koodali

Friday, February 1, 2013

ఎక్కువ, తక్కువ.....తారతమ్యం...

 ఈ  బ్లాగ్ ను  ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
....................... 


 సమాజంలో   కొందరు  ,  ధనవంతులను  ఎక్కువగా   గౌరవిస్తున్నారు.  పేదవారిని  తక్కువగా  గౌరవిస్తున్నారు.   ఇంకా  ఎన్నో  విషయాలలో  మనుషుల  మధ్య   తేడాలను  చూపిస్తున్నారు. 

ఇలాంటి  విషయాల  గురించి  పురాణేతిహాసాలలోని   గొప్పవారు  ఎలా  ప్రవర్తించారో  పరిశీలిస్తే,   ఎన్నో  సంగతులు   తెలుస్తాయి.


శ్రీ  రాముడు  గుహునితో  స్నేహం  చేశారు. శబరి  అందించిన  ఫలాలను  స్వీకరించారు.
తాను  ఎక్కువ  ఇతరులు  తక్కువ  అనే  భేద  భావం  ఉండకూడదని  నిరూపించారు.



శ్రీ  కృష్ణుడు  తన  బాల్యస్నేహితుడైన  కుచేలుని  పట్ల  ఎంతో  ఆదరంగా  ప్రవర్తించారు.
 స్నేహానికి   పేద,  ధనిక  తారతమ్యం  ఉండకూడదని   నిరూపించారు. 



 పురాణేతిహాసాలలో  గొప్ప వ్యక్తులు  కొందరు  ఎన్నో  రకాల   వృత్తులను  నిర్వహించారు.

 హరిశ్చంద్రుడు  కొంతకాలం   కాటికాపరిగా  పనిచేశారు.

వాల్మీకి
మహర్షి, మహర్షిగా  మారకముందు  బోయవాడుగా  వేటాడుతూ  జీవించేవారు.

 వ్యాసమహర్షి  యొక్క   తల్లి  అయిన  సత్యవతిదేవి యొక్క  తండ్రి  ( పెంపుడు  తండ్రి )  పడవను  నడపటం,  చేపలను పట్టే  వృత్తులను   నిర్వహించేవారు.

పాండవులు   కొంతకాలం   విరాటుని  కొలువులో రకరకాల  వృత్తులను  నిర్వహించారు.

ఇవన్నీ  గమనిస్తే , మనకు  ఎన్నో  విషయాలు  తెలుస్తాయి.

 పేద  వారిని  చిన్నచూపు  చూడకూడదని  ,  ఏ  వృత్తిని  చిన్నచూపు  చూడకూడదని  తెలుస్తుంది.

*************

పాతకాలంలో కొందరు స్వార్ధపరులు, ప్రాచీన గ్రంధాలలోని విషయాలను సరిగ్గా అర్ధం చేసుకోని వారు..శూద్రులను చిన్నచూపు చూసేవారు.అంటరానితనం అనే చెడ్డ విషయాన్ని సమాజంలో ప్రవేశపెట్టారు. ఆ విధంగా శూద్రులు కష్టాలను అనుభవించారు.

 కాలక్రమేణా శూద్రులలో కూడా కొన్ని కులాలు ఏర్పడ్దాయి. కొందరు ఆర్ధికంగా అభివృద్ధి చెందారు. కొందరు ఆర్ధికంగా ఎదగలేకపోయారు. ఆర్ధికంగా ఎదిగిన శూద్రులలో కొందరు తమకన్నా ఆర్ధికంగా క్రిందస్థాయిలో ఉన్న శూద్రులను చిన్న చూపు చూడటం కూడా  జరిగింది.

 కొందరు శూద్రులు తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్న శూద్రుల పట్ల అంటరానితనాన్ని పాటించేవారు.

ఆధునిక కాలంలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 

 కొందరు ఏమంటున్నారంటే, ఆర్ధికంగా అడుగున ఉన్నవారు అన్ని కులాల్లోనూ ఉన్నారు కాబట్టి మాకూ రిజర్వేషన్లు కావాలంటున్నారు. 

