koodali

Friday, January 26, 2018

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి ......మరికొన్ని విషయములు...


 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి .

 దేశ రక్షణ సిబ్బంది  తమ ప్రాణాలకు తెగించి  ఎండనక వాననక మంచులో  కూడా దేశప్రజల  రక్షణ కొరకు పాటుబడుతుంటే  ,

ప్రజలలో కొందరు మాత్రం సమాజ సొమ్మును దోచుకోవటం, అవినీతి,  నైతికత లేకుండా జీవించడం చేస్తున్నారు.  ఇలాంటి వారి వల్ల దేశానికి నష్టమే తప్ప లాభం లేదు. 

 ************

 ఎవరికైనా ప్రాధమిక అవసరాలు తీరటం ముఖ్యం..ప్రాధమిక అవసరాలు అంటే.. ఆహారం, ఆవాసం(ఇల్లు), రక్షణ, విద్య, వైద్యం.. ప్రపంచంలో అందరికీ ప్రాధమిక అవసరాలు తీరటం కష్టమేమీ కాదు.  ప్రకృతిలోనే అన్నీ ఉన్నాయి.



  బోలెడు మొక్కలనుంచి అందరికీ ఆహారం లభిస్తుంది. ప్రకృతి నుంచి లభించే వాటితో పర్యావరణహితమైన ఇళ్ళు కట్టుకోవచ్చు. ఇక, చక్కటి పద్ధతితో జీవిస్తే అనారోగ్యాలు  తక్కువగా ఉంటాయి. ప్రకృతి నుంచి లభించే వాటితో మందులు తయారీ , సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజవిధానాలతో వైద్యం చేయవచ్చు. ఎన్నో విద్యలు, వృత్తులు ఉన్నాయి.  ప్రాధమిక అవసరాలు తీరటం అందరికీ తీరటం సులభమే. మనుషులే వ్యవస్థను పాడుచేసుకుంటున్నారు.
 

 పాతకాలంలో డబ్బు బదులు వస్తుమార్పిడి విధానం ఉండేది. ఆ విధానాన్ని ఇప్పుడు కూడా కొన్ని చోట్ల వాడవచ్చు.

 ఇప్పటి ప్రజలు చాలామంది ప్రాధమిక అవసరాలను కూడా విలాసంగా మార్చుకుంటున్నారు. అంటే, ఆహారం విషయంలో.. సరిపడినంత మంచి ఆహారం కాకుండా, జంక్ ఫుడ్ వంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని కోరుకుంటున్నారు.

  ఇల్లు విషయంలో..సరిపడినంత చక్కటి ఇల్లు కాకుండా, విలాసవంతమైన ఇళ్ళకు బోలెడు డబ్బును ఖర్చుపెడుతున్నారు.

ఇక   వైద్యం, విద్య విషయంలో గమనిస్తే.. వీటిని చాలాచోట్ల వ్యాపారధోరణితో మార్చుకున్నారు.

 ఇక రక్షణ విషయంలో..ప్రపంచంలో  మనుషులు అనేకకారణాలతో గొడవలు పడుతున్నారు కాబట్టి, రక్షణకొరకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితి ఉంది.

 విమానప్రయాణాలు, విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన హోటల్స్ ఖర్చులు, అనేక ఆభరణాలు, కాస్మెటిక్స్ ఖర్చులు..ఇలాంటి విలాసాలు ఎన్నో ఉన్నాయి.



ఆధునికకాలంలో కుటుంబవ్యవస్థ, విద్య, వైద్యం, అన్నీ మారిపోయాయి.  కొత్తవస్తువులకొరకు  ప్రజల కోరికలు పెరిగిపోయాయి.  వాటిని పొందటానికి స్త్రీలు, పురుషులు అదేపనిగా పనిచేసినా కూడా ఎక్కడి డబ్బూ సరిపోవట్లేదు.



ఈ రోజుల్లో చాలామంది అనేక విధాలుగా డబ్బును పోగేస్తున్నారు. కొందరి వద్ద విపరీతంగా డబ్బు ఉంటే, కొందరి వద్ద డబ్బు అసలే ఉండటం లేదు. కొందరు ఎన్ని పాపాలు చేసైనా డబ్బును పోగేస్తున్నారు.  డబ్బున్నవారు తమకొరకు కొంత ఉంచుకుని, ఇతరులు పైకి రావటానికి సాయం చేయాలి. అప్పుడు సమాజంలో అందరూ బాగుంటారు. ఎవ్వరైనా వందలు, వేలు కోట్లు కూడబెట్టి ఏంచేసుకుంటారో? అర్ధం కాదు.


జీవితంలో ఏదైనా కష్టం వచ్చి దైవాన్ని ప్రార్ధిస్తే, అప్పుడు జీవితంలో సంపాదించిన ఆస్తులకన్నా..చేసిన పుణ్యాలే కాపాడతాయి.


