగిపోవుటచే  కాకాకూడ  వారితో  కలిసెను.  నీళ్ళవిరేచనములకు  వేరుశనగపప్పు  ఔషధమా  ?  వైద్యశాస్త్ర  ప్రకారము   వేరుశనగపప్పు  విరేచనములను  హెచ్చించును  గాని  తగ్గించలేదు.  ఇందు  నిజమైన  యౌషధము  బాబా  యొక్క   వాక్కు.  

 

        ఇంకొక  మూడు  వ్యాధులు

 
(1) మాధవరావు  దేశపాండే  మూలవ్యాధిచే  బాధపడెను.  సోనాముఖి  కషాయమును   బాబా  వానికిచ్చెను.  ఇది  వానికి  గుణమిచ్చెను.  రెండు  సంవత్సరముల  పిమ్మట  జబ్బు  తిరుగదోడెను.  మాధవరావు   ఇదే  కషాయమును  బాబా  యాజ్ఞ లేకుండ  పుచ్చుకొనెను.  కాని  వ్యాధి  అధికమాయెను.  తిరిగి  బాబా  యాశీర్వాదముతో  నయమయ్యెను.


 
(2)  కాకామహాజని  యన్న  గంగాధరపంతు   అనేక  సంవత్సరములు  కడుపు  నొప్పితో  బాధపడెను.  బాబా  కీర్తి  విని  శిరిడికి  వచ్చెను.  కడుపు  నొప్పి  బాగుచేయుమని   బాబాను  వేడెను.  బాబా  వాని  కడుపును  ముట్టుకొని  భగవంతుడే   బాగుచేయగలడనెను.  అప్పటి నుంచి  కడుపు  నొప్పి  తగ్గెను.  వాని  వ్యాధి   పూర్తిగా  నయమయ్యెను.

 

(3) ఒకప్పుడు  నానాసాహెబు  చాందోర్కరు   కడుపు  నొప్పితో  మిగుల  బాధపడెను.  ఒకనాడు  పగలంతయు  రాత్రియంతయు  చికాకుపడెను.  డాక్టర్లు  ఇంజెక్షనులు   ఇచ్చిరి.  కాని,  యవి  ఫలించలేదు.  అప్పుడతడు  బాబా  వద్దకు  వచ్చెను.  బాబా  ఆశీర్వదించెను.  దీనివల్లనే  అతని  జబ్బు  పూర్తిగా  తొలగిపోయెను.  

 

ఈ  కధలన్నియు  నిరూపించునదేమన : అన్ని  వ్యాధులు  బాగగుట  కసలైన  ఔషధము  బాబాయొక్క   వాక్కు :  ఆశీర్వాదము  మాత్రమే. కాని  ఔషధములు  కావు. 


................................
 

మరికొన్ని విషయాలు..ఈ విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలాకాలం తర్వాత వ్రాసి పోస్ట్ చేయటం జరిగింది.

............
సమాజంలో రకరకాల మనస్తత్వాలవారుంటారు. కొందరు తమ మతంప్రకారం దైవాన్ని ప్రార్ధించుకుంటారు. కొందరు అనేకమతాలదేవతలను కూడా ప్రార్ధించుకుంటారు. కొందరు దైవాన్ని నమ్మని నాస్తికులుంటారు. 
 
సాయిబాబా షిరిడి వస్తే, అక్కడ కొందరు హిందువులు వారిని  సాయి అని పిలిచారట. తరువాత భక్తులు రావటం పెరిగింది. షిర్డిసాయి తనకు ఆడంబరంగా పూజలు చేయటం వద్దనేవారట. అయినా భక్తులు వినరు కదా..
 
సమాజంలో ఎందరో గొప్పవాళ్లు యోగులు, అవధూతలు ఉంటారు. వాళ్లు ఎంతో గొప్పవారే. ..హిందువులు ఎందరో యోగులను, అవధూతలను కూడా పూజిస్తారు. 
 
కొందరు మహిమలు కలవారు వారిమానాన వారు ఆడంబరం లేకుండా జీవించి మరణించిన తరువాత, వారి పేరుతో కొత్త విధానాలను తెచ్చి తాము లాభం పొందాలని చూసే వాళ్ళూ సమాజంలో ఉంటారు.
.....................
 
