koodali

Wednesday, May 18, 2016

షిర్డి సాయి గురించి కొందరి అభిప్రాయాల గురించి ...

 
కొందరు ఏమంటున్నారంటే... సాయికి గురుపరంపర లేదు అంటున్నారు.

 దత్తాత్రేయుల వారు 24..గురువుల గురించి తెలియజేసారు. 
ఈ విషయాలను గమనిస్తే... గురువు కావాలంటే గురుపరంపర ఉండవలసిన అవసరం లేదని తెలుస్తుంది.

******************
షిర్డి సాయి గురించి  ప్రాచీన గ్రంధాలలో చెప్పలేదు అంటున్నారు.

 శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము గ్రంధములో షిర్డిసాయి గురించిన వివరములున్నాయి.

 ధర్మ రక్షణ కొరకు  మహిమాన్వితులు లోకానికి రావటం జరుగుతుందని కూడా పెద్దలు తెలియజేసారు. 
****************
సాయి పుట్టుక గురించి ప్రశ్నిస్తూ .. సాయి హిందువా ? ముస్లిమా ? సాయిది ఏ కులం ? ...గురించి..

ఏరులు, వీరులు, గొప్పవారి .... పుట్టుక గురించి శోధించనవసరం లేదని పెద్దలు తెలియజేసారు కదా !

 కొన్ని మతముల వారి మధ్య సయోధ్య కుదర్చటం ఎంతో అవసరమైన ఆ రోజుల్లో షిర్డి సాయి  రావటం జరిగింది.

షిర్డి సాయి ఎన్నో విధానాలను పాటించారు...

 ఉదా..అగ్నిహోత్రాన్ని వెలిగించటం ( ధుని వెలిగించటం ), విభూతిని పంచి ఇవ్వటం,  హిందూ దేవాలయాలను బాగుచేయించటం..మరియు .. అల్లాహ్ నామాన్ని స్మరించటం, మసీదులను బాగుచేయించటం..ఇలా అన్ని మతాలకు సంబంధించిన విధానాలను అవలంబించారు. 

సాయి హిందువు అని తెలిస్తే ముస్లింలు దూరమయ్యే అవకాశముంది. సాయి ముస్లిం అని తెలిస్తే హిందువులు దూరమయ్యే అవకాశముంది. 

సాయి యొక్క పుట్టుక గురించి తెలియకపోవటం వలన ...అన్ని మతముల వారు సాయిని తమవారిగా భావించటానికి అవకాశం కలిగింది. 

ఇవన్నీ గమనిస్తే షిర్డి సాయి పుట్టుక  గురించి తెలియకపోవటం మంచిదే అనిపిస్తుంది.
****************

 షిర్డి సాయికి సరిగ్గా అంత్యక్రియలు జరగలేదనే విషయం గురించి .... 

 శ్రీ దేవీ భాగవతము ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే..సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు అని తెలుస్తోంది. 

ఉదా..భారతంలో  విదురుని శరీరం పడిపోగా,  ధర్మరాజు  కలిసి విదురునికి అగ్ని సంస్కారం జరపటానికి ప్రయత్నించగా ..ఇతడు విరక్తుడు, సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు.అలా వదిలి వెళ్లిపోండి. అని అశరీరవాణి అంటుంది.

  సాయి కూడా విరక్తులే. అంత్యక్రియలు సరిగ్గా జరగలేదనటం సరికాదు. 
 
******
షిరిడిలో సాయిబాబా సమాధి ఉండటాన్ని తప్పుపడతారు.
 
 అయితే, నాకు తెలిసినంతలో, హిందువులలో ..ఎవరైనా చిన్నపిల్లలు, గర్భిణి, సన్యాసులు..వీరి  మరణానంతరం శరీరాలను దహనం చేయకుండా మట్టిలో కప్పిపెడతారట.

**************
 సాయి ఆలయాలలో ఇతర దేవతల విగ్రహాలు ఉండకూడదనే విషయం గురించి...

ఇప్పుడు సాయి ఆలయాలలో ఇతర దేవతల మూర్తులు కూడా ఉండటం వల్ల హిందువులు చక్కగా పూజలు చేసుకుంటున్నారు.