***************

ప్రపంచంలో అందరూ చక్కగా జీవించవచ్చు. అయితే మనుషులు ఎవేవో కారణాలతో గొడవలు పడుతూ జీవితాలను అశాంతిగా మార్చుకుంటే అది వారి స్వయంకృతాపరాధం.



 ప్రపంచంలో కొందరు అత్యాశాపరులు, చెడ్డవాళ్ళు.. సమాజంలో గొడవలకు కారణమవుతుంటారు.  చెడ్డవారి మాటలకు కొందరు  ప్రభావితమవుతారు.  కొందరి వల్ల మొత్తం సమాజం అల్లకల్లోలమవటం బాధాకరం.  చెడ్డవారంటే భయపడి  కొంతమంది సామాన్యప్రజలు  చెడ్డవారి మాటలను వింటారు. బలహీనులు బలవంతులను ఎదుర్కోలేరు. అయితే, బలహీనమైన చీమలు అన్నీ కలిస్తే.. బలవంతమైన దానిని కూడా ఎదుర్కోగలవు.

****************
ప్రభుత్వాలు ప్రజల ప్రాధమిక అవసరాలు తీర్చాలి.

ఆహారం.. ఆహారధాన్యాలు పాడవకుండా నిల్వ చేసి ప్రజలందరికి సరైన విధంగా అందించాలి. ఈ ప్రక్రియ ద్వారా చాలా ఉద్యోగాలు ఇవ్వవచ్చు. కొందరికి ఉచితంగానూ, తక్కువ ఆదాయ వర్గాల వారికి తక్కువ ధరకు,  ఆదాయం ఎక్కువ ఉన్నవారికి కొంత ఎక్కువ ధరకు ఇవ్వవచ్చు.


విద్య..ఒక 30 సంవత్సరాల క్రిందట ప్రభుత్వపాఠశాలలు, కాలేజీలు..ఉండేవి. ఇప్పుడు కూడా సెంట్రల్ స్కూల్స్ కు మంచి పేరుంది. ప్రతి ఊరిలోనూ ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు చేస్తే అందరికీ విద్య అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్య చక్కగా అందిస్తే ప్రైవేట్ పాఠశాలల విపరీతమైన ఫీజులభారం తగ్గుతుంది.



  పేదవారికి ఉచిత విద్యను అందించి, మిగతావారికి ధర్మబద్ధమైన ఫీజులు తీసుకోవాలి. ఫీజులు మరీ తక్కువ ఉంటే విద్యాసంస్థలను నడపటం ప్రభుత్వానికి భారం అవుతుంది. భారం అని విద్యాసంస్థలను ఎత్తివేస్తే,  ప్రైవేట్ సంస్థలు బోలెడు ఫీజులతో దోచుకుంటారు. అందువల్ల డబ్బున్నవారికి ఫీజులు కొంతవరకు పెంచవచ్చు.



 వైద్యం
.. విషయంలో భారతదేశం చాలాదేశాల కంటే మెరుగనే చెప్పుకోవాలి. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పేదలకు సరైన వైద్య సదుపాయాలు లభించటం లేదు.  వాటితో పోల్చుకుంటే భారతదేశంలో పేదలకు కొంతవరకూ బాగానే  వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. అయితే, ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కువమంది వైద్యులను, నర్సులను  నియమించితే మరింత చక్కగా వైద్యాన్ని అందించవచ్చు. వైద్యుల, నర్సుల సంఖ్యను పెంచితే ఎందరికో ఉద్యోగాలు వస్తాయి. పేదలకు ఉచిత వైద్యాన్ని అందించి, డబ్బున్న పేషెంట్స్ కు ట్రీట్మెంట్ ధరను కొంత పెంచవచ్చు.
 


ఇక పరిశ్రమలు విషయంలో చాలా విషయాలుంటాయి. పరిశ్రమలు పెట్టమంటే  పారిశ్రామికవేత్తలు చాలా భూమిని ఇవ్వమని ప్రభుత్వాలను అడుగుతారు. వందల ఎకరాల భూమిని తక్కువ ధరకు తీసుకుని, వందల సంఖ్యలోనే ఉద్యోగాలను ఇస్తారు. ఇలాగైతే ప్రతిసంవత్సరమూ లక్షల సంఖ్యలో బయటకు వస్తున్న ఇంజనీరింగ్ వారికి ఉద్యోగాలు లభించాలంటే చాలా కష్టం.



  పెద్ద పరిశ్రమలతో పాటు  చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి.  విపరీతమైన యాంత్రీకరణ వల్ల కూడా నిరుద్యోగం పెరుగుతుంది. అందువల్ల చేతివృత్తుల వారిని ప్రోత్సహించాలి. కొన్ని కష్టమైన పనులకు యంత్రాలను వాడవచ్చు.



