koodali

Wednesday, April 13, 2016

ఆది పరాశక్తి కధలు...రెండవ భాగము ..


ఓం....

మహిషాసుర మర్దిని అమ్మవారు ...............


ఒకప్పుడు మహిషాసురుడు రాక్షుసులకు చక్రవర్తి అయ్యాడు. అతడు దేవేంద్రుని జయించి స్వర్గాధిపత్యాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. దిక్పాలకులు, దేవతలు అందరూ అతని ఆజ్ఞకు వశులయ్యారు.


మహిషాసురుడు చేసే అన్యాయములు భరించలేక , దేవతలందరూ బ్రహ్మదేవునితో కలిసి శివకేశవులను దర్శించుకొని తమ బాధలు చెప్పుకొన్నారు. మహిషాసురుని దుర్మార్గాలు వివరించారు.


ఆ తరువాత వారందరి అంశాలతో ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆ మహాశక్తి సర్వాలంకారములతో, సమస్త దివ్యాయుధములతో సాక్షాత్కరించింది. ఒక్కసారి మహాభయంకరముగా వికటాట్టహాసం చేసింది. ఆ తల్లిని దివ్యులంతా స్తుతించారు.


రాక్షసులకు ఆ భయంకరారావం గుండెల్ని బ్రద్దలు చేసేదిగా అనిపించింది. రాక్షసులు ఆయుధాలు ధరించి మహిషుని వెంట యుధ్ధానికి బయలుదేరారు. జగన్మాతను చూశాడు మహిషాసురుడు. ఇరుపక్షాలకు పోరు ప్రారంభమయింది.


చిక్షురుడు- తామ్రుడు- బిడాలుడు- అసిలోముడు మొదలైన రాక్షసులు నూతన వ్యూహ రచనలతో యుధ్ధం ప్రారంభించారు. ఎందరో రాక్షస వీరులు హతులయ్యారు.

జగన్మాత సింహవాహనాన్ని అధిరోహించింది. సింహగర్జనలతో, రాక్షసవీరుల అరుపులతో, రణరంగం భయంకరంగా ఉంది. సింహం రక్కసుల రక్తం త్రాగుతూ జూలు విదిలిస్తోంది. రాక్షసులు ప్రాణభీతితో అరుస్తూ ఉంటే, దేవతలు దేవి మీద పూలవాన కురిపిస్తున్నారు.

ఎందరో రాక్షసులు దేవి చేతిలో హతులయ్యారు.

ఈ దృశ్యం చూసి మండిపడ్డాడు మహిషాసురుడు. మహిష (దున్నపోతు ) రూపం ధరించాడు. కాలిగిట్టలతో నేల తట్టాడు. కొమ్ములతో పర్వతాలను బంతుల మాదిరిగా ఎగురగొట్టాడు. వాడి భయంకర రూపానికి ప్రకృతి కంపించింది.


మహిషుణ్ణి పాశంతో బంధించింది శ్రీదేవి. వాడు వెంటనే మహిష రూపం విడిచి రాక్షసాకారం  ధరించాడు. భయంకరారావం గావించాడు. అంతలో దేవి ఒక్కసారిగా మహిషుడిని   క్రింద పడవేసి పాదంతో త్రొక్కి పెట్టి ,శూలంతో గుండెల్లో పొడిచి సంహరించింది.


మహిషాసురుని సంహారాన్ని కళ్ళారా చూసిన మిగిలిన రాక్షస సైన్యం హాహాకారాలు చేస్తూ పాతాళానికి పారిపోయారు. దేవతలు ఆనందించి మహాదేవిని స్తుతించారు.