 సాయి ఆలయాలలో ఇతర దేవతామూర్తుల విగ్రహాలను తొలగిస్తే ... క్రమంగా సాయి మతం వేరేగా ఏర్పడే ప్రమాదం ఉంది.

కొందరు ఏమంటున్నారంటే, సాయిని ఆరాధించేవారు సాయిమతం ఏర్పరుచుకోండి అంటున్నారు. 

ఇప్పటికే హిందూ మతం నుంచి బౌద్ధమతం, జైన మతం ఏర్పడ్డాయి. హిందువులలో  ఇలా చీలికలు ఏర్పడటం మంచిది కాదు.
*****************
. మంచి విషయాలను కలుపుకుని ముందుకు పోవటం ప్రాచీనుల విధానంగా ఉండేది. 
.......................
వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.



Friday, May 13, 2016

మన దేశంలో ఎన్నో నదులు ఉన్నా కూడా...



భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. ఎంతో నీరు ఉంది.

 దురదృష్టం ఏమిటంటే ఆ నీటిని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోవటం లేదు. 

ఎక్కువ  నీటి వసతి లేని సింగపూర్ , ఇజ్రాయిల్ వంటి దేశాలు వాళ్ళకు ఉన్న తక్కువ నీటినే సద్వినియోగం చేసుకుంటున్నారు.

  ఇజ్రాయిల్  దేశంలో కూడా అతి తక్కువ నీరుతో చక్కగా వ్యవసాయం చేస్తున్నారంటున్నారు.

 కొద్దికాలం క్రిందట ఆంధ్రప్రదేశ్లో కుప్పం ప్రాంతంలో ఇస్రాయిల్ వారి సలహాతో వ్యవసాయం చేసారు.


భారతదేశంలో  ఎన్నో TMC ల నీటి లభ్యత ఉన్నా కూడా సమర్ధవంతంగా వినియోగించుకోవటం చేతకాక గొడవలు పడుతున్నారు.

 నీటి యొక్క ప్రాముఖ్యత తెలిసి మన పూర్వీకులు నీటిని దేవతగా పూజించారు. నీటిని పాడుచేయకుండా సంరక్షించారు. నీటిని వృధా చేస్తే లక్ష్మీదేవి నిలవదన్నారు.

 నదులను దేవతలుగా పూజించే మన దేశంలో ప్రస్తుతం  జరుగుతున్నదేమిటంటే.. 

  నదులలో  డ్రైనేజీ వదలటం, పారిశ్రామిక వ్యర్ధాలను వదలటం ద్వారా నదులను  మురికి కూపాలుగా చేసేస్తున్నారు.

  ఉదా..అత్యంత పవిత్రంగా భావించే గంగా నది పరిస్థితి చూస్తే ..చాలా  బాధ కలుగుతుంది .  

 భారతదేశం వాళ్ళు ఇలా ఎందుకు తయారయ్యారో ?

***************
 పోస్ట్ పదేపదే మార్చటం కాకుండా కొత్తగా రాయాలనుకున్న విషయాలను వ్యాఖ్యల ద్వారా వ్రాస్తున్నాను.



Wednesday, May 11, 2016

సాయిబాబా వ్యతిరేక ప్రచారం సరైనది కాదు...


సాయిబాబాను పూజించవద్దని కొద్దికాలం నుండి కొందరు ప్రచారం చేస్తున్నారు.  ఈ ప్రచారం సరైనది కాదు.

ఎందరో హిందువులు  షిర్డి సాయిని పూజిస్తున్నారు.

 శివుడు, విష్ణువు, బ్రహ్మ త్రిమూర్తుల మధ్య భేదం లేదు.. అని సనాతనధర్మం తెలియజేస్తే . ....  పాతకాలంలో కొందరు పండితులమని చెప్పుకున్నవారు  శైవులకు వైష్ణవులకు మధ్య గొడవలు సృష్టించారు. హిందువుల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి.