ప్రభుత్వ సంస్థలు చక్కగా పనిచేయాలి. అవి ప్రైవేట్ సంస్థల వలె శక్తివంతంగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కొన్ని విధివిధానాలు ఉండాలి. ప్రభుత్వ సంస్థలంటే చులకనగా ఉండకూడదు.  ప్రభుత్వసంస్థలలో ఎప్పుడూ జీతాలు పెంచుతూ ఉండాలని సమ్మెలు చేయటం కాకుండా, ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చెందాలని అందరూ భావించి, ఆ విధంగా ప్రవర్తించాలి.



ఉద్యోగస్తుల జీతాలు పెంచటం... వ్యాపారస్తులు సరుకుల ధరలను పెంచటం... ధరలు పెరిగాయని మరల జీతాలు పెంచమనటం ..ఈ విధమైన పరిస్థితి ఉంటే,  జీతాలు పెరిగే పరిస్థితి లేని ఇతరులు ఎలా బ్రతుకుతారు? వ్యాపారస్తులు అదేపనిగా ధరలు పెంచకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి.


దేశం అంతటా శుభ్రతకు ప్రాముఖ్యతను ఇచ్చి ప్రతి వీధిలోనూ మొక్కలు నాటి, పెంచాలి. అక్కడక్కడా పార్కులు ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు ఎన్నో వేల మంది సిబ్బందిని నియమించవచ్చు. ఇలా చేస్తే దేశం కూడా శుభ్రంగా, అందంగా ఉంటుంది. ఎందరో కూలిపనులకు కూడా విదేశాలకు వెళ్లి అక్కడ వెట్టి చాకిరి చేస్తున్నారు. అలాఎక్కడికో వెళ్ళకుండా దేశంలోనే ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.



 దేశంలోని నల్లధనాన్ని వెలికితీయటం, విదేశాల్లో దాచిన నల్లధనాన్ని తిరిగి తెప్పించటం, దేశంలో అవినీతి పెరగకుండా గట్టి చర్యలు తీసుకోవటం వంటివి చేస్తే ఆర్ధికపరిస్థితి బాగుంటుంది. జనాభా విపరీతంగా పెరిగినా కూడా అందరికీ ప్రాధవసరాలు,  ఉపాధి లభించటం కష్టం.

దేశం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలే అంతా చేయలేరు. ప్రజలు కూడా తమ బాధ్యతలను తాము సరిగ్గా నిర్వహించాలి. నైతిక విలువలున్న ప్రజల సంఖ్య పెరిగితేనే సమాజం బాగుపడుతుంది.

***********

ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే ఇతర రాష్ట్రాల వాళ్లు బాధపడకుండా సంతోషించాలి. ఎందుకంటే, అభివృద్ధి చెందిన రాష్ట్రాల ప్రజలు తమ సొంత రాష్ట్రంలోనే ఉంటారు. ఇతరరాష్ట్రాలకు రారు కాబట్టి.  ఇతరరాష్ట్రాలు, దేశాల నుంచి జనాలు ఉపాధి కొరకు వస్తే , వలసవచ్చినవారి వల్ల స్థానికులకు  ఉపాధి అవకాశాలు తగ్గే అవకాశముంది. అందుకని అన్ని రాష్ట్రాలు, అన్నిదేశాలు అభివృద్ధి చెందాలి.

 

Thursday, January 25, 2018

కొన్ని విషయములు...


మనం  ఒక  పని  చెయ్యాలంటే  ఎంతో  ఆలోచించి  చేయవలసి  వస్తుంది.     ఇంత  పద్ధతిగా  ప్రపంచం  ఏర్పడిందంటే  దాని  వెనుక  ఎంతో  ఆలోచన   తప్పక  ఉంటుంది. 

  ఆలోచన  లేనప్పుడు  ఇంత  చక్కటిసృష్టి  ఎలా  సాధ్యం? 


కొందరు  భావిస్తున్నట్లు  ఆలోచన అనేది  లేకుండా  యాదృఛ్చికంగా   సృష్టి   జరగటం  అనే దానికి  అర్ధం  ఏమిటి?  

నిర్జీవమైన, ఆలోచనలేని స్థితిలో యాధృచ్చికంగా సృష్టి ఎలా జరుగుతుంది?  అది  సాధ్యం  కాని  విషయం.

  సృష్టిలో  ఆది  నుంచి  ఆలోచన  ఉంది.  అందుకే  దైవం  ఈ  సృష్టిని  తన  సంకల్పమాత్రం  చేతనే  సృష్టించారు....  అని  పెద్దలు  చెప్పి   ఉంటారు.  

*************
బ్రహ్మాండం యావత్తూ సృష్టికర్త ప్రక్షేపించిన భావనే. ......... రోదసిలో తేలి ఆడుతున్న భూమి అనే ఈ బరువైన పిండం దేవుడి కల. ........ మానవుడు తన స్వప్నచేతనలో, సకలజీవ సమన్వితమైన సృష్టికి పునఃకల్పన చేసి ప్రాణం పోసినట్టుగానే దేవుడు , తన మనస్సులోంచే సర్వ వస్తు సముదాయాన్నీ సృష్టిస్తాడు.