అంబా! నీ శక్తితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమతమ విధుల్ని నిర్వహించగలుగుతున్నారు. నువ్వు కీర్తివి, మతివి, స్మృతివి, గతివి, ధృతివి, కరుణవు, భయవు, శ్రధ్ధవు, వసుధవు, నువ్వే. .కమల, విజయ, గిరిజ, రమ, ఉమ, జయ మొదలైన నామాలతో కీర్తికెక్కిన దానివి నువ్వే. నువ్వు తుష్టివి, పుష్టివి, బుధ్ధివి, విద్యా, క్షమా, కాంతి, మేధలు నువ్వే. నీ ధారణా శక్తి వలన నాగకూర్మాలు భూమిని మోస్తున్నాయి. నీ స్వాహా శక్తి వలన యజ్ఞ హవిస్సులు దేవతలకు లభిస్తున్నాయి. 


తల్లీ ! నువ్వు అందరికీ భోగభాగ్యాలు ప్రసాదిస్తావు. వాగ్దేవతవై విద్యను అనుగ్రహిస్తావు. జనుల ఆర్తిని తొలగిస్తావు. నిన్ను నిరంతరం ధ్యానించేవారికి గర్భశోక రహితమైన మోక్షఫలాన్ని అందిస్తావు.



మాతా ! ఈ భువన చక్రాన్ని కారుణ్యవీక్షణంతో నడిపించే నీ నిజతత్వం వేదాలకే అర్ధం కాదు. మరి అన్యులకెలా బోధపడుతుంది .


మాతా ! మహోగ్రుడూ, భువన కంటకుడూ అయిన మహిషాసురుణ్ణి సంహరించి మమ్మల్ని అనుగ్రహించావు. మేము ధన్యులం. సర్వశరణ్యాలైన నీ పదపంకజాల మీద మాకు అచంచలమైన భక్తిని ప్రసాదించు. ఈ శరీరం (వృక్షం ) రెండు పక్షులకు ( జీవాత్మ, పరమాత్మ )ఆశ్రయం. వాటి సఖ్యం అవి భాజ్యం. వాటిమధ్య మూడోదానికి స్థానం లేదు. అటువంటప్పుడు జీవుడు నిన్ను ఎలా విడిచిపెడతాడు ? అలాగే మేము నిన్నెప్పుడూ సేవిస్తూనే ఉంటాము. మమ్మల్ని కరుణించి రక్షించు తల్లీ !


దేవతలు చేసిన స్తుతికి దేవి సంతోషించి మృదుమధుర వాక్కులతో- "దుస్సాధ్యమూ దుర్ఘటమూ అయిన కార్యం ఎప్పుడైనా సంభవించినప్పుడు నన్ను స్మరించండి. మీ ఆపదల్ని వెంటనే హరిస్తాను. " అని అభయమిచ్చి దేవి అంతర్ధానమయ్యింది.



Monday, April 11, 2016

ఆదిపరాశక్తి కధలు....


ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం మీద ఆదిశేషునిపై పవళించి యోగనిద్రలో ఉన్నారు. 


 అప్పుడు విష్ణుమూర్తి చెవులలోని గులివి నుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారిద్దరూ మహా బలవంతులు.

వారు శక్తిస్వరూపిణి అయిన పరాశక్తిని గురించి తపస్సు చేసి స్వేచ్చామరణమును వరముగా కోరుకొన్నారు.

 ఆ వరగర్వముతో రాక్షసులిద్దరూ బ్రహ్మ మీద దాడి చేశారు. బ్రహ్మదేవుడు విష్ణువు శరణుజొచ్చారు.

మధుకైటభులు విష్ణుదేవుని తమతో యుధ్ధము చేసి గెలవమన్నారు. వారు ఒకరితర్వాత ఒకరు అలసట తీర్చుకుంటూ విష్ణుమూర్తితో యుధ్ధము చేశారు.

విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేకపోయింది.

అప్పుడు మధుకైటభులు , "నీవు పరాక్రమశాలివే, అలసిపోయినట్లున్నావు. దాసోహమన్నచో నిన్ను విడిచిపెడతాం. కాదంటే నిన్ను సంహరించి తర్వాత ఈ బ్రహ్మదేవుని పని పడతాం " అన్నారు.

 అప్పుడు విష్ణువు, నేను అలసిపోయాను. కొంత విశ్రాంతి తీసికొన్న పిమ్మట మళ్ళీ మీతో యుధ్ధం చేస్తాను " అన్నారు.