 హిందూ మతంలో దైవాన్ని ఎన్నో రూపాలతో పూజించుకోవచ్చు. ముక్కోటి దేవతలు ఉన్నారంటారు.

 సాయిని పూజించవద్దని  అనటం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. 

 సాయిని పూజించవద్దంటూ , సాయి విగ్రహాలు తొలగించాలని అనటం వల్ల హిందువులలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఇది మంచి పరిణామం కాదు.

సాయిని పూజించే వారు ఎవ్వరూ మతం మారటం లేదు. హిందూ మతంలోనే ఉంటూ పూజలు చేసుకుంటున్నారు.

 షిర్డి సాయి గురించి ఎన్నో విషయాలు శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము అనే గ్రంధములో  ఉన్నాయి. ఆ విషయాలు చదివితే షిర్డి సాయి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. 
........................

దత్తాత్రేయుల వారు 24 గురువుల గురించి తెలియజేసారు. గురువును దైవంగా భావించమన్నారు పెద్దలు. 

దత్తాత్రేయుల వారికి వందనములు. ఆది శంకరాచార్యుల వారికి వందనములు. షిర్డి సాయి వారికి  వందనములు.

 షిర్డి సాయి తన భక్తులకు వినాయకునిగా, శ్రీ రామునిగా, శివునిగా దర్శనమిచ్చారంటారు. 

షిర్డి సాయి  మహిమలు ఎన్నో మాకు అనుభవంలోకి వచ్చాయి.

 షిర్డిసాయి భక్తులు ఎందరో కూడా  సాయి మహిమలకు సంబంధించి  తమకు కలిగిన అనుభవాలను తెలియజేసారు. షిర్డి సాయిని వ్యతిరేకించటం సరైనది కాదు.

సాయి సాయి 

Monday, May 9, 2016

అక్షయ తృతీయ...మరియు..

అక్షయ తృతీయ రోజున సింహాచలంలో చందనోత్సవాన్ని  చేస్తారు. 
.....................

అక్షయతృతీయ నాడు దానం చేస్తే మంచిదంటారు .

 అక్షయ తృతీయ సందర్భంగా.. మంచినీరు, గొడుగు, విసనకర్ర ...వంటివి   ఇతరులకు  దానం చేస్తే మంచిదని పెద్దలు  తెలియజేసారు. 

 దానం చేయటం వల్ల దానం చేసినవారికి మంచి  జరుగుతుందని,   ఆహారం,   గృహం …వంటివి   కొరత లేకుండా లభిస్తాయని అంటారు. 
................

 అయితే  ఈ రోజుల్లో, దానం చేసే ఆచారం  తగ్గిపోయి, ఎవరికి వారు  బంగారం కొనుక్కోవటం అనే ఆచారం మాత్రమే బాగా ప్రచారంలోకి వచ్చింది. 
..........

 అక్షయతృతీయ  పండుగ  వేసవిలో  వస్తుంది.  అప్పుడు  మంచినీరు, గొడుగు, విసనకర్ర    వంటివి  దానం  చేయటం  వల్ల  ఎందరికో ఉపయోగం  కలుగుతుంది. 


పూర్వీకులు  సమాజంలో  అందరికీ  ఉపయోగపడేవిధంగా  ఎన్నో  చక్కటి  ఆచారాలను ఏర్పాటుచేసారు. 


అయితే  కాలక్రమేణా  కొన్ని  ఆచారాలు  మార్పులుచేర్పులను  సంతరించుకుని  పూర్వీకుల  అసలు  ఉద్దేశ్యాన్ని  మరుగునపరచే  విధంగా  తయారవుతున్నాయి.
..............

ఈ రోజున బంగారం  కొనుక్కోవటం  మంచిదని  కూడా  పెద్దలు తెలియజేశారు. దానితో పాటూ దానం చేస్తే మంచిదని  కూడా చెప్పారు.

అయితే ఇప్పుడు  ఇతరులకు  దానం  చేయవలసిన  విషయాలను  వదిలేసి , అక్షయతృతీయ  అంటే  బంగారం  కొనుక్కోవటమే ..అన్నట్లుగా  జరిగిపోతోంది.
 ............. 

