koodali

Friday, March 4, 2016

కొన్ని విషయములు...పాండవులు..దుర్యోధనాదులు...


 
పాండవులు సౌమ్యులు. పాండవులకు మొహమాటం, సహనం..వంటివి ఎక్కువగా ఉండటం వల్ల దుర్యోధనాదులు ఎప్పటికప్పుడు బ్రతికిపోయారు. 
 
 
చిన్నతనం నుంచి తమను దుర్యోధనుడు ఎన్ని బాధలు పెట్టినా పాండవులు ఎదురుతిరగలేదు. లక్క ఇల్లుదహనం చేసి తమను చంపడానికి ప్రయత్నించినా పాండవులు సహించారు. ఇంకా గంధర్వుల చేతిలో చావబోతున్న దుర్యోధనాదులను పాండవులు వెళ్ళి రక్షించారు.


మహాభారతయుద్ధానికి ముందు యుద్ధరంగంలో బంధువులను, పెద్దలను..చూసి వారందరితో తాను యుద్ధం చేయలేనని చెప్పగా.. శ్రీకృష్ణులవారు అర్జునునికి గీతాబోధతో కర్తవ్యాన్ని తెలియజేసారు.


అధర్మపరులు, దుర్మార్గులు, దుష్టులు, రాక్షసప్రవృత్తిగల దుర్యోధనుడు..వంటి వారి పట్ల అతిసహనం, అతిమంచితనం వంటివి పాటించటం సరైనది కాదని నాకు అనిపిస్తుంది. అయితే, ఎవరికైనా పాపం పండే రోజులు రావాలని కొందరు అంటారు.

దుష్టులు, దుర్మార్గులు పట్ల కొంతవరకు సహనం వహించి, వారు మంచిగా మారటానికి కొంత సమయం ఇవ్వవచ్చేమో కానీ, మరీ పరిస్థితి విషమించే వరకు వేచిఉండటం వల్ల ఏమి జరుగుతుందో చెప్పలేము.


కర్ణుడు తోడు లేకున్నాకూడా, దుర్యోధనుడు పాండవులను బాధలుపెడతాడు. అయితే, వానికి కర్ణుని సలహాలు కూడా తోడయ్యాయి. కర్ణుడు ఎలాంటివాడైనా, మహాభారతయుద్ధంలో దుర్యోధనాదులు మరణించడంలో కర్ణునిపాత్ర కూడా ఎంతో ఉంది.


కర్ణుడు దుర్యోధనుని పక్కనచేరి చెప్పిన కొన్ని సలహాల వల్ల కూడా దుర్యోధనుని నాశనం జరిగింది. ద్రౌపదిని నిండుసభకు లాక్కొచ్చి అవమానించటం, అభిమన్యుని అందరూ కలిసి వధించటం..పాండవులకు ఎంతో బాధను కలిగించే విషయాలు. 
 
 
ఇవన్నీ జరిగి.. మహాభారతయుద్ధంలో దుర్యోధనాదుల నాశనం జరగటంలో సూర్యపుత్రుడైన కర్ణుని పాత్ర ఎంతో ఉంది. అలా తనకు తెలియకుండానే దుర్యోధనాదుల వినాశనంలో కుంతిదేవి యొక్క ప్రధమపుత్రుడైన కర్ణునిపాత్ర చాలా ఉంది.


    స్నేహితులు తప్పులు చేస్తుంటే, మంచిస్నేహితులు మంచి సలహాలను ఇచ్చి సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా స్నేహితుని మెప్పుకొరకు, తమ పనులు జరగటానికి తప్పుడు సలహాలిచ్చేవారు మంచి స్నేహితులు కాలేరు. 
 
 
తాము చేసేది తప్పు అనికూడా కొందరు ఒప్పుకోకపోవచ్చు. తాము చేసేది సరైనది అని కూడా వారికి అనిపించవచ్చు.

   **************
 
ఇంకా నాకు ఏమనిపిస్తుందంటే, కర్ణుడు చేసినవాటిలో మంచిపనులు, చెడు పనులు ఉన్నాయి. ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో, అభిమన్యుని చంపే విషయంలో కర్ణుడు చేసినది ముమ్మాటికీ తప్పే.


ద్రౌపది విషయంలో వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నించటం ఎంతో దారుణం. అందరు పెద్దవాళ్లు ఉండి కూడా ఎవరూ ఆపలేకపోయారంటారు. పాండవులు కూడా
ఆపలేకపోయారంటారు. 