మళ్ళీ యుధ్ధం ప్రారంభమయ్యింది. విష్ణువు యోగమాయను నుతించాడు. యోగమాయ విష్ణువును అనుగ్రహించటం జరిగింది.

యుధ్ధసమయములో యోగమాయ గగనతలంలో రాక్షసులకు దర్శనమిచ్చి వారివైపు తన మాయా దృష్టిని ప్రసరించటం జరిగింది.

ఆ చూపులకు మధుకైటభులు   తమనుతాము   మరచిపోయారు.

ఆ సమయములో విష్ణువు , "గతములో నేను ఎంతోమంది రాక్షసులను వధించాను. నాతో ఇంతకాలం యుద్ధం  చేసినవారు మీరు తప్ప మరొకరు లేరు. కనుక ఏదైనా వరము కోరుకొనుడు ఇస్తాను " అన్నారు.

పరవశులై, మదోన్మత్తులై యున్న ఆ దానవులు, "మేము యాచకులము కాదు. నీవే కోరుకో వరం, ఇస్తాము." అన్నారు.

అపుడు  శ్రీ మహావిష్ణువు, మీరిద్దరూ నా చేతిలో మరణించాలి: అన్నారు.

 వారు ఆశ్చర్యపోయారు. తెలివిగా మోసగింపబడ్డామని గ్రహించారు. లోకమంతా జలమయంగా ఉండడం చూసి , మమ్మల్ని నిర్జలప్రదేశంలో సంహరించు అన్నారు.

విష్ణువు రాక్షసుల్ని తన తొడలమీద నొక్కిపెట్టి సుదర్శన చక్రంతో వారి తలలు నరికారు. ఆ తలలనుండి మేధస్సు {మెదడు} బయటకు వచ్చి నీటి మీద తేలింది. మధుకైటభులిద్దరూ మరణించారు.

మేధస్సు ఆవరించిన జలభాగం మేదిని {భూమి } అయింది. అందుచేతనే మట్టి తినకూడదంటారు.



Friday, April 8, 2016

ఓం...



ఓం 

  శ్రీ దుర్ముఖి నామ సంవత్సరము సందర్భముగా........  

 అందరికి ఉగాది శుభాకాంక్షలండి.

వసంత నవరాత్రులు ప్రారంభమయ్యాయి.




Wednesday, April 6, 2016

ఐ టీ తో పాటు ఇతర రంగాలను కూడా ప్రోత్సహించాలి.

ఈ రోజుల్లో ఉపాధి అవకాశాల విషయంలో గందరగోళం నెలకొని ఉంది. చాలామంది ఐటీ రంగం అభివృద్ధి చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. అది నిజమే కావచ్చు.


 అయితే ఇప్పటికే ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువత అభిప్రాయాలను గమనిస్తే చాలామంది  తమ ఉద్యోగాల పట్ల అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. 

ఐటీ ఉద్యోగాలతో జాబ్ సెక్యూరిటీ లేదని వాళ్లు అంటున్నారు.  చాలామంది  ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి ఎదుర్కుంటున్నారు. 


కొందరి విషయంలో నైట్ షిఫ్ట్ లో పనిచేయటం వలన ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి. అనారోగ్య సమస్యలూ వస్తున్నాయి. ఇలాంటి కారణాల వల్ల చాలామంది  ఇంజనీరింగ్ చదివిన వారు మరియు ఐటీ ఉద్యోగులు కూడా బ్యాంకింగ్ మొదలైన ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.


 బ్యాంకింగ్  రంగంలో కూడా  ఉద్యోగ వత్తిడి, బదిలీ సమస్యలు ఉన్నా కూడా జాబ్ సెక్యూరిటి ఉంటుందనే ఉద్దేశంతో  అలా ఇష్టపడుతున్నారు. 

ఇంజనీరింగ్ చదివిన వాళ్లలో చాలామంది పరిస్థితి ఇలా గందరగోళంగా తయారయ్యింది.  ఇంజనీరింగ్ చదవని వారికీ  ఉపాధి అవకాశాలు లభ్యమయ్యేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. 


ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి  ఇంజనీరింగ్ చదివిన వారికి ఉపాధి కల్పించినంత మాత్రాన నిరుద్యోగ సమస్య తీరిపోదు. దేశంలో వేరే రంగాలు ఎన్నో ఉన్నాయి.


పాతకాలంలో  ఎన్నో వృత్తులు  ఉండేవి. కాలేజీల్లో చదువుకోకపోయినా  ఇంటిపట్టున ఉండి పెద్దవాళ్ల ద్వారా వృత్తివిద్యలు  నేర్చుకుని ఉపాధి పొందే వ్యవస్థ ఉండేది.

 అప్పుడు ఉపాధి కోసం ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి ఎక్కువమందికి ఉండేది కాదు. ఈ రోజుల్లో ఉపాధి పొందాలంటే బోలెడు డబ్బు కట్టి చదువుకోవటం.. తరువాత ఉద్యోగం వెదుక్కోవటం అనే పరిస్థితి ఉంది. 

 ఎందరో ప్రజలు సరైన ఉపాధి లభించక ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలసలు వెళ్లటం జరుగుతోంది. 

 చాలామంది  ఉపాధి కోసం గల్ఫ్ వంటి దేశాలకు తరలివెళ్తున్నారు. వెళ్ళి అక్కడ కష్టాలు అనుభవిస్తున్న వారూ ఉన్నారు. ఇలా వెళ్ళే వారిలో ఎందరో వలస కూలీలు కూడా ఉన్నారు.


ప్రజలు వేరే దగ్గరకు వలసలు పోవలసిన పరిస్థితి ఉండటం , రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండటం.. అభివృద్ధి అనిపించుకోదు.

 ప్రభుత్వాలు ..  ఐ టీ  తో  పాటు   ఇతర రంగాలను కూడా ప్రోత్సహించాలి. ఐటీ రంగాన్ని మాత్రమే  అభివృద్ధి చేయటం వలన నిరుద్యోగ సమస్య పరిష్కారమవదు.

 ఎవరి రాష్ట్రాన్ని వారు, ఎవరి దేశాన్ని వారు అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే  ప్రజలు  ఇతర  రాష్ట్రాలకు , ఇతర దేశాలకు వలసపోయే పరిస్థితి తగ్గుతుంది.

 
ఎక్కడెక్కడినుంచో వచ్చి కొందరు, చిన్న, పెద్ద వ్యాపారాలు చేసి సంపాదించుకుంటున్నారు. స్థానిక యువత మాత్రం ఐటీ అంటూ విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. 
 
అక్కడ కంపెనీలు అప్పుడప్పుడు ఉద్యోగాలు తీసివేస్తామంటారు. ఆ భయంతో విపరీతంగా పనిచేస్తున్నారు.ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందోననే భయంతో విపరీతంగా పనిచేయటం వల్ల ఆరోగ్యసమస్యలు, కుటుంబాల్లో సమస్యలు వస్తున్నాయి. 

స్వదేశంలో వ్యాపారం, వ్యవసాయం కూడా చేసేలా యువతను పెద్దవాళ్లు ప్రోత్సహించాలి. పెద్దవాళ్లు కూడా తమపిల్లలు విదేశాలకు వెళ్లి స్థిరపడటమే గొప్ప అనుకోకూడదు.  వ్యాపారం చేయటం చిన్నతనం అని, కష్టం అని అనుకోకూడదు.

విదేశాల నుంచి అక్రమవలసలు నిరోధించాలి. స్థానికులకు పని కల్పించాలి. తలచుకుంటే ఎన్నో పనులు కల్పించవచ్చు.
.......................

నల్ల డబ్బు కూడబెట్టిన ధనవంతుల ఆస్తులను జాతీయం చేసినప్పుడు దేశానికి సంపద తిరిగి లభిస్తుంది.