 అంతా బాగుండాలి. అంతా దైవం దయ.

.................

నేను ఈ మాత్రం బ్లాగ్ వ్రాస్తున్నానంటే అంతా దైవం దయ. దైవానికి అనేక కృతజ్ఞతలు.

*********

 మరి కొన్ని విషయాలు ఏమిటంటే,

అపార్ట్మెంట్ క్రింద కార్ పార్కింగ్ .. స్థలంలో చండీయాగం లేక ఏదైనా యాగం చేయటాన్ని గమనిస్తే నాకు ఏమనిపించిందంటే, 

పైన ఇళ్ళలో  బాత్రూస్, బెడ్రూంస్ ఉంటాయి కదా! మరి,  పైన ఇండ్లలో మనుషులు నడుస్తున్నప్పుడు క్రింద యాగాలు చేయవచ్చా? అనే సందేహాలు కలిగాయి.

(ఈ టపా వ్రాసిన కొన్నాళ్ళకు ఈ విషయం చేర్చటం జరిగింది.) 



Friday, May 6, 2016

బెంగుళూరు పరిస్థితే అలాగయితే..


ఈ మధ్య ఒక వార్త వచ్చింది. పచ్చటి నగరమైన బెంగళూరులో పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలో మృత నగరం అయిపోతుందట.

 అంటే ప్రజలు నివసించటానికి వీలులేకుండా అయిపోతుందట. విచ్చలవిడిగా నగర జనాభా పెరగటం వల్ల అక్కడ చాలా కాలుష్యం పెరిగి ఉందంటున్నారు. 

పచ్చటి బెంగళూరు పరిస్థితే అలాగ ఉంటే ఇక మిగిలిన నగరాల సంగతి ఏమిటో ? 

 ఎంతో అభివృద్ధి జరిగిందంటున్న చైనాలో కూడా కాలుష్యం బాగా పెరిగిందట. 

మనవాళ్లు అక్కడకు వెళ్ళివచ్చి అబ్బో అక్కడి అభివృద్ధే అభివృద్ధి..  అని మెచ్చుకుంటారు. అక్కడ పెరిగిన కాలుష్యం గురించి పట్టించుకోరు.


ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెరిగిన కాలుష్యం వల్ల చాలామంది  ప్రజలకు రోగాలు బాగా పెరిగాయి. 

ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యం లేకపోయాక ఎన్ని వసతులు ఉన్నా ఏం లాభం.

 పట్టణీకరణ అంతా ఒక దగ్గరే కాకుండా వివిధ నగరాలలో అభివృద్ధి జరగాలి.

 పర్యావరణహితంగా అభివృద్ధి ఉండాలి. అప్పుడు కాలుష్యం పెరగకుండా ఉంటుంది.

ఊర్లు  మృతనగరాలు కాకుండా అమృతనగరాలు అవుతాయి.


Monday, May 2, 2016

నీటి గొడవల గురించి కొన్ని సంగతులు...మరియు..


కాకతీయులు ఎన్నో చెరువులను త్రవ్వించారంటారు .  

కాకతీయులు తెలంగాణకు మాత్రమే సంబంధించిన వారు కాదు. కాకతీయులు  తెలుగువారందరికీ  సంబంధించిన వారు.

 మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ..  చెందిన జాయప్ప సేనాని  కాకతీయ సామ్రాజ్యంలో ముఖ్యమైన వ్యక్తి. జాయపసేనాని సోదరి రుద్రమదేవికి తల్లి.


ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా కు  కూడా దాహార్తి తీరుస్తున్న ప్రాజ్రెక్ట్  నాగార్జునసాగర్ ప్రాజెక్ట్.

  నాగార్జునసాగర్ ప్రాజెక్ట్  నిర్మాణం  జరగటానికి  ఆంధ్రకు  చెందిన ముక్యాల రాజా వారి కృషి ఎంతో ఉంది. వారి చొరవ లేకపోతే లేకపోతే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వచ్చేదే కాదంటారు.


