koodali

Wednesday, August 14, 2024

ప్రపంచంలో మతాల పేరిట, అధికారం పేరిట, సంపదల...



 ప్రపంచంలో మతాల పేరిట, అధికారం పేరిట, సంపదల గురించి ఎన్నో పోరాటాలు, రక్తపాతాలు జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఎంతో బాధాకరమైన విషయం. దైవం అంటేనే శాంతి. అలాంటి దైవం పేరిట రక్తపాతాలు, మారణహోమాలు జరగటం ఏమిటో అర్ధంకాదు.

 మతాల పేరుతో క్రూరంగా ప్రవర్తిసున్నవారు దైవం వద్ద తప్పక శిక్షను పొందుతారు.


అధికారం, సంపద కొరకు మతాలను
కూడా  స్వార్ధపూరితంగా వాడుకుంటారనిపిస్తుంది.  ఇలాంటివారు   సామాన్యప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మిస్తారు. వాళ్ళ మాటలు నమ్మిన జనాలు ...వారు ఏం చెపితే అది చేస్తారు. ఇది బాధాకరం.  ప్రజలు విచక్షణతో ఆలోచించాలి. 

అభద్రత భావం, తమ మాటే నెగ్గాలనే పట్టుదల ..వంటి లక్షణాల వల్ల ..కుటుంబాలలో కానీ, సమాజంలో కానీ గొడవలు వస్తుంటాయి. 

 

పాతకాలంలో యుద్ధాలలో కూడా కొన్ని నియమాలు ఉండేవి. యుద్ధంలో స్త్రీలకు, పిల్లలకు, అమాయకులైన వారికి హాని చేయకూడదని నియమాలతో భారత దేశంలో  యుద్ధాలు చేసేవారు. అక్కడక్కడా కొన్ని నేరాలు జరిగినా కూడా,  ఎక్కువ హింస ఉండేదికాదు. విదేశీ దాడులలో మాత్రం  పెద్ద ఎత్తున దాడులు జరిగాయి.



గతకొంతకాలంగా ప్రపంచంలో జరుగుతున్న 
హింస  చాలా బాధగా ఉంది.   పిల్లలు, స్త్రీల పట్ల,  మగవారి పట్ల  .. దారుణాలు  చేయటం ఏమిటో?     వాళ్లు మనుషులేనా? అనిపిస్తుంది. అలాంటి వాళ్లను ఏం చేసినా పాపం ఉండదు. అలాంటి దారుణాలు చేసిన  వారికి  దైవం సరైన బుద్ధి తప్పక చెబుతారు.

 

సనాతనధర్మం, హిందువులు బాగుండాలని  కోరుకుంటున్నాను.

  ఏ దేశానికి చెందినవాళ్ళైనా, ఏ మతానికి చెందిన వాళైనా అమాయకులు, మంచివాళ్ళు  బాగుండాలని కోరుకుంటున్నాను.  ఏ దేశానికి చెందినవాళ్ళైనా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా  వారి చెడ్డతనం  ...నాశనం అవ్వాలని కోరుకుంటున్నాను.   (వారి చెడ్డతనం పోని పరిస్థితిలో ఆ చెడ్డవాళ్లు నాశనం అవ్వాలని కోరుకుంటున్నాను.)


లోకకల్యాణం కొరకు పాతకాలంలో యజ్ఞయాగాదులు చేసేవారు. ఈ రోజుల్లో 
చాలావరకు   కల్తి వస్తువులు ఉన్నాకూడా, వాటితోనే యజ్ఞయాగాదులు చేస్తే ఎంతోకొంత ఫలితం తప్పక ఉంటుంది.



 ప్రపంచంలో శాంతి నెలకొనాలని , అంతా బాగుండాలని అందరూ మనస్పూర్తిగా దృఢంగా దైవాన్ని ప్రార్ధించాలి. 
దైవాన్ని, దైవనామాన్ని అందరూ స్మరించుకోవాలి.

 

 ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా,  నీతినియమాలను పాటించనివారిని మనం ఏం చేయగలం?   వారి సంగతి దైవం చూసుకుంటారు.

 కొందరైనా నీతినియమాలతో దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ ..దైవాన్ని ప్రార్ధిస్తే.. ఆ ఫలితం వల్ల దైవకృప కలిగి.. సమాజంలో శాంతి నెలకొనే అవకాశముంది.