 సంపద ఉన్నప్పుడు ఎన్నో ఉద్యోగాలను సృష్టించుకోవచ్చు. తద్వారా నిరుద్యోగ సమస్య తీరి దేశం అభివృద్ధి చెందుతుంది. 


Monday, April 4, 2016

మన దేశీయుల ప్రతిభను మనమూ ప్రోత్సహించాలి...గాలితో నడిచే వాహనం ...

 
 
మన దేశంలో ఎందరో ప్రతిభావంతులున్నారు. అయితే వారి ప్రతిభకు సరైన ప్రోత్సాహం  లభించటం లేదు. అందుకే చాలామంది  విదేశాలకు వెళ్తున్నారు.

 విజ్ఞాన శాస్త్రంలో ఈ మధ్య జరుగుతున్న ఆవిష్కరణలలో భారతీయులు  ఉండటం హర్షించదగిన విషయం.


 అయితే విదేశాలకు వెళ్లిన తరువాత కాకుండా ఇక్కడే వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే బాగుంటుంది. 


ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి గాలితో నడిచే వాహనాన్ని కనిపెట్టినట్లు వార్తలు వచ్చాయి.


 ఇంధన సమస్యలు ఉన్న ఈ రోజుల్లో ఇది ఎంతో గొప్ప ఆవిష్కరణ.  అయితే , వార్తలలో చెప్పటం వరకే జరిగింది కానీ, ఆ ఆవిష్కరణకు ఏమీ ప్రోత్సాహం ఉన్నట్లు లేదు. 


ఇదే విషయాన్ని  ఎవరైనా విదేశాల వాళ్లు కనిపెడితే ఎంతో గొప్పగా మెచ్చుకుంటారు. 


ఈ మధ్య కాలంలో  భారతదేశంలో  యువత ఎన్నో కొత్త విషయాలు కనుగొంటున్నారు. అయితే మన వాళ్ళకు సరైన ప్రోత్సాహం ఉండటం లేదు. 


టెక్నాలజీ కోసం బోలెడు ఖర్చు పెట్టి విదేశాలపై ఆధారపడటం కన్నా మన యువతను ప్రోత్సహిస్తే ఎన్నో కొత్త విషయాలను కనుగొంటారు. 


 పాత కాలంలో జగదీశ్ చంద్ర బోస్ అనే భారతీయ శాస్త్రవేత్త ఎన్నో గొప్ప విషయాలను కనుగొన్నారు. అయితే వారికీ  మనదేశంలో సరైన ప్రోత్సాహం లభించలేదనిపిస్తుంది .  


విదేశాల వాళ్ళు మన యువత యొక్క ప్రతిభను మెచ్చుకుంటూ ....తమ దేశ అభివృద్ధి కొరకు భారతీయ ప్రతిభ అవసరం అని చెబుతున్నారు.


 మన దేశీయుల ప్రతిభను మనమూ ప్రోత్సహించాలి.




RTC Driver David Raju Invents Vehicle runs With Air in ...








Saturday, April 2, 2016

శని శింగణాపూర్...



శ్రీ శని భగవానుని దేవాలయం శని శింగణాపూర్ గురించి ఈ లింక్ వద్ద..చూడగలరు..


Shri Shaneshwar Devasthan Shanishingnapur's legend in ...





Friday, April 1, 2016

రాష్ట్ర విభజన .... తరువాత..

 
 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు విద్యాసంస్థలను మరియు కొన్ని నిర్మాణాలను  ఏర్పాటు చేయటంలో సహకరిస్తోంది. నిధులను ఇస్తోంది. ఇందుకు వారికి కృతజ్ఞతలు. 
...........................

ఝై ఘొత్తిముక్కల గారు..
రాష్ట్ర విభజన .... తరువాత..  టపా గురించి మీరు వ్రాసిన వ్యాఖ్యకు  నిన్ననే సమాధానం రాద్దామనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల వీలు కుదరలేదు. ఈ రోజు రాస్తున్నాను.