సాయిబాబా.. దత్తాత్రేయస్వామి అవతారం అని కొందరు, హనుమంతుని అవతారం అని కొందరు అంటున్నారు కదా.

అసలు దత్తాత్రేయుల వారు, హనుమంతుల వారు ఉండగా..ఇంకా ఎందుకు బాధ...దత్తాత్రేయస్వామివారిని, ఆంజనేయస్వామివారిని పూజిస్తే సాయిబాబాను కూడా పూజించినట్లే.....అలా వద్దనుకుంటే సాయిబాబాను పూజించుకోవచ్చు.

సాయిరాం, సాయి కృష్ణ అని సాయిబాబాకు రామ, కృష్ణ పేర్లను కలిపి అంటున్నారు కదా.. శ్రీరాముని, శ్రీకృష్ణుని పూజిస్తే సాయిని కూడా పూజించినట్లే.  దైవము ఒకే శక్తి.
 ...........................
 
కొందరు గొప్పవారికి మహిమలు ఉంటాయి. వారు ఎంతో గౌరవనీయులే. అలాగని చాలామంది దేవతలను పెంచుతూ ఉంటే, హిందువులకు బోలెడు దేవతలు, బోలెడు శాఖలుగా మారి, భవిష్యత్తులో ఏమవుతుందో?
 .....................
 
సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి ఎక్కువ డబ్బు ఖర్చుచేయలేము,  ఎక్కువ సమయం చేయలేము...అనుకుంటే, తక్కువ ఖర్చుతో, కొంత సమయంలో  పద్ధతిగా చేయవచ్చు. అసలే చేయకుండా మానటం కన్నా, చేయటం మంచిది కదా.. అనుకుంటున్నాను.

 
హిందువులు చాలా నియమాలను  పాటించగలిగిన వాళ్లు పాటించవచ్చు. అందరూ అలా పాటించాలి, లేకపోతే కష్టాలు మీదపడిపోతాయని చెప్పకూడదు. కలికాలంలో దైవస్మరణ..దైవనామస్మరణ చేసినా తరించుతారని ప్రాచీనులు తెలియజేసారు.
 
హిందు పెద్దలు కూడా ఈ విషయాలను గమనించాలి.  
ఈ  రోజుల్లో ఆచారవ్యవహారాలంటూ  బోలెడు నియమాలను చెబితే, పాటించలేక సరళంగా దైవపూజ చేసే మార్గాల వైపు జనం వెళ్లే అవకాశం ఉంది.

 పూజ అంటే చాలా నియమాలు పాటించలేమో? అని భయపడకండి. ఎక్కువ నియమాలతో కాకుండా,  సరళంగా కూడా హిందూదేవతలను పూజించుకోవచ్చు....చాలా నియమాలతో పూజించగలిగే వారు అలా పాటిస్తూ పూజించుకుంటారు.


 ఎవరైనా కూడా, దైవము పట్ల ప్రేమతో చక్కగా పూజించుకుంటే మంచిది.
**********
 వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 
 

6 comments:

  1. బాబా లీలలు చక్కగా చెప్పారు అండీ..
    ఆయన వాక్కు, ఊదినే అన్ని వ్యాధులకు మందు..
    ఓం సాయిరాం....

    ధ్యాంక్యూ...

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      నిజమేనండి.
      ఆయన వాక్కు, ఊదినే అన్ని వ్యాధులకు మందు..
      ఓం సాయిరాం....

      Delete
  2. ఓం సాయి రాం
    మంచి పోస్ట్ అందించారు అండీ..
    ఆయన లీలలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే ఏమో
    "సాయి అంటే ఓయీ అని ఆయనే కదిలి వస్తారట".
    మా బామ్మ ఎపుడూ అంటూ ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. ఓం సాయి రాం..
      మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      నిజమేనండి.
      మీ బామ్మగారు చెప్పినట్లు... "సాయి అంటే ఓయీ అని ఆయనే కదిలి వస్తారట".

      Delete
  3. శ్రీ సాయిని తలచుకుంటే కాని పని లేదు !! ఎల్ల వేళలా సాయి మనకు తోడూ, నీడ !! జై సాయిరాం !!

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      నిజమేనండి.
      శ్రీ సాయిని తలచుకుంటే కాని పని లేదు !! ఎల్ల వేళలా సాయి మనకు తోడూ, నీడ !! జై సాయిరాం !!

      Delete