 తెలుగు వారు  బాగుపడాలని భావించి ఎన్నో కష్టాలుపడి నాగార్జునసాగర్ ఏర్పాటుకు కారకులు ఆంధ్ర వ్యక్తి. ఈ విషయాలను మర్చిపోకూడదు. 

  
ఈ రోజుల్లో డబ్బు కన్నా నీరే ముఖ్యం. డబ్బు ఇచ్చినా నీటిని  ఇచ్చే పరిస్థితి లేదు. 

అయితే, ఆంధ్రప్రదేశ్కు నీటి కొరత ఉన్నా కూడా  చెన్నై కు త్రాగునీటిని ఇవ్వటం జరిగింది.


ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను ఇవ్వటాన్ని తమిళనాడు వ్యతిరేకించటం అన్యాయం.

చిత్రమేమిటంటే, ఇవన్నీ ఎవరూ మాట్లాడటం లేదు.

...............

నదులు ప్రవహించే ప్రాంతాలు అన్నింటికి ఆ నీటిపై సమాన హక్కులు ఉంటాయి.

 నీరు దిగువ ప్రాంతాలకు రాకుండా ఎగువ రాష్ట్రాల వాళ్లే ఇబ్బడిముబ్బడిగా ఆనకట్టలు కట్టేసుకుని వాడేసుకుందామనుకుంటే అది అన్యాయం అవుతుంది.

 ట్రిబ్యునల్స్ ఉన్నాకూడా ఎగువ రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ ఆనకట్టలు ఎలా కట్టగలిగారో తెలియటం లేదు. 


 ఎవరి వాటాను వారు వాడుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.  అయితే,  నీటిని న్యాయంగా వాటాలు వేయాలి. 


 ఎగువ రాష్ట్రాల వల్ల అన్యాయం జరుగుతుందని అనిపించినప్పుడు ...దిగువ రాష్ట్రాల వాళ్ళు తమకు న్యాయంగా రావాలసిన నీటి కోసం  న్యాయపోరాటం చేయక తప్పదు.


 నీరు దిగువకు పోకుండా ఆబగా ఆనకట్టలు కట్టేసుకున్న వాళ్ళు కూడా వర్షాలు పడకపోతే నీటికోసం  ఎన్నో కష్టాలు పడుతున్నారు కదా! 


ప్రకృతి సంపద  అందరితో  పంచుకోవాలి. అంతేకానీ అంతా మనకే చెందాలనుకుని అత్యాశకు పోకూడదు. 
........................

  సముద్రంలో నదుల నీరు కలవటాన్ని వృధాగా భావించకూడదు. నదులనీరు సముద్రంలో కలవటం ఎంతో అవసరం.

 వాననీరు కాలువలు, నదుల ద్వారా సముద్రంలో కలవటం..ఎండలకు ఆ నీటిఆవిరి వర్షంగా పడటం ప్రకృతి సహజమైన చర్య.

నదులనీరు సముద్రంలో కలవకుండా ఎక్కడికక్కడ అడ్దుకట్టలు కట్టేస్తే ... సముద్రపు నీటిలో లవణగాఢత హెచ్చితే...  వాతావరణంలో  ఏం మార్పులు జరుగుతాయో చెప్పలేం.

 మనం  ప్రకృతికి అనుగుణంగా ఉంటూ నీటిని పొదుపుగా వాడుకోవాలి. అవసరమైతే నీటి వాడకాన్ని తగ్గించుకోవాలి. 

  గృహావసరాల కోసం ఎక్కువ నీరు అవసరం ఉండదు. అయితే, ఆధునిక కాలంలో పరిశ్రమలకు ఎక్కువ నీరు అవసరమవుతోంది.


నీటిపొదుపు, వృక్షాలను బాగా పెంచటం, మేఘాలను అడ్డుకుని వర్షాలను కురిపించటం కొరకు కొండలను రక్షించుకోవటం.. వంటి చర్యలను తీసుకోవటం ఎంతో అవసరం.