ఆధునికకాలంలో చాలామందిలో అత్యాశ,  పాపాలు చేసి  అయినా డబ్బు సంపాదించాలనే తత్వం పెరిగాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. డబ్బు, అధికారం..కొరకు ఎన్నో పాపాలు చేస్తున్నారు. సామాన్యజనం కూడా తమ వంతు పాపాలు చేస్తున్నారు. వీటి ఫలితాలే ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తోంది.

 

సోషల్మీడియాలో హింసాత్మక దృశ్యాలు, చెడ్ద విషయాలు వల్లకూడా చాలామంది ప్రభావితులవుతున్నారు. 


ఎవరైనా ఘోరమైన నేరాలు చేస్తే వారిని కఠినంగా   శిక్షించేలా చట్టాలు ఉండాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే,  ఎవరైనా నేరాలు చేయాలంటే ..భయంతో వణికిపోయేలా ఉండాలి.    హింసతో కూడిన ప్రసారాలకు, సమాజానికి హాని కలిగించే వ్యవహారాలకు.. ప్రభుత్వాలు సమర్ధవంతంగా అడ్డుకట్ట వేయాలి.   ప్రభుత్వాలు ఎప్పుడు ఇవన్నీ చేస్తాయో అర్ధం కావటం లేదు.

 

 ఎవరైనా మనకు ఆపద కలిగించాలని చూస్తే, భయపడి కూర్చోము కదా..మన రక్షణ కొరకు ఎంతకైనా పోరాడుతాము.  ఎవ్వరైనా తమకు ఆపదలు సంభవించినప్పుడు అధైర్యపడకుండా, దైవాన్ని నమ్మి ఆ ఆపదల నుంచి రక్షించుకోవాలి. శత్రువులను ఎదుర్కుని గెలవాలి.
 


ఆ మధ్య ఒక పేరుపొందిన జ్యోతిష్కుడు చెప్పినదాన్ని బట్టి ఆధునిక కాలంలో జీవ హింస చేయటం బాగా పెరిగింది. పశుపక్ష్యాదులను చంపి తినటం విపరీతంగా పెరిగింది. అలా చనిపోయిన జీవుల ఉసురు తగిలి కూడా ప్రపంచంలో కష్టాలు వస్తున్నాయని వారు తెలియజేసారు. 

 

మనుషులకు జరుగుతున్న హింస పట్ల మనకు ఇంత బాధ ఉన్నప్పుడు, జంతువుల పట్ల మనం చేస్తున్న హింస గురించి కూడా మనము ఆలోచించాలి.


కారణాలేమైనా కూడా, ప్రపంచంలో జరుగుతున్న 
ఘోరాలు వింటుంటే,  చూస్తుంటే ..భరించలేని బాధగా ఉంది. రాక్షసమూక పట్ల సౌమ్యత, సహనం పనికిరాదు. ఎలాగైనా ఈ ఘోరాలు ఆగాలి.   ఇక దైవమే దిక్కు. 


అయితే, అంతా దైవం మీదే భారం వేసి కూర్చోవటం కాకుండా, దారుణాలు ఆగడానికి అందరూ తమవంతు ప్రయత్నం చేయాలి. 

అంతా దైవం దయ .

******************

  ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో శుభాలు జరిగాయి. అశుభాలు కూడా జరిగాయి. యుద్ధాలు, రక్తపాతాలు జరిగినప్పుడు అమాయకులైన పిల్లలు, మంచివారైన పెద్దవాళ్లు కష్టాలు పడుతున్నప్పుడు ఎంతో బాధనిపిస్తుంది. దైవం చెడ్దవారిని శిక్షించి, ఆ దారుణాలను ఆపితే బాగుంటుంది కదా ..అనిపిస్తుంది. పురాణేతిహాసాలలో దైవం.. రాక్షసులను చంపివేసి లోకాన్ని రక్షించిన సంఘటనలు గురించి మనం తెలుసుకోవచ్చు.


 అయితే, ఏది ఎందుకు జరుగుతుందో చాలాసార్లు అర్ధం కాదు. మహాభారతంలో శ్రీకృష్ణులవారు..తమ గురువుయొక్క మరణించిన పుత్రులను తీసుకువచ్చి ఇచ్చారు. కానీ, యుద్ధంలో అభిమన్యుని రక్షించలేదు. లోకంలో కూడా చాలా విషయాలు మనకు అర్ధం కావు.  

  మనలో చాలామంది జీవితంలో...దైవం ఉన్నారని చక్కగా అనుభవంలోకి వచ్చిన సంఘటనలు ఉంటాయి.  దైవాన్ని నమ్మి.. ధర్మబద్ధంగా జీవించాలి.

No comments:

Post a Comment