" ఈశ్వరుడు మొదట ఈ భూమిని ఒక భావంగా రూపొందించాడు..... తరవాత దానికి జీవం ఇచ్చాడు. పరమాణు శక్తీ ఆ తరవాత పదార్ధమూ పుట్టాయి. ..... భూసంబంధమైన అణువుల్ని సమన్వయపరిచి ఘనగోళాకృతిగా రూపొందించాడు.... దాని అణువులన్నీ దేవుడి సంకల్పం చేతనే దగ్గరగా కూడి ఉన్నాయి. ... ఆయన తన సంకల్పాన్ని ఉపసంహరించుకున్నప్పుడు భూమి అణువులన్నీ శక్తిగా పరివర్తనం చెందుతాయి..... అణుశక్తి, తనకు మూలకందమైన చైతన్యంలోకి తిరిగి వెళ్ళిపోతుంది.... భూభావం , స్థూలత్వంలో నుంచి అదృశ్యమవుతుంది. "
"దేవుడి ఆలోచన ఈ భూమిని సృష్టించి, ఆయన సంకల్పం దీన్ని నిలిపి ఉంచి, ప్రయోజనం తీరగానే దాన్ని అదృశ్యం చేయటం జరుగుతుంది..."...... ఇలాగే......... మనిషి, కళ్ళు మూసుకుని ఒక స్వప్న జగత్తును సృష్టిస్తాడు......... మేలుకోగానే అప్రయత్నంగానే దాన్ని కరిగించేస్తాడు........... .."...... ఈ విషయాలు ఒక యోగి ఆత్మ కధ గ్రంధములో చెప్పబడ్డాయి.



దైవం, ఆస్తికులు....నాస్తికులు ..


ఈ రోజుల్లో కొందరు నాస్తికులు ఏమంటున్నారంటే ,  సైన్స్ కు  దైవానికి, ఆస్తికులకు .. ఏమీ సంబంధం లేదంటున్నారు.  

  సైన్స్ అంటే కేవలం నాస్తికులకు మాత్రమే సంబంధించిన విషయం అన్నట్లు మాట్లాడటం ఏమిటి ? 

నాస్తికులు ఏమైనా ఈ సృష్టిని, అందులో సైన్స్ ను  సృష్టించారా? ప్రకృతి అంతటా సైన్స్  ఉన్నది. సైన్స్ అనేది అందరికీ సంబంధించిన విషయం. 

 సృష్టికర్త  దైవమే అసలైన శాస్త్రవేత్త. శాస్త్రవేత్తలలో దైవాన్ని నమ్మేవారూ ఉన్నారు.

ఆధునిక శాస్త్రాలలో ఉన్నదే విజ్ఞానం..  ప్రాచీనులు తెలియజేసిన  విజ్ఞానం   సైన్స్ కాదన్నట్లు కొందరు మాట్లాడుతున్నారు. 

 ప్రాచీన విజ్ఞానం అంతా ట్రాష్ ...ఆధునిక విజ్ఞానమే అసలైన విజ్ఞానం అనటం ...ప్రాచీన విజ్ఞానాన్ని,  ఆ విజ్ఞానాన్ని కనుగొన్నవారిని అవమానించటమే.
........................................
 
సృష్టి  ఎలా  ప్రారంభమయ్యింది ?  అనే  ప్రశ్నకు ,  దైవం  వల్ల   ప్రారంభమయ్యింది.  . అని  ఆస్తికులు   ఖచ్చితమైన   సమాధానం  చెప్పగలరు. 

సృష్టి  ఎలా  ప్రారంభమయ్యింది  ?  అనే  ప్రశ్నకు ,   సృష్టి దానికదే ప్రారంభమయిందని.. నాస్తికులు  అంటారు.

కొందరు నాస్తికులు  ఏమంటారంటే, దైవం  ఎలా ఉద్భవించారని   ప్రశ్నిస్తారు. 

  సృష్టి దానికదే  ప్రారంభమవటం సంభవమని  వారు నమ్ముతున్నప్పుడు.. 

 మరి,  దైవం తమకు తామే  ఉద్భవించలేరా....   

 సృష్టి దానికదే  ప్రారంభమయిందని  చెప్పే నాస్తిక భౌతికవాదులు... దైవం ఎలా  ఉద్భవించారని అడగటం విడ్డూరం.
.....................................

పదార్ధాల లక్షణాలను కనుగొని చెప్పే శాస్త్రవేత్తలే గౌరవనీయులైనప్పుడు, ఎన్నో పదార్ధాలను, మరెన్నింటినో సృష్టించిన  దైవం మరెంతో గౌరవనీయులు.
......................................

"Matter and energy cannot be created or destroyed " అనే సూత్రాన్ని .. గమనిస్తే శక్తి  మరియు పదార్ధం..ఎప్పుడూ ఉంటుందని తెలుస్తుంది.


నాస్తిక భౌతికవాదులు అంటున్నట్లు  సృష్టి ఆరంభంలో ఏమీ లేదనుకుంటే.. మరి , "Matter and energy cannot be created or destroyed "... అనే సూత్రం ప్రకారం నిత్యమూ ఉండవలసిన శక్తి, పదార్ధమూ ఏమైనట్లు? 

 ఒక విత్తనంలో మహావృక్షం దాగున్నట్లు ప్రపంచం అంతటా సూక్ష్మరూపంలో దాగుండే అవకాశం ఉందనిపిస్తుంది. 

 ప్రళయసమయంలో సృష్టి అంతా సూక్ష్మరూపంలో ఒదిగిపోవటం ,  తిరిగి సృష్టి ఆరంభ సమయంలో విత్తనం నుండి మహావృక్షం పెరిగినట్లు ప్రపంచం వ్యాపిస్తున్నదని అనుకోవచ్చు. 

ఇంతటి అద్భుతమైన విచక్షణతో కూడిన సృష్టి రచన జరగాలంటే  అద్భుతమైన ఆలోచనాశక్తి తప్పక అవసరం. ఆలోచన కూడా ఒక శక్తే. 

 దైవం యొక్క ఆలోచన కారణంగా ఇంతటి వైవిద్యభరితమైన సృష్టి రచన జరుగుతుంది. 
..........................................
 
ఆధ్యాత్మికవాదులు, ఆధునిక  శాస్త్రవేత్తలు  చెప్పేదాని  ప్రకారం.. పదార్ధాన్ని శక్తిని సృష్టించలేము,  నాశనం  చేయలేము  అని , తెలుస్తోంది కదా!

 ఇవన్నీ  రూపాలను  మార్చుకున్నా కూడా ఎప్పుడూ  విశ్వంలో   ఉంటాయని  తెలుస్తోంది.

అంటే, ఆద్యంతములు లేని  ఒక మహాశక్తి ఎప్పుడూ  ఉంటుందని  మనకు తెలుస్తోంది.  ఈ శక్తి  ఊహాతీతమైన అద్భుతమైన  ఆలోచనా శక్తి  కూడా ఉన్నశక్తి. ( ఆలోచన కూడా  ఒక శక్తే..  )

సృష్టిలో ప్రాణశక్తి , ఆలోచనాశక్తి నిత్యమూ ఉంటాయి. అన్ని శక్తులూ  కలబోసిన మహా శక్తినే  ఆస్తికులు  దైవం అని  భావిస్తారు. 

 మనిషి యొక్క భౌతిక శరీరంగురించి ఆధునికులు కొంతవరకూ చెప్పగలుగుతున్నారు కానీ ,  ప్రాణశక్తి.. ఆలోచనాశక్తి.. మనస్సు బుద్ది వంటి విషయాల గురించి  ఆధునికులకు తెలిసింది చాలా తక్కువ. 

సృష్టిలో  మనకు  తెలిసిన  విజ్ఞానం  సముద్రంలో  నీటిబొట్టంత  అయితే,  మనకు   తెలియని  విజ్ఞానం   సముద్రమంత,  ఇంకా  ఎక్కువ  కూడా. 
.................................

వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.  



Wednesday, January 24, 2018

మహాశక్తి అయిన పరమాత్మ ..సూర్యుడు .....


ఓం

అందరికి రధ సప్తమి శుభాకాంక్షలండి.


సూర్యుడు ప్రత్యక్ష పరమాత్మ.

దైవాన్ని చూపించండి ..... అని ఎవరైనా అడిగితే సూర్యుణ్ణి చూపించవచ్చు.

సూర్యుడు ఆరోగ్యప్రదాత అని పెద్దలు చెబుతారు.

దైవానికి వందనములు. 


************

* ఈ  క్రింద వ్రాసిన విషయాలు పైన  పోస్ట్ వేసిన కొంతకాలం తరువాత వ్రాసి, ఇక్కడ వేయటం జరిగింది.

Dwadasa Arya Surya Stuthi - YouTube...

 ఈ సూర్యస్తుతిని  యూట్యూబ్ ద్వారా అందించిన వారికి ధన్యవాదములండి. 

దైవానికి వందనములు. గురువులకు వందనములు. 

కొంతకాలం క్రితం ఏం జరిగిందంటే, నేను ఒకసారి  ఈ సూర్యస్తుతిని  గబగబా చదువుతున్నప్పుడు , 

 సూర్యస్తుతిలోని  11 వ శ్లోకం యొక్క తాత్పర్యం వద్ద  అధాటున ..గృహిణిని.. అని చదవటం జరిగింది.

 ఇదేమిటి? గృహిణిని..అని ఎందుకు ఉంటుందనే సందేహం వచ్చి పరీక్షగా చూస్తే... గృహణిని అని ఉన్నది. (గ్రహణి వ్యాధిని అని ..)

 ఏం జరిగిందంటే, నేను స్తోత్రాన్ని గబగబా చదువుతూ సరిగ్గా చూడకుండా తప్పుగా చదవటం జరిగింది. 

 నేను చదివినట్లుగా..  గృహిణిని అని  చదివితే  అర్ధం మారిపోతుంది  కాబట్టి,  ఇంకెవరూ  గభాలున  . . గృహిణిని.. అని తప్పుగా చదవకూడదనే అభిప్రాయంతో ఈ వ్యాఖ్యను వ్రాస్తున్నాను.

 ఈ వ్యాఖ్య వ్రాయటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. తప్పనిసరి పరిస్థితిలో వ్రాస్తున్నాను..  దయచేసి అపార్ధం చేసుకోవద్దని కోరుకుంటున్నానండి.


Monday, January 22, 2018

ఓం....



శ్రీ పంచమి  సరస్వతీ దేవి  అమ్మవారి పూజ  సందర్భంగా శుభాకాంక్షలండి. 

దైవానికి వందనములు.



 

Sunday, January 21, 2018

శాస్త్రీయ నిరూపణ.... టెక్నాలజీ.



నేను ఆధునిక శాస్త్రవిజ్ఞానానికి వ్యతిరేకిని కాదు. అయితే విజ్ఞానాన్ని ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవాలి అన్నది నా అభిప్రాయం.

కొందరు ఏమంటారంటే శాస్త్రీయంగా నిరూపణ అయితేనే ఏ విషయాన్నయినా నమ్ముతాము అంటారు.

ఆధునిక శాస్త్ర విషయాలు కొన్ని , ఒకసారి నిరూపణ అయిందని భావించాక కొంతకాలానికి ఆ విషయం పొరపాటు అని తేలుతోంది.

ఇలా పదేపదే మార్పులుచేర్పులు జరుగుతున్నప్పుడు శాస్త్రబద్ధంగా నిరూపించటం అనేది ఎప్పటికి జరుగుతుంది ?

అంతిమంగా ఏ విషయమైనా ఇదీ సత్యమని తేలినప్పుడే కదా ! అది నిజమని నిరూపణ అయ్యేది.

ఒకసారి సత్యం అని నిరూపణ అయ్యాక కొంతకాలానికి మళ్ళీ అది పొరపాటని మళ్ళీ కొత్త సత్యం కనుక్కుంటే ఇకఏది శాస్త్రీయమని నమ్మాలి?

అందరూ తెలియని వాళ్ళే అయినప్పుడు ఏది తప్పో ? ఏది ఒప్పో ? ఎవరు నిర్ణయిస్తారు ?

హేతువాదులు చెప్పే శాస్త్రీయత అంటే ఏమిటి ? ఏదైనా అంతిమంగా నిర్ధారణ అయినప్పుడే గదా నమ్ముతారు.

ఎప్పటికప్పుడు మారుతూ ఉండే విషయం .శాస్త్రీయంగా నిరూపణ అయింది అని ఎలా చెప్పగలరు ?

అలా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటూ, నిరూపణ నిరంతరాయంగా జరుగుతున్నప్పుడు దాన్ని ఎలా నమ్మాలి ?

........................

కొందరు నాస్తికులు ఏమంటారంటే , ఆస్తికులు కూడా ఈ నాటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు కదా ! అంటారు. 

మరి దైవం లేరనే నాస్తికులు కూడా ఆ దైవం ప్రసాదించే గాలిని పీల్చే బ్రతుకుతున్నారు.

వాళ్ళు తయారుచేసే అనేక వస్తువులు కూడా దైవసృష్టిలోని పదార్ధాలతో తయారుచేయబడినవే.

విమానాలు తయారుచేయటానికి ముందే పక్షులు గాలిలో ఎగురుతున్నాయి. నౌకలు తయారుచేయబడటానికి ముందే చేపలు నీటిలో ఈదుతున్నాయి.


సృష్టిలోని టెక్నాలజీని చూసి ఎంతో నేర్చుకుంటూ కూడా కొందరు ..... దైవం లేరు అంటారు. ఇది అన్యాయం.

ఈ నాటి టెక్నాలజీ లేకపోయినా ప్రాచీన కాలం నుంచీ ఆచారవ్యవహారాలు, పురాణేతిహాసాలు, ఇంకా ఎన్నో ప్రాచీన గ్రంధాలు ఇప్పటికీ అందుతూనే ఉన్నాయి. ఇక ముందూ కొనసాగుతాయి..
..............

కొందరు ఏమంటారంటే , మన దేశంలోని ప్రజల ఆలోచనాధోరణి వల్ల దేశం ఎంతో వెనకబడిపోయింది. ఇతరదేశాలు టెక్నికల్ గా ఎంతో అభివృద్ధిని సాధించాయి అంటారు.

ఆ దేశాలు మొదట అలా అభివృద్ధిని సాధించినట్లు కనిపించినా ఇప్పుడు చూడండి. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించిన దేశాలు అనుకున్న దేశాలు ఆర్ధికమాంద్యంతో ఇబ్బందులు పడుతున్నాయి.

మరి వారికి పారిశ్రామికాభివృద్ధి జరిగీ కూడా ఆర్ధికమాంద్యం ఎందుకువచ్చింది ?

...........
 
అభివృద్ధి చెందిన టెక్నాలజీతో గొప్పగా కట్టిన కట్టడాలను చూసినప్పుడు గొప్పగానే అనిపిస్తుంది.

అబ్బో ! మనుషులు ఎంత ఎదిగిపోయారు కొండల్ని కూడా పిండి చేయగలుగుతున్నారు అనిపిస్తుంది.

కానీ, అలా కట్టడానికి వెనుక ఎంత ఇనుము, ఎంత ఇసుక, ఎంత కంకర ఇలా ఎన్ని సహజవనరులు వాడారో కూడా తెలుసుకుంటే..కట్టడాలనే కాదు ఈ రోజుల్లో మనం వాడుతున్న వస్తువుల్లో చాలా మనకు అనవసరమైనవే.


ప్రాధమిక అవసరాలైన ఆహారం, వైద్యం, రక్షణ, విద్య, వసతి.........ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వటం మాని విలాసవంతమైన వస్తువుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నాము. అందువల్ల పేదరికం అలాగే ఉండిపోతూంది.

. మన పూర్వులు ఇలాగే విచ్చలవిడిగా సహజవనరులను వాడి ఉంటే , ఇప్పుడు మనకు ఇవేమీ ఉండేవి కాదు.

ఇలా అన్ని సహజవనరులను విపరీతంగా వాడేస్తే మనం మళ్ళీ ఇనుప గనులను, సృష్టించగలమా ? పిండి చేసిన కొండలను తిరిగి సృష్టించగలమా ?

కోరికలకు అంతెక్కడ ? మనిషి కోరికలను పెంచుకుంటూ పోతే భూమి లాంటి పది గ్రహాలలోని సహజవనరులైనా సరే సరిపోవు.

రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని అయినా మనం మన అలవాట్లను మార్చుకోవాలి.

************
 
ప్రకృతి ముందు మనిషి ఎంత ?

* దైవం అంటూ ఎవరూ లేరు..... మనిషే గొప్ప . అని ఎవరైనా భావించటం హనుమంతుని ముందు కుప్పిగంతులు వెయ్యటంలా హాస్యాస్పదం.

Wednesday, December 14, 2011

 

గ్రహణసమయంలో వచ్చే ప్రభావం గురించి...

 గ్రహణసమయంలో కొన్ని హానికారకకిరణాలు వెలువడతాయని  ప్రాచీనుల అభిప్రాయం కావచ్చు.

  గ్రహణ సమయములో దర్భ వాడమని ప్రాచీనులు తెలియజేసారు.

గ్రహణం సందర్భంగా పదార్ధాలపై దర్భను వేస్తారు.

 గ్రహణం తరువాత గృహాన్ని శుద్ధి చేసుకుంటారు.

దర్భలో రేడిఏషన్ తగ్గించే గుణం ఉందని  ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొన్నారట.


Darbha Grass or Kusha Grass blocks X-Ray & other Radiation..


Dharbha Kusa Grass Blocks X Ray Increases Phonetic Vibrations ...
.................................... 

సూర్యగ్రహణం సమయంలో సూర్యుణ్ణి డైరెక్ట్ గా చూడకూడదని , ప్రత్యేకమైన సాధనాల ద్వారా మాత్రమే చూడాలని, లేకపోతే కళ్ళకు ప్రమాదమని ఆధునిక శాస్త్రవేత్తలే చెబుతారు.

మామూలుగా గ్రహణం లేని సమయాలలో సూర్యుని చూడటం విషయంలో అన్ని జాగ్రత్తలు చెప్పరు.

ఈ విషయాన్ని గమనిస్తే సూర్యగ్రహణం సమయంలో ప్రత్యేకమైన కిరణాల శక్తి వెలువడుతుందని తెలుస్తోంది కదా ! 

**********************
కొందరు ఏమంటారంటే, గ్రహణసమయములో  తగు జాగ్రత్తలు తీసుకోకున్నా  తమకు అనారోగ్యం రాలేదని చెబుతారు.  


 కొ
న్నిసార్లు అనారోగ్యం బైట పడటానికి .. కొన్ని సంవత్సరాల సమయం కూడా పట్టవచ్చు.


ఉదా.. గ్రహణ సమయంలో ఎక్స్ రేస్, అల్ట్రా వయొలెట్ కిరణాలు రేడియేషన్ ఎక్కువగా విడుదల అవుతాయని కొందరు అంటున్నారు. 

రేడియేషన్ వల్ల కాన్సర్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

అయితే, కాన్సర్ వచ్చిందని గుర్తించటానికి కొందరిలో10 ఏళ్ళు పట్టవచ్చు. కొందరిలో 40 ఏళ్ళు కూడా పట్టవచ్చు.