 కొందరు ఏమంటున్నారంటే, పాతకాలంలో శూద్రులు వివక్షకు గురయ్యారు కాబట్టి, ఆర్ధికస్థితితో సంబంధం లేకుండా, కులాల ప్రకారమే రిజర్వేషన్లు ఉండాలని అంటున్నారు.

అలా అయితే, ఇప్పుడు శూద్రులలో ఉన్నతకులాలుగా గుర్తించబడిన కులాల వారి పూర్వీకులు వివక్షకు గురయిన వారే .. అందువల్ల ఇప్పుడు  శూద్రులలో అన్ని కులాలకూ రిజర్వేషన్లు ఇస్తారా? 

అన్నికులాల వారిలోనూ పేదరికంతో బాధలు పడుతున్న వాళ్ళెందరో ఉన్నారు.  పాతకాలమైనా, ఆధునికకాలమైనా, ఏ కులం వాళ్ళ పట్లా ఏ కారణం చేతనైనా వివక్ష ఉండకూడదు.

కొందరిని పైకి తేవటానికి మరికొందరి అవకాశాలను తగ్గించకూడదు. 

 ఒక ఉదాహరణ గమనిస్తే..  రిజర్వేషన్లు ఉన్న ఒక కుటుంబంలో తల్లితండ్రి ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు.వారు ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్నారు.

ఇంకొక కుటుంబం రిజర్వేషన్లు లేనివారు.. వాళ్ళు మధ్యతరగతికి చెందిన వాళ్ళు.

 రెండు కుటుంబాల వారి అమ్మాయిలు  ఉన్నత చదువులలో  సీటు సంపాదించడం కొరకు బాగా కష్టపడి చదివారు.  రిజర్వేషన్లు లేని అమ్మాయికి సీటు రాలేదు. రిజర్వేషన్లు ఉన్న అమ్మాయికి  సీట్ లభించింది. 

 తాను రిజర్వేషన్ లేని కులానికి చెందటం వల్లే తనకు సీట్ రాలేదని సీట్ లభించని అమ్మాయి వాపోవటం జరుగుతుంది. ఇలాంటప్పుడు మనుషుల మధ్య అసహనం, కులాల మధ్య విభేదాలు పెరిగే అవకాశముంది. 

వెనుకబడిన వారిని పైకి తేవాలంటే ప్రభుత్వాలు వారికి ఆర్ధికంగా ప్రోత్సాహకాలు కల్పించాలి. ఉన్నత చదువులలో మెరిట్ ప్రకారమే సీట్లు ఇస్తే బాగుంటుంది.

 వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావటం ఎంతో అవసరం. వారికి ఆర్ధికంగా చేయూత నివ్వాలి. అదే సమయంలో రిజర్వేషన్లు లేని కులాలలో పేదవారికి కూడా ప్రోత్సాహాలు ఇవ్వాలి. 

అందరికీ సమాన అవకాశాలుండాలి.  అందరూ బాగుండాలి.ఎవరూ పేదరికంలో బాధపడకూడదు. సమాజంలో కులాల పేరుతో  వివక్షలు ఉండకూడదు.

 రిజర్వేషన్లు ప్రవేశపెట్టబడి ఇన్నేళ్ళయినా.. దేశంలో పేదరికంతో బాధలు పడుతున్న వారెందరో ఉన్నారు.

పేదరికం పోకపోవడానికి సంపద కొందరి వద్దే ప్రోగుపడటం ముఖ్యకారణం. 

సమాజంలో అసమానతలు తగ్గాలంటే ఆర్ధిక అసమానతలు తగ్గాలి. మనుషులు సాటి మనుషుల పట్ల మానవత్వంతో ప్రవర్తించాలి. 
*******


2 comments:

  1. వారు మహానుభావులు, ఇప్పుడు మనం కాదుకదా! :)

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నా అభిప్రాయం ఏమిటంటేనండి , పేద వారిని చిన్నచూపు చూడకూడదని , ఏ వృత్తిని చిన్నచూపు చూడకూడదని పై సంఘటనల ద్వారా తెలుస్తోంది అనిపించింది..

      Delete