   హైదరాబాద్ తో కూడిన తెలంగాణా ఏర్పడిన తరువాత మీరు సంతోషంగా ఉండవచ్చు కదా !  హైదరాబాద్ ఆదాయం తో తెలంగాణా మిగతా భాగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.

 రాజధాని కూడా లేక  ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నిధులు ఇవ్వకూడదని  మీరు  అనటం దారుణం.

రాజధాని ఉన్న బీహార్ కే స్పెషల్ పాకేజ్ పేరిట  చాలా నిధులు కేటాయించారు.అప్పుడు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు కదా! 

రాజధాని కూడా లేక ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇస్తుంటేనే అభ్యంతరం చెబుతారేమిటి ?

ఆర్ధికంగా వెనుకబడి ఉన్న కారణంతో స్పెషల్ స్టేటస్ ఇవ్వవచ్చు. 

  ఇవ్వలేమనుకుంటే రాజధానికి ఎక్కువ నిధులు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక పాకేజి, పన్నుల రాయితీల వంటివి ఇవ్వాలి. 

ఆంధ్రప్రదేశ్ కు డిల్లీ తరహా రాజధానిని నిర్మిస్తామని కూడా బీజేపీ వారు హామీ ఇచ్చారు.

 సమైక్యాంధ్రప్రదేశ్లో ఆంధ్ర భాగం అభివృద్ధి చెందలేదు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సరైన ఆదాయం లేదు.

ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోకుండా తమ పెట్టుబడులను కూడా హైదరాబాద్ వద్దే కేంద్రీకరించి తప్పు చేసారు. అందుకు తగ్గ శిక్షను ఇప్పుడు అనుభవిస్తున్నారు.

ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్న విషయాలే.
..................

కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ గురించి బిల్లులో పెట్టలేదని, పేపర్ మీద మాత్రమే పెట్టారని బీజేపీ వారు అంటున్నారు.  

 అయితే, చట్టసభలో ..  అప్పటి ప్రధానమంత్రి 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే బీజేపీ వాళ్లు 10 సంవత్సరాలు ఇవ్వాలన్నారు. 

ఎన్నికలప్పుడు, తరువాత  కూడా ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ వాళ్ళు చాలాసార్లు చెప్పారు .

 అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ  చట్టసభలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలుపరచి  న్యాయం చేయవలసి ఉంది.
.................
 
హైదరాబాద్ ను  అభివృద్ధి చేసానని తాము చెప్పుకోవటమే కాని, తెలంగాణా వాళ్ళు అంతగా మెచ్చుకోవటం లేదు. హైదరాబాద్ అభివృద్ధి పట్ల మాత్రమే పనిచేసి ఆంధ్రను నిర్లక్ష్యం చేసారని ఆంధ్ర వాళ్లు అనుకుంటున్నారు.


అందువల్ల ఒక్క అమరావతి మీదే దృష్టి నిలపటం మాని, ఆంధ్రలో విజయవాడ.. గుంటూరు, తిరుపతి.. కర్నూలు, వైజాగ్.. కాకినాడ..ఇలా ప్రజలకు  అవసరమైన విధంగా చక్కగా అభివృద్ధి చేస్తే ప్రజలు సంతోషించి మెచ్చుకుంటారు. ప్రజానాయకులుగా నిలిచిఉంటారు.
......................

మీరు వ్రాసిన వ్యాఖ్యకు సంబంధించి, హామీల గురించి మీ సందేహాలు  తీరటం కొరకు ..ఇక్కడ కొన్ని లింక్స్ కూడా ఇస్తున్నాను. 

(ఈ లింక్స్ ఇవ్వవచ్చో లేదో నాకు తెలియదు. ఎవరికైనా  ఏమైనా అభ్యంతరాలుంటే దయచేసి తెలియజేయగలరు.)

.............................

Search Results
AP eminently qualifies for Special Category Status ...

ఈ క్రింద లింక్ వద్ద విడియోలు కూడా ఉన్నాయి . ..... 


Grant Special category status to Andhra Pradesh - Change.org



Special Economic Status for AP, if not special category - The ...