అంటే , అల్ట్రావయలెట్ కిరణాల వల్ల రేడియేషన్ కు  గురయ్యి  కాన్సర్ వస్తే తెలియడానికి కొన్ని ఏళ్ళు  పట్టవచ్చు.

  గర్భంలో ఉన్న పిండం చాలా డెలికేట్ గా ఉంటుంది. కాబట్టి, తొందరగా రేడియేష న్ కు గురయ్యే ప్రమాదముంది.

గ్రహణ సమయంలో గర్భవతులు జాగ్రత్తలు తీసుకోకపోతే,  పిండం రేడియేషన్ కు గురయ్యి,  ఆ వ్యక్తి  పెద్దయ్యాక  కొన్నేళ్ళకు కాన్సర్ వచ్చినా ఆ జబ్బు ఎందుకు వచ్చిందనే విషయం ఎవరికీ తెలియదు.

ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రాచీనులు గర్భవతులకు  కొన్ని జాగ్రత్తలు చెప్పి ఉంటారు. 

జాగ్రత్తలు  మేము పాటించం .. అంటే ఎవరేం చెయ్యగలరు ? ఎవరి ఖర్మ వారిది అనుకోవటం తప్ప.  

అయితే, అందరి విషయంలోనూ ఒకేలా జబ్బులు వస్తాయని చెప్పలేం. వారివారి తట్టుకునే శక్తిని బట్టి పరిస్థితి ఉంటుంది.

  అనేక కారణాల వల్ల    ఈ రోజుల్లో కాన్సర్ వంటి   వ్యాధులు ఎక్కువయ్యాయన్నది  నిజం.

అనారోగ్యం రావటానికి , రాకపోవడానికి అనేక కారణాలుంటాయి.

ఉదా..   కొందరికి  వ్యాధులు తొందరగా వస్తాయి. కొందరికి రావు.   రెసిస్టెంట్ పవర్ ఎక్కువ ఉన్నవాళ్ళు తట్టుకోవచ్చు. 


అయితే చుట్టుప్రక్కల వైరల్ ఫీవర్లు ఉన్నప్పుడు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు.

అలాగే  గ్రహణ సమయంలో   వచ్చే మార్పులను తట్టుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తెలియజేసారు.  


గ్రహణసమయంలో ఆహారం తినకూడదని, గర్భిణులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసారు.

***************


 ప్రాచీనులు చెప్పిన ప్రతి విషయాన్ని వ్యతిరేకించటం కన్నా, వారు తెలియజేసిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.


అయితే,  సమాజంలో కొన్ని మూఢనమ్మకాలు, ఆచారవ్యవహారాలలో కొన్నిసార్లు  విపరీత ధోరణులు  ప్రవేశించాయి. 

ఇలాంటి వాటిని గమనించి విచక్షణతో నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. 

ఉదా..గర్భవతులు కాళ్ళు, చేతులు కదలకుండా నిటారుగా పడుకోవాలని ఈ  మధ్య  కొందరు చెబుతున్నారట.

గర్భవతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గానీ, కాళ్ళు చేతులు కదలకుండా నిటారుగా పడుకోవాలంటూ.. విపరీతధోరణితో ఆలోచించటం మూఢత్వం అవుతుంది.

************* 
గ్రహణము సమయములో గంగా స్నానము చేస్తారు కుదిరిన వాళ్ళు.

 గంగానది నీటిలో మలినాలను శుద్దిచేసే శక్తి ఎంతో ఎక్కువగా ఉందని ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొన్నారట.

Mystery Factor Gives Ganges a Clean Reputation : NPR


*******************

అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రం యొక్క ఆటుపోట్లలో హెచ్చుతగ్గులు ఉండటం తెలిసిన విషయమే. 

అమావాస్య, పౌర్ణమి రోజుల్లో నేరాలు ఎక్కువగా జరగటాన్ని కొందరు పోలీసులు అంగీకరించారు. ఈ విషయాన్ని వ్యతిరేకించే వారూ ఉన్నారు. 

డార్విన్ సిద్ధాంతం గురించి కూడా  శాస్త్రవేత్తలలోనే   అంగీకరించేవారూ, వ్యతిరేకించేవారూ ఉన్నారు. 

గ్రహణసమయంలో వచ్చే ప్రభావం గురించి ఇప్పటివరకు ఆధునిక విజ్ఞానం కనిపెట్టలేకపోవచ్చు. భవిష్యత్తులో కనుగొంటుందేమో ?

******************

అయితే,  కొందరు ఆధునికులు.. ప్రాచీనులు చెప్పిన విషయాలను హేళనగా మాట్లాడుతున్నారు. 

ఆధునిక విజ్ఞానానికి ముందే ప్రపంచంలో సైన్స్ ఉన్నది. 

సృష్టిలోనే సైన్స్ ఉన్నది. ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన దైవమే గొప్ప శాస్త్రవేత్త.