 
జూదంలో ద్రౌపదిదేవిని పణంగా పెట్టిన విషయంలో ద్రౌపది కొన్ని ప్రశ్నలు అడగటం జరిగిందని అంటారు. నిజంగా దాసి అయినా కూడా, వస్త్రాపహరణం చేయడానికి ఎవరికి హక్కు ఉండదు.


అభిమన్యుని విషయంలో అందరు కలిసి ఒక చిన్నవాడిని చంపటం ఎంతో దారుణం. ఇంకా,దుర్యోధనాదులు  పాండవులను చంపడానికి చిన్నప్పటినుంచి ఎన్నో ప్రయత్నాలు చేసారు. ఇన్ని అన్యాయాలను చేసిన  దుర్యోధనాదులను, కర్ణుని ..యుద్ధంలో ఎలా చంపినా దోషం లేదు.

***************

కర్ణునిలో కొన్ని మంచి విషయాలేమిటంటే, కవచకుండలాలను ఇంద్రునికి దానం చేసిన విషయంలో కర్ణుని దానగుణం గొప్పదే. చాలా దానాలుంటాయి. కానీ, ఎవరికైనా తమ ప్రాణం గొప్పది కదా. అలాంటప్పుడు పుట్టుకతో వచ్చిన కవచకుండలాలను కోసి ఇవ్వటం గొప్ప విషయమే.


కర్ణుని వద్దకు కుంతిదేవి వెళ్లి తాను అతని తల్లినని, పాండవులను యుద్ధంలో చంపవద్దని అడిగిన తరువాత, కర్ణుని ప్రవర్తన  హుందాగా ఉంది. 
 
తాను కుంతి పుత్రుడునని జరిగిన విషయమంతా లోకానికి తెలియేజేస్తే కధ వేరేలా ఉండేది. కర్ణుడు తల్లి విషయాన్ని లోకానికి వెల్లడి చేయలేదు.  
 
 ********
 
మనిషి మనస్సు ఒక క్లిష్టమైన వ్యవస్థ. ఏ మనిషి ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో ఎవరికీ తెలియదు. ఎవరి మనస్సులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. 
 
ఎవరినైనా, వారు చేసే పనులను పైపైన చూసి వారి మనస్సులోని విషయాలను సరిగ్గా పూర్తిగా గ్రహించటం కష్టం.


 **************

కుంతిదేవి కర్ణుని పసిబిడ్డగా పెట్టెలో పెట్టి నీటిలో వదిలేసినట్లు అంటారు.అప్పుడు నిజంగా ఏం జరిగిందో కానీ, కొన్ని విషయాలలో నాకు ఏమనిపిస్తుందంటే, పెద్దవాళ్ళు చేసినదానికి పసిబిడ్డ ఎందుకు కష్టాలను అనుభవించాలి? 
 
కుంతీదేవి తాను ధైర్యంగా బిడ్డను పెంచుకోవచ్చు. అయితే, లోకానికి భయపడి తాను పెంచలేక పసిబిడ్డను వదిలేయటం జరిగింది...బిడ్డను వదిలిన తరువాత కుంతీదేవి అలా చేసినందుకు ఎంతో బాధపడింది. 
 
 
కారణాలేమైనా, ఈ రోజుల్లో ఎవరూ కూడా బిడ్దలను అలా వదిలేయటం చేయకూడదని ఈ సంఘటన ద్వారా నేర్చుకోవాలి.


ఇంకా, పాండవులు మత్సయంత్రం సంఘటన తరువాత ద్రౌపదిని తీసుకుని ఇంటికి వచ్చినప్పుడు, ఇంట్లో ఉన్న కుంతీదేవికి పాండవులు ద్రౌపదిని తీసుకువచ్చినట్లు తెలియక, పాండవులు తీసుకువచ్చినదాన్ని అందరూ పంచుకోండి ...అనటం జరిగిందట.
 
 అప్పుడు, పాండవులు తాము తీసుకు వచ్చింది పదార్ధాన్ని, వస్తువును కాదని చెప్పాలి. తల్లి తెలియక అన్న మాటను పట్టుకుని అందరూ ద్రౌపదిని వివాహం చేసుకోకుండా ఉంటే బాగుండేదనిపిస్తుంది.

ఎవరైనా, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేం. కొన్నిసార్లు తమ ప్రవర్తన ఎలా ఉందో..ఆ వ్యక్తికి కూడా అర్ధంకాకపోవచ్చు. ఏ విషయాలైనా దైవానికే తెలుస్తాయి.
   
దైవం నడిపించిన మహాభారతగాధ అద్భుతం, పరమాద్భుతం. ఏ విషయం ఎందుకు జరిగిందో దైవానికే తెలుస్తుంది.

******************
marikonni vishayamulu 
 
Link...
 
 
 

No comments:

